ETV Bharat / sports

ఒక్క ఇన్నింగ్స్ చాలు, ఆసియా కప్​లో మునుపటి కోహ్లీని చూస్తాం

author img

By

Published : Aug 16, 2022, 8:05 PM IST

టీమ్​ఇండియా బ్యాటర్​ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మద్దతుగా నిలిచారు. వచ్చే ఆసియా కప్​లో మునుపటి కోహ్లీని చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు బౌలర్​ దీపక్ చాహర్ పునరాగమనంపై టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ మణిందర్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాహర్ చాలా టాలెంటెడ్ ఆటగాడని అన్నారు మణిందర్.

virat kohli ganguly
విరాట్ కోహ్లీ

Virat Kohli Ganguly: సుదీర్ఘకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌, కీలక బ్యాటర్​ విరాట్‌ కోహ్లీ.. కొన్ని రోజుల పాటు ఆట నుంచి విశ్రాంతి తీసుకోవాలని పెద్ద ఎత్తున అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందిస్తూ కోహ్లీకి మద్దతుగా నిలిచారు. వచ్చే ఆసియా కప్‌లో మునుపటి కోహ్లీని చూస్తామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన గంగూలీ.. కోహ్లీ ఫామ్‌ గురించి స్పందించారు. "అతన్ని(కోహ్లీ) ప్రాక్టీస్‌ చేయనివ్వండి.. మ్యాచ్‌లు ఆడనివ్వండి. అతడు చాలా గొప్ప ప్లేయర్‌. వేలాది పరుగులు చేశాడు. అతడు త్వరలోనే పుంజుకుంటాడు. సెంచరీలు చేయలేకపోవచ్చు కానీ.. ఆసియా కప్‌లో అతడిలో మునుపటి ఫామ్‌ను చూస్తామని నేను విశ్వాసంగా ఉన్నా" అని గంగూలీ చెప్పుకొచ్చారు.

కోహ్లీ బ్యాటింగ్‌పై గత కొంతకాలంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2019 నవంబరు తర్వాత నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని విరాట్‌.. అర్ధసెంచరీలకు కూడా కష్టపడాల్సి వస్తోంది. దీంతో అతడు విరామం తీసుకోవాలంటూ పలువురు విదేశీ దిగ్గజాలు ఇటీవల సూచనలు కూడా చేశారు. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కోహ్లీ ఆడాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌ సిరీస్‌లో అతడికి విశ్రాంతి కల్పించారు. ఆగస్టు 27 నుంచి జరిగే ఆసియా కప్‌ టోర్నీకి అతడిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో జరిగే జింబాబ్వే పర్యటనలో కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు.

దీపక్ చాహర్ చాలా టాలెంటెడ్ ప్లేయర్​..
Deepak Chahar: ఇంకో రెండు రోజుల్లో జింబాబ్వేతో టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. సీనియర్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీతోపాటు రెగ్యులర్‌ సారథి రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తిక్‌ తదితరులకు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. కేఎల్ రాహుల్‌, శిఖర్‌, రుతురాజ్‌, గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ వంటి బ్యాటర్లు ఉన్నారు. అదేవిధంగా చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని దీపక్‌ చాహర్‌ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌తో పాటు ఆసియా కప్‌నకూ ఎంపికయ్యాడు. అయితే దీపక్ చాహర్‌ ప్రదర్శన ఎలా ఉంటుందోననే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి చాహర్‌ మైదానంలోకి దిగలేదు. ఈ క్రమంలో చాహర్‌ పునరాగమనంపై టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ మణిందర్‌ సింగ్ ప్రత్యేకంగా విశ్లేషించాడు.

virat kohli ganguly
దీపక్ చాహర్

"గాయం కారణంగా చాలా రోజులపాటు దీపక్ చాహర్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మళ్లీ ఫామ్‌లోకి రావడం సులువేం కాదు. అందుకు ఎంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. అతడిని ఎక్కడ వాడుకోవాలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసు. అతడు చాలా టాలెంట్‌ కలిగిన ఆటగాడు" అని వివరించాడు. జింబాబ్వే కన్నా ప్రస్తుతం పర్యటనకు వచ్చిన టీమ్‌ఇండియా ఎంతో బలంగా ఉందన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే ఆత్మవిశ్వాసంతో ఉందనీ.. అందుకే పోటీనిస్తామనే యాటిట్యూడ్‌ను ప్రదర్శిస్తోందని మణిందర్ పేర్కొన్నాడు.

.

అలాగే విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంపైనా మణిందర్‌ మాట్లాడుతూ.. "విరాట్‌ లాంటి ఆటగాడు విశ్రాంతి కావాలని కోరుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. దీనిపై సెలెక్టర్లు, కోహ్లీ మధ్య సరైన అవగాహన ఉందని అనుకుంటున్నా. నెట్స్‌లో గంటలు తరబడి శ్రమించాడని గత భారత టీ20 లీగ్ సమయంలో నేనొక మాట విన్నా. అయితే.. ఇంత చేసినా తన స్థాయి ఆటను ఆడటంలో విఫలమయ్యాడు. అవే తప్పులు చేస్తూ ఉన్నాడు. అందుకే కొందరు మాజీ ఆటగాళ్లు కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. దీంతో కోహ్లీనే విరామం తీసుకుని ఉత్సాహంతో తిరిగి రావాలని భావించి ఉంటాడు. ఎవరికైనా మానసిక స్థైర్యం ఎంతో ముఖ్యం. విరాట్ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఫిజికల్‌గా ఫిట్‌ ఉండే అతడికి మళ్లీ తన ఫామ్‌ అందుకోవడానికి ఒకే ఒక్క ఇన్నింగ్స్‌ సరిపోతుంది" అని తెలిపాడు.

ఇవీ చదవండి: టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ, సుందర్​ స్థానంలో ఆడేది అతడే

స్టార్ క్రికెటర్​ ఆటకు వీడ్కోలు, సెలక్టర్స్​ వల్లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.