ఏటా జూన్ 23న ఒలింపిక్ దినోత్సవ పరుగు నిర్వహించడం ఆనవాయితీ. విశ్వక్రీడల ప్రాముఖ్యతను చాటి చెప్పి, దేశాల మధ్య స్నేహ సంబంధాలను మెరుగు పరచడానికి దీనిని నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ వేడుక నిర్వహణ సందిగ్ధంలో పడింది. అయితే ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ప్రతిఒక్కరు ఒలింపిక్ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్రా. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్త చర్యలు తప్పనిసరి పాటించాలని విజ్ఞప్తి చేశారు.
భారత్.. క్రీడలను చూస్తూ ఆస్వాదించే స్థాయి నుంచి స్వయంగా పతకాలు గెలుపొంది.. దేశప్రజలు గర్వించదగ్గ స్థాయికి ఎదిగిందని వెల్లడించారు బత్రా. ఈ ఘనత మన క్రీడాకారుల నిరంతర కృషి వల్లే సాధ్యమైందని కొనియాడారు. అలాంటి క్రీడాకారులను ఒలింపిక్ దినోత్సవం రోజున స్మరించుకోవడమే మనం వారికిచ్చే గౌరవమని అన్నారు. వైరస్ జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఆడటానికి సాధ్యమయ్యే క్రీడలను నిర్వహించాలని సూచించారు.
"భౌతిక దూరం పాటిస్తూ ఆడటానికి సాధ్యమయ్యే క్రీడలను నిర్వహించాలి. ముఖ్యంగా ఒలింపిక్ క్రీడాకారులు ఈ వేడుకను జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. విద్యార్థులు కూడా ఇందులో పాల్గొని ఈ ఒలింపిక్ దినోత్సవాన్ని విజయవంతం చేస్తారని అనుకుంటున్నా."
-నరీందర్ బత్రా.
ఇటీవల నరీందర్ బత్రా ఇంట్లో దాదాపు ఎనిమిది మందికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నారు.
ఇది చూడండి : ఐఓఏ అధ్యక్షుడి ఇంట్లో ఎనిమిదో వ్యక్తికి కరోనా