ETV Bharat / state

Farmers Problems: కొనుగోళ్ల ఊసేది... రైతుల పరిస్థితి సొమ్ము చేసుకుంటున్న దళారులు

author img

By

Published : Nov 23, 2021, 5:11 AM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి (Farmers Problems) మరింత దిగజారుతోంది. రోజుకో తీరుగా ఉన్న వాతావరణ పరిస్థితులు... రైతుల్ని వేదనకు గురిచేస్తుంటే... కొనుగోళ్ల ఊసేలేకపోవడం వల్ల ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేట్‌ వ్యాపారులు, మిల్లర్లు... అన్నదాతల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు.

Farmers Problems
Farmers Problems

రైతుల పరిస్థితి సొమ్ము చేసుకుంటున్న దళారులు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ధాన్యం రైతుల కష్టాలు (Farmers Problems) వర్ణణాతీతంగా మారాయి. ప్రభుత్వం ప్రారంభించిన కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా సాగక పంట అమ్మేందుకు నిరీక్షిస్తున్న రైతుల దీనస్థితిని... కొందరు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఉభయ జిల్లాల్లో పదిరోజుల క్రితం నుంచే వరికోతలు జోరుగా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 50 వేలు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తి చేయగా పంట చేతికొచ్చింది.

అమ్ముకునేందుకు కేంద్రాలకు తీసుకొచ్చినా... సక్రమంగా సాగడం లేదు. రోజుకో తీరుగా ఉంటున్న... వాతావరణ పరిస్థితి అన్నదాతల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి (Farmers Problems) లేక ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకునే అవకాశం లేక వ్యాపారులు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు.

అవకాశాన్ని ఆసరాగా...

అన్నదాతల అవకాశాన్ని కొందరు దళారులు, మిల్లర్లు... ఆసరా చేసుకుంటున్నారు. వివిధ రకాల కారణాల చెబుతూ తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఏ గ్రేడ్‌కి 1960, సాధారణ రకానికి 1940 ఉన్నా ఏ ఒక్క రైతుకు... ఆ ధర దక్కడం లేదు. తక్కువ ధరకే పంట కొనుగోలు చేయడం వల్ల నష్టాలే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

విమర్శలు...

కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చూపిన శ్రద్ధ ప్రస్తుతం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కర్షకులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: MLC elections in telangana 2021: ఆరుగురు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.