ETV Bharat / sports

ఓటమి నుంచి గెలుపు వైపు.. టీమ్ఇండియాకు సవాళ్లెన్నో!

author img

By

Published : Nov 9, 2021, 7:30 AM IST

టీ20 ప్రపంచకప్​(t20 world cu 2021)లో సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టి అసంఖ్యాక వీరాభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది టీమ్ఇండియా. ఇక ముందైనా ఆటగాళ్ల అలసట, జట్టు కూర్పు, ఐపీఎల్ నిర్వహణ వంటి విషయాల్లో బీసీసీఐ(bcci news) మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Team India
Team India

సూపర్‌-12 దశలో భారత్‌, నమీబియా(ind vs nam t20)ల మధ్య ఆఖరి పోరు ఆరంభం కాకముందే పొట్టి క్రికెట్‌ ప్రపంచ కప్‌(t20 world cu 2021) సమరం నుంచి విరాట్‌ సేన నిష్క్రమణ ఖరారైపోవడం అసంఖ్యాక వీరాభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. పసికూన నమీబియా(ind vs nam t20)పై నిన్న(నవంబర్ 8) చెలరేగిన విధంగా, ఆరంభం నుంచీ ఇండియా ధాటిగా ఆడి ఉంటే స్థాయికి తగినట్లు ఉండేదన్న వ్యాఖ్యలు ఏమాత్రం వంక పెట్టలేనివి.

Team India
టీమ్ఇండియా

ఆరంభంలోనే నిరాశ..

ప్రపంచ కప్‌ హోరాహోరీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌(ind vs pak t20) పై ఓటమి ఎరుగని రికార్డును భారత్‌ ఈసారీ ఖాయంగా నిలబెట్టుకుంటుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. న్యూజిలాండ్‌(ind vs nz t20) మీద పోటీలో భారత జట్టు నిలకడలేమి ఒక్కటే కాదు.. వ్యూహపరమైన తప్పిదాలూ క్రీడాభిమానుల్ని, విశ్లేషకుల్ని ఏకరీతిగా దిమ్మెరపరచాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో అఫ్గాన్‌(ind vs afg t20)పై రోహిత్‌-రాహుల్‌ ద్వయం ఆకాశమే హద్దుగా విజృంభించింది. ఆ ఉద్ధృతిని పంత్‌, హార్దిక్‌ పాండ్యా కొనసాగించడం టీవీక్షకుల చేత కేరింతలు కొట్టించింది. ఆపై స్కాట్లాండ్‌(ind vs sco t20)తో తలపడిన కోహ్లీదండు కేవలం 39 బంతుల్లోనే లక్ష్యం ఛేదించిన తీరు.. ప్రస్తుత ప్రపంచ కప్‌ పోటీల్లో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుంది. సూపర్‌-12 దశలో ఆడిన అయిదింటా అజేయంగా రాణించిన పాకిస్థాన్‌, అఫ్గాన్‌పై నిర్ణాయక పోరులో గెలుపొందిన న్యూజిలాండ్‌ రెండోగ్రూపులో తొలి రెండు స్థానాల్ని ఖరారు చేసుకోగా.. భారత జట్టు ఆశలు ఆవిరైపోయాయి. మొదటి గ్రూపులో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సెమీస్‌ అవకాశాన్ని ఒడిసిపట్టగా.. నికర పరుగుల రేటులో వెనకంజ, దక్షిణాఫ్రికా జట్టుకు తలుపులు మూసేసింది. అంచనాలకు దీటైన పాటవ ప్రదర్శనలో విఫలమై ఇండియా.. వట్టిచేతులతో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. రెంటిదీ త్రుటిలో అవకాశం చేజార్చుకున్న వ్యధే. ముఖ్యంగా ప్రత్యర్థిని బట్టి వ్యూహ సన్నద్ధత, జట్టు కూర్పు లేకపోవడమే ఇండియాకు ఇంతటి భంగపాటు తెచ్చిపెట్టిందన్నది చేదునిజం.

అదే సవాలు!

టీ20 జట్టు సారథిగా విరాట్‌ కోహ్లీ(virat kohli captaincy news), ప్రధాన శిక్షకుడిగా రవిశాస్త్రి శకం సోమవారం(నవంబర్ 8)తో ముగిసిపోయింది. జాతీయ జట్టులో స్థిరమైన ఆటతో 'వాల్‌'గా, యువక్రికెటర్లను నేర్పుగా తీర్చిదిద్దుతూ అపర ద్రోణాచార్యుడిగా గుర్తింపు పొందిన క్రీడా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌(rahul dravid news)కు ప్రధాన కోచ్‌ బాధ్యతలు దఖలుపడ్డాయి. నూతన సారథి సైదోడుగా జట్టు కూర్పు, శిక్షణలపై తనదైన ముద్ర వేయడంలో ద్రవిడ్‌ ఏ మేరకు కృతకృత్యమయ్యేదీ చూడాలి! 2007లో టీ20 మొట్టమొదటి ప్రపంచకప్‌ విజేతగా అవతరించిన ఇండియా 2014 నాటి తుదిపోరులో లంకేయులకు తలవంచింది. ముమ్మార్లు సూపర్‌-8 దశకే పరిమితమైన భారత్‌కు 2016 పోరులో సెమీస్‌ దశలోనే తల బొప్పికట్టింది. ఈసారి అంతకన్నా ముందే వెనుతిరిగిన జట్టుకు నూతన జవసత్వాలు సంతరింపజేసి 2022లో నిర్వహించనున్న టీ20(t20 world cup 2022), ఆ మరుసటి ఏడాది జరిగే యాభై ఓవర్ల ప్రపంచకప్‌(odi world cuo 2023) పోటీలకు సన్నద్ధపరచడం.. ఇప్పుడు ద్రవిడ్‌ ఎదుర్కోబోతున్న గడ్డు సవాలు.

Team India
టీమ్ఇండియా

బీసీసీఐ నిర్ణయాల్లోనూ లోపాలు!

ఇటీవలి ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌)లో చెలరేగిపోయిన రుతురాజ్‌, సిరాజ్‌, చాహల్‌ తదితరుల్ని కాదని పాత రికార్డుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ చేపట్టడం భారత విజయావకాశాల్ని దెబ్బ తీసిందని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌కే అమిత ప్రాధాన్యం ఇస్తుండటం టీమ్ఇండియా సమతూకాన్ని కుంగదీస్తున్నదని కపిల్‌దేవ్‌ ఆరోపిస్తున్నారు. వాటి లోతుపాతుల్ని కూలంకషంగా అధ్యయనం చేస్తూ.. టెస్టులు, వన్డేలు, టీ20లకు భిన్న సారథుల్ని వేర్వేరు జట్లను ఎంపిక చేయాలన్న సూచనల్నీ బీసీసీఐ(bcci news) నిశితంగా పరిశీలించాలి. తగినంత విశ్రాంతి లేకుండా పోటీల్లో పాల్గోవడం ఆటగాళ్ల లయను, ఏకాగ్రతను సడలిస్తుందనీ బోర్డు గుర్తెరగాలి. సారథి అయినా శిక్షకుడైనా కొన్నాళ్ల తరవాత మరొకరికి పగ్గాలప్పగించి తప్పుకోవాల్సిందే. వ్యక్తులు మారినా జట్టులో నిలకడ, సమతూకం, బౌలింగ్‌లో వైవిధ్యం కొనసాగేట్లు చూసుకోవడం యాజమాన్యం బాధ్యత. ఆ కర్తవ్య నిర్వహణలో ఇకనైనా బీసీసీఐ సమర్థంగా నెగ్గుకొస్తుందా?

ఇవీ చూడండి: టీ20 ప్రపంచకప్​లో వైఫల్యం.. కోహ్లీ ఆలోచనేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.