ETV Bharat / sports

10 ఏళ్ల తర్వాత ఐపీఎల్​లోకి శ్రీశాంత్​ రీఎంట్రీ.. కానీ ఆడేందుకు కాదు..

author img

By

Published : Mar 21, 2023, 1:26 PM IST

భారత మాజీ పేసర్‌ శాంతకుమారన్‌ శ్రీశాంత్‌కి సంబంధించి ఓ తాజా అప్డేట్​ వచ్చింది. ఈ ఆటగాడు మార్చిలో జరగబోయే ఐపీఎల్​ సీజన్​లో కనిపించనున్నాడట. కానీ, బ్యాట్​, బంతి పట్టడట. మరి ఏ కారణంతో రానున్న ఐపీఎల్​లో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడంటే..

Sreesanth In IPL 2023
ఐపీఎల్​-2023లో శాంతకుమారన్‌ శ్రీశాంత్‌

టీమ్​ఇండియా మాజీ ఫాస్ట్​ బౌలర్ శాంతకుమారన్‌ శ్రీశాంత్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్​ సీజన్​లో ఈ కేరళ ఆటగాడు దర్శనమివ్వనున్నాడట. కానీ, మ్యాచ్​లు ఆడేందుకు బ్యాట్​, బాల్​లు పట్టుకోవడానికి కాదు. ఇండియన్​ ప్రీమియర్​​ లీగ్ టోర్నమెంట్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ఛానల్​ తన ప్యానెల్​లో చర్చా సభ్యులుగా వ్యవహరించే వారి పేర్ల జాబితాను తాజాగా ప్రకటించింది. అయితే ఈ లిస్ట్​లో ఎస్.శ్రీశాంత్ పేరు కూడా ఉండడం విశేషం.

ఐపీఎల్ 2013 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు శ్రీశాంత్​. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కనిపించలేదు ఇతడు. దీంతో శ్రీశాంత్​పై అప్పట్లో మ్యాచ్​లు ఆడకుండా నిషేధం విధించింది కోర్టు. అనంతరం కేసును కొట్టివేయడంతో కాస్త ఊరట లభించింది ఇతడికి. అయితే క్రికెట్​ కెరీర్​కి శ్రీశాంత్​ విరామం చెప్పి కేవలం ఏడాది మాత్రమే అయ్యింది. ఈ నేపథ్యంలో స్టార్​ స్పోర్ట్స్​ తాజా నిర్ణయంతో సరిగ్గా పదేళ్ల తర్వాత ఐపీఎల్​లో సందడి చేయనున్నాడు ఈ కేరళ ప్లేయర్​. అయితే స్టార్ స్పోర్ట్స్ మలయాళ ఛానెల్‌లో శ్రీశాంత్ వ్యూయర్ అనలిస్ట్‌గా వ్యవహరించనున్నాడు. దీని ద్వారా 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు శ్రీశాంత్.

శ్రీశాంత్‌తో పాటు ఈసారి స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్​ జాక్వెస్ కలిస్, ఆస్ట్రేలియన్​ ఆటగాడు ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్​ క్రికెటర్స్​ కెవిన్ పీటర్సన్, పాల్ కాలింగ్‌వుడ్, మరో ఆస్ట్రేలియన్​ ఆటగాడు టామ్ మూడీ, భారత మాజీ ప్లేయర్స్​ ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్​లు కూడా కనిపించనున్నారు.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, కొచ్చిన్ టస్కర్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్​ల తరఫున ఆడిన శ్రీశాంత్ మొత్తం 44 మ్యాచుల్లో 40 వికెట్లు పడగొట్టాడు. కాగా, 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న సమయంలోనే స్పాట్ ఫిక్సింగ్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ తర్వాత శ్రీశాంత్‌పై ఐపీఎల్‌ నిర్వాహకులు నిషేధం విధించారు. ఇక ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ద్వారా మళ్లీ ఐపీఎల్‌లో కనిపిస్తాడు.

మరోవైపు గతేడాది మార్చి 9న అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్​ ప్రకటించాడు ఈ కేరళ క్రికెటర్​. అయితే టీమిండియా మాజీ పేసర్​ శ్రీశాంత్​ గతేడాది క్రికెట్​కు వీడ్కోలు పలికిన అనంతరం ఇతడిపై ప్రశంసలు కురిపించారు క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​. శ్రీశాంత్​ను ఎప్పుడూ ఎంతో నైపుణ్యం కలిగిన బౌలర్​గానే చూస్తానని అన్నారు సచిన్​. "భవిష్యత్​ తరం క్రికెటర్ల కోసం నా ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ కెరీర్​ను ముగించాలని అనుకుంటున్నాను" అని ట్వీట్​ చేశాడు శ్రీశాంత్.

స్పాట్​ ఫిక్సింగ్​ రచ్చ..
2012లో జరిగిన ఐపీఎల్​ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్​ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తప్పు అంగీకరించడం వల్ల ఇతడిపై బీసీసీఐ జీవితకాలపు నిషేధం విధించింది. కాగా, 2018లో ఇతడిపై ఉన్న బ్యాన్​ను ఎత్తివేసి, ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్​ ఆడేందుకు అనుమతిచ్చింది. 2020 సంవత్సరంతో శ్రీశాంత్​పై భారత క్రికెట్​ బోర్డు విధించిన ఏడేళ్ల నిషేధం పూర్తయింది. దీంతో 2021లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కేరళ తరఫున ప్రాతినిధ్యం వహించాడు శ్రీశాంత్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.