ETV Bharat / sports

AFG Vs PAK: పాకిస్థాన్​కు భారీ షాక్​.. తొలి టీ20లో అఫ్గాన్​ సూపర్​ విక్టరీ

author img

By

Published : Mar 25, 2023, 8:59 AM IST

Updated : Mar 25, 2023, 9:17 AM IST

afghanistan-beat-pakistan-by-6-wickets-in-first-t20-match
afghanistan-beat-pakistan-by-6-wickets-in-first-t20-match

దాయాది దేశం పాకిస్థాన్​కు పసికూన అఫ్గానిస్థాన్​ భారీ షాక్​ ఇచ్చింది. షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో అఫ్గాన్​ విజయం సాధించింది. టీ20ల్లో పాక్​ను ఓడించడం అఫ్గాన్​కు ఇదే తొలిసారి.

అఫ్గానిస్థాన్​తో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్​కు ఘోర పరాభవం ఎదురైంది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్​లో పసికూన చేతిలో పాక్​ జట్టు.. ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే సీనియర్లు లేని లోటు.. పాకిస్థాన్​ టీమ్​పై గట్టి ప్రభావం చూపించింది. షాదాబ్​ఖాన్​ కెప్టెన్సీలో ఆ జట్టు ఘోర ప్రదర్శన కనబరించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్​ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఇమాద్‌ వసీమ్‌(18), షాదాబ్‌ ఖాన్‌(23), సయీమ్‌ అయూబ్‌(17), తయూబ్‌ తాహిర్‌(16) మాత్రమే రెండు అంకెల స్కోరు దాటారు. మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. అఫ్గాన్​ బౌలర్లలో ముజీబ్‌, నబీ, ఫజల్లా ఫరుఖీలు రెండు వికెట్లు పడగొట్టారు. అజ్మతుల్లా, నవీన్‌ హుల్‌ హక్‌, రషీద్‌ ఖాన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్​ జట్టు 17.5 ఓవరల్లోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్​ను ఛేదించేసింది. మహ్మద్​ నబీ 38 పరుగుల నాటౌట్​తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. నజీబుల్లా జర్దన్‌ 17 నాటౌట్‌, రహమనుల్లా గుర్బాజ్‌ 16 పరుగులు చేశారు. ఇషానుల్లా రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్‌ షా, ఇమాద్‌ వసీమ్‌లు చెరొక వికెట్‌ తీశారు.

కాగా, టీ20ల్లో పాకిస్థాన్​ను ఓడించడం అఫ్గానిస్థాన్​కు ఇదే తొలిసారి కావడం విశేషం. పాక్​కు కూడా టీ20ల్లో ఇది ఐదో అత్యల్ప స్కోరు. ఆల్​రౌండర్​ ప్రదర్శనతో అదరగొట్టిన మహ్మద్​ నబీ.. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు. అయితే ఆదివారం.. ఇరు జట్ల మధ్య రెండో వన్డే.. ఆదివారం జరగనుంది.

గెలిచి ఓడిన పాక్​!
సుమారు ఆరు నెలలుగా భారత, పాక్​ క్రికెట్ బోర్డుల మధ్య నలుగుతున్న ఆసియా కప్ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టే ఉంది. ఈ మెగా టోర్నీని పాకిస్థాన్​లో జరిపితే తాము వెళ్లే ప్రసక్తే లేదని పంతం పట్టిన బీసీసీఐ.. అందుకు అనుకూలంగానే తన మాట నెగ్గించుకుంది. ఇక టీమ్​ఇండియా పాకిస్థాన్​కు రావాల్సిందేనని, లేకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్​కు అక్కడికి వెళ్లబోమని చెప్పిన పాక్​.. భారత్ లేకుండానే తమ దేశంలో ఆసియా కప్​కు ఆతిథ్యం ఇవ్వనుంది.

షెడ్యూల్ ప్రకారమైతే టోర్నీ.. ఈ ఏడాది పాకిస్థాన్​ వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఈ టోర్నీని పాక్​లో నిర్వహిస్తే తాము ఆడబోమని, తటస్థ వేదిక అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ తేల్చి చెప్పింది. అందుకు అనుకూలంగానే నిర్ణయం వచ్చింది. గురువారం రాత్రి దుబాయ్ వేదికగా బీసీసీఐ, పీసీబీలతో ఏసీసీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం.. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారమే పాక్​లోనే జరుగుతుందని, కానీ భారత్ ఆడబోయే మ్యాచ్​లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతాయని ఏసీసీ వర్గాలు తెలిపాయి!

Last Updated :Mar 25, 2023, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.