ETV Bharat / sports

WPL 2023: అప్పుడు ధోనీ, వార్న్​.. ఇప్పుడు హర్మన్​, లానింగ్​.. హిస్టరీ రిపీట్​ అవుతుందా?

author img

By

Published : Mar 25, 2023, 12:00 PM IST

wpl-2023-final-is-the-same-as-inaugural-ipl
wpl-2023-final-is-the-same-as-inaugural-ipl

మహిళల ప్రీమియర్​ లీగ్​ తొలి సీజన్​ చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్​లో దిల్లీతో ముంబయి తలపడనుంది. అయితే పురుషుల ఐపీఎల్​ తొలి సీజన్​ అడుగుజాడల్లో డబ్ల్యూపీఎల్​ ముగింపు దశ​ కూడా నడుస్తుందని నెటిజన్లు అంటున్నారు. అసలు ఈ రెండింటికీ సంబంధమేంటి?

ప్రపంచంలోనే ఎంతో మందిని ఆకర్షించింది ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​. 2008లో ప్రారంభమైన ఈ క్యాష్​ రిచ్​ లీగ్ తొలి మ్యాచ్ నుంచే అభిమానులకు సూపర్ ఫేవరెట్‌గా మారింది. ఈ క్రమంలోనే చాలా మంది క్రికెటర్లు, క్రికెట్​ ప్రియులు ఈ లీగ్‌కు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఐపీఎల్ నిర్వాహకులు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏళ్లు గడిచే కొద్దీ ఐపీఎల్ రేంజ్ పెరుగుతూనే వస్తోంది. ఇప్పుడు మిగతా లీగ్‌లకు అందనంత ఎత్తులో నిలిచింది.

ఐపీఎల్ మొదలైన ఇన్నేళ్ల తర్వాత మహిళలకు కూడా ఒక లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వెంట వెంటనే అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. మహిళల ప్రీమియర్ లీగ్​పై కూడా అభిమానుల ఆసక్తి పెరిగింది. వేలం పాటలో కీలకమైన ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఆ తర్వాత కొన్ని రోజులకే డబ్ల్యూపీఎల్ మొదలైంది. దీనిలో కూడా తొలి మ్యాచ్ అద్భుతంగా జరిగింది.

అచ్చం ఐపీఎల్‌లాగే తొలి మ్యాచ్ నుంచి అభిమానుల ఆసక్తి పెంచుతూ వచ్చిన డబ్ల్యూపీఎల్.. చివరి దశలో కూడా ఐపీఎల్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్‌లో యూపీ వారియర్జ్‌ను ఓడించిన ముంబయి ఇండియన్స్ ఫైనల్ చేరింది. అప్పటికే దిల్లీ క్యాపిటల్స్ జట్టు డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరుకుంది. తన ప్రత్యర్థి కోసం వెయిట్ చేస్తూ ఉంది. దిల్లీ సారధి మెగ్ లానింగ్ ఈ లీగ్ అంతా అద్భుతంగా రాణించి తమ జట్టును ఫైనల్ చేర్చింది. లీగ్​ దశలో దిల్లీ క్యాపిటల్స్​ ఎనిమిది మ్యాచుల్లో ఆరు గెలిచింది. ముంబయి ఇండియన్స్​ కూడా ఆరు మ్యాచులు గెలిచింది.

ఇక్కడే ఒక ఆసక్తికర విషయం గమనించాల్సి ఉంది. 2008లో తొలి ఐపీఎల్‌ సీజన్​లో ఫైనల్ చేరిన జట్లు ఏవో గుర్తున్నాయా? రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్. వీటిలో చెన్నైకి అప్పటి టీమ్ఇండియా కెప్టెన్ ధోనీ సారధ్యం వహిస్తుండగా.. రాజస్థాన్‌కు ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో కూడా ముంబయికి భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథిగా ఉండగా.. దిల్లీకి ఆసీస్ కెప్టెన్​ మెగ్ లానింగ్ సారథ్యం వహిస్తోంది. మరి అప్పట్లో షేన్ వార్న్ గెలిచినట్లే.. లానింగ్ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుందా? లేక హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర తిరగరాస్తుందా? అనేది మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.