ETV Bharat / state

నీటిపారుదల శాఖలో 628 ఇంజినీర్‌ పోస్టులు

author img

By

Published : Sep 7, 2020, 8:26 AM IST

నీటిపారుదల శాఖలో 628 ఇంజినీర్‌ పోస్టులు
నీటిపారుదల శాఖలో 628 ఇంజినీర్‌ పోస్టులు

నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టుల నుంచి కాలువల వరకు నిర్వహణకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఏఈ, జేఈల పరిధిలో మార్పులు తీసుకొస్తోంది. వారి పరిధిలో ఒక వర్క్‌ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరి కంటే ఎక్కువ మంది లష్కర్లను ఒప్పంద పద్ధతిలో నియమించనున్నారు.

కొత్త విధానంలో భాగంగా శాఖ పేరును జలవనరుల శాఖగా మార్పుచేయడంతోపాటు, ఇంజినీర్ల పోస్టులు మరో 628 పెంచాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఆరు నెలలుగా ఈ ప్రక్రియపై కసరత్తు చేస్తున్న అధికారులు, ఇంజినీర్లు ముసాయిదాకు తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన సమీక్ష అనంతరం మరికొన్ని మార్పులు చేశారు. ముసాయిదా దస్త్రానికి ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే ఈ శాసన సభ సమావేశాల్లోనే చట్టం చేయనున్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి రావడం, ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శాఖను పునర్‌వ్యవస్థీకరించాలని సీఎం సంకల్పించారు. 1.20 కోట్ల ఎకరాల ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు నీటిని తరలించే విధానంలో మార్పులు తెస్తున్నారు. క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపైనా దృష్టిసారించారు. భారీ, మధ్య, చిన్న తరహా..ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందకి తెస్తున్నారు. జిల్లా స్థాయిలో నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ)తోపాటు, అన్ని విభాగాలను సీఈ పరిధిలోకి తీసుకురానున్నారు. ఎస్‌ఈలు, ఈఈలతోపాటు క్షేత్రస్థాయి ఇంజినీర్లందరూ సీఈ పర్యవేక్షణ కింద విధులు నిర్వర్తించేలా వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది సీఈలు ఉండాలని తొలుత అనుకున్నా, ఆ సంఖ్యను 28కే పరిమితం చేయాలనే నిర్ణయానికొచ్చారు. మొత్తంగా ఇంజినీరింగ్‌ సంబంధ పోస్టులు మరో 628 పెంచాలని ఉన్నతాధికారులు ముసాయిదా సిద్ధం చేశారు.

జూనియర్‌ ఇంజినీర్ల పరిధిలో క్షేత్రస్థాయి సిబ్బంది

సాగు విస్తీర్ణం ఆధారంగా కింది స్థాయిలో జూనియర్‌ ఇంజినీర్ల పరిధిలో ఒక వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు లష్కర్లను నియమించాలని ముసాయిదాలో పేర్కొన్నట్టు సమాచారం. జూనియర్‌ ఇంజినీర్ల పరిధిని ఎకరాల వారీగా విభజించి, వారి పర్యవేక్షణలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, లష్కర్లను అవసరమైన మేరకు నియమించాలని నిర్ణయించినట్టు, ఒప్పంద పద్ధతిలో ఈ నియామకాలు జరపాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. ఒప్పంద పద్ధతా? శాశ్వత నియామకాలు చేపడుతారా? అనేది ఆర్థిక శాఖ పరిశీలన అనంతరం తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,660 మంది లష్కర్లు అవసరమని (జీవో నెం.29 ప్రకారం) గతంలో పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. తక్షణ అవసరాలకు నాలుగు వేల మంది అవసరమని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రభుత్వానికి నివేదించారు. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో 1600 పోస్టుల మంజూరు ఉండగా, 1300 మంది మాత్రమే పనిచేస్తున్నారు.

వివరాలిలా...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.