Delhi Liquor Scam Case Update: దేశవ్యాప్తంగా సంచనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన దిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో సౌత్ గ్రూప్లోని కీలక నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్లు రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.
మనీలాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు బెయిల్ పిటిషన్ల పై రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ తుది నిర్ణయం ప్రకటించారు. సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ల బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దిల్లీ మద్యం స్కామ్ నిందితులు మూడు నెలలగా తీహాడ్ జైలులో ఉంటున్నారు. దిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని.. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఈడీ కోరిన విషయం తెలిసిందే. తాజాగా సౌత్ గ్రూప్ నుంచి మాగుంట రాఘవను ఈడీ, గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది.
కొత్తగా అరెస్టు అయిన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. సౌత్ గ్రూప్ నిందితులకు బెయిల్ వస్తే ఇతర సాక్షులను, కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని.. బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోరింది. ఈడీ విజ్ఞప్తి మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లు రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. ఈడీ కోరిన 10 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల డబ్బుల వ్యవహారంలో మాగుంట రాఘవ పాత్ర ఉందని.. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన నిందితులతో రాఘవకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ వాదనలు వినిపించింది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: