ETV Bharat / sports

'బ్రాడ్​మన్ తర్వాత అతడే.. అలాంటోడికి ఛాన్స్ ఇవ్వరా?'.. టెస్టు సెలెక్షన్​పై ఫైర్!

author img

By

Published : Jan 14, 2023, 8:33 PM IST

త్వరలో ఆసీస్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ భారత జట్టుని ఎంపిక చేసింది. ఇందులో సూర్యకుమార్‌ యాదవ్‌కు బదులు సర్ఫరాజ్‌ ఖాన్‌ని ఎంపిక చేసి ఉండాల్సిందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

sarfaraz-khan
sarfaraz-khan

భారత్‌, ఆసీస్‌ మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ (బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ) ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం శుక్రవారం సెలక్టర్లు 17 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించారు. యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌కు మొదటిసారి టెస్టు జట్టులోకి పిలుపొచ్చింది. అయితే, ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్​కు బదులు రంజీల్లో రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. సర్పరాజ్‌ ఖాన్‌ గత రెండు రంజీ సీజన్లలో సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. 2019-20 సీజన్‌లో 928 పరుగులు, 2021-22లో 982 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ (2022-23) సీజన్‌లో 25 ఏళ్ల సర్ఫరాజ్‌ 5, 126*, 75, 20, 162, 15*, 28* పరుగులతో మంచి ప్రదర్శన కనబరిచాడు.

'టెస్టు జట్టులో పలు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని అనుకున్నా. జాతీయ జట్టులోకి రావడానికి అతడు చేయాల్సిందంతా చేశాడు' అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్ చేశాడు. 'మీరు సూర్యకుమార్‌ను ఎంపిక చేశారు అంటే జట్టులో ఒక స్థానం ఖాళీగా ఉందని అర్థం. నా అభిప్రాయం ప్రకారం.. సర్ఫరాజ్‌కు ఆ అవకాశం లభించి ఉండాల్సింది. ఎందుకంటే.. ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ సగటు 80. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ కంటే ముందు బ్రాడ్‌మన్‌ మాత్రమే 80 లేదా అంతకంటే ఎక్కువ సగటుతో ఉన్నాడు. భారత జట్టులోకి రావడానికి సర్ఫరాజ్‌ తన శక్తి మేరకు కృషి చేశాడు. మీకు ఒక వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం ఉంటే.. నా అభిప్రాయం ప్రకారం ఆ అర్హత సర్ఫరాజ్ ఖాన్‌కే ఉంది. ఎవరైనా ఆటగాడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తే అతడికి తగిన గుర్తింపునివ్వాలి' అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

మరోవైపు, ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే సైతం సర్ఫరాజ్​కు మద్దతుగా ట్వీట్ చేశాడు. టెస్టు జట్టులోకి వచ్చేందుకు సర్ఫరాజ్ చేయాల్సిందంతా చేశాడని అన్నాడు. అటు నెటిజన్లు సైతం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయంపై మండిపడుతున్నారు. రంజీల్లో ఉత్తమ ప్రదర్శన చేసినప్పుడు జాతీయ జట్టులో చోటు ఇవ్వకపోతే ఇక లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. రంజీ టోర్నీకే ఇది అవమానకరమని మండిపడుతున్నారు. సూర్య కుమార్ యాదవ్.. వన్డేల్లోనే ఇంకా తనను తాను నిరూపించుకోలేదని, అలాంటిది టెస్టుల్లోకి ఎలా తీసుకుంటారని అడుగుతున్నారు. టీ20 ఫామ్ ఆధారంగా టెస్టు సెలెక్షన్ ఉన్నట్లు కనిపిస్తోందని మండిపడుతున్నారు.

ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, ఛెతేశ్వర్‌ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌,షమి, సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌, ఉనద్కత్‌,సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా(ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.