ETV Bharat / sports

Pant: తల్లికి సర్​ప్రైజ్​ ఇవ్వబోయి.. ఘోర రోడ్డు ప్రమాదానికి గురై.. యాక్సిడెంట్​కు కారణాలివే!

author img

By

Published : Dec 30, 2022, 2:09 PM IST

Etv Bharat
Etv Bharat

ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషబ్​ పంత్​ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడు కోలుకోవాలని అభిమానులు సహ క్రికెటర్లు ప్రార్థిస్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? పోలీసులు ఏమని అంటున్నారు? ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉంది? ఈ విషయాలపై పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది ఏమన్నారంటే ?

టీమ్‌ఇండియా క్రికెటర్‌ పంత్‌ రోడ్డు ప్రమాదం

Rishabh Pant : టీమ్‌ఇండియా క్రికెటర్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతడు తీవ్ర గాయాలతో ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే స్టార్​గా ఎదుగుతూ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్న అతడికి ఇలా జరగడం వల్ల క్రికెట్​ ప్రపంచం షాక్​కు గురైంది. అతడు కోలుకోవాలని అభిమానులు సహా క్రికెటర్లు ప్రార్థిస్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? పోలీసులు ఏమని అంటున్నారు? ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉంది? ఈ విషయాలపై పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది ఏమన్నారంటే ?

ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది?
దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పంత్​ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడగా.. అతడిని ఆసుపత్రికి తరలించారు.

అసలు కారుకు మంటలు ఎలా అంటుకున్నాయి?
కారు ప్రమాదం జరిగిన సమయంలో రిషబ్​ అతి వేగంతో డ్రైవ్​ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్​లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అతి వేగంతో అదుపు తప్పిన కారు.. ఓ డివైడర్‌కు ఢీకొట్టడం వల్ల నిమిషాల్లోనే కారంతా మంటలు వ్యాపించాయి . దీంతో అప్రమత్తమైన పంత్​ వెంటనే కారులో నుంచి దూకేశాడు. అలా తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ అతని తల, వీపుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో వైపు ప్రమాదం జరిగిన సమయంలో కారులో పంత్‌ ఒక్కడే ఉన్నట్లు తెలిసింది.

rishabh pant car accident
ప్రమాదానికి గురైన కారు

అసలు పంత్‌ నిజంగానే ప్రమాద సమయంలో నిద్ర మత్తులో ఉన్నాడా?
కారు ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్​ పంత్​ కాసేపటికి తేరుకున్నాడు. ఆ సమయంలో అతను పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్​ ప్రకారం నిజంగా కారు నడుపుతున్న సమయంలో అతను నిద్ర మత్తులోకి జారుకున్నట్లు తెలిపాడు. అదే విషయాన్ని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు.
"కారు నడుపుతున్న సమయంలో పంత్‌ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి, మంటలు అంటుకున్నాయి. వెంటనే అతన్ని రూర్కీ హాస్పిటల్‌కు తరలించారు. ఇప్పుడతన్ని అక్కడి నుంచి డెహ్రాడూన్‌ను తీసుకెళ్లారు" అని అశోక్‌ కుమార్‌ తెలిపారు.

పంత్​ పరిస్థితి ఎలా ఉందంటే?
ప్రమాదం జరిగిన సమయంలో కారు నుంచి బయటపడ్డ పంత్​ను స్థానికులు గుర్తించి హుటాహుటిన రూర్కీలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతనికి ప్రాథమిక చికిత్స చేసి ఆ తర్వాత దెహ్రాదూన్‌లోని ఓ ఆస్పత్రికి షిఫ్ట్​ చేశారు. పంత్‌కు తీవ్రమైన గాయాలు, ఫ్రాక్చర్లు కానప్పటికీ తల, మోకాళ్లకు మాత్రమే ఎక్కువ గాయాలు అయ్యాయి. ఎడమ కంటిపైన, మోకాలిపై గాయాలు ఉన్నాయి. అయితే కారు మంటల్లో చిక్కుకోవడంతో పంత్‌ వెనుక వైపు కాలిన గాయాలు అయ్యాయి. అక్కడున్న ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ సర్జన్ల పరిశీలనలో పంత్​ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు పంత్‌ చికిత్స ఖర్చు మొత్తం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం భరిస్తుందని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రకటించారు.

rishabh pant car accident
వీపు గాయాలతో రిషబ్​ పంత్​

తల్లికి సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకొని.. పంత్‌ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. పంత్‌ వస్తున్న విషయం ఆ ఇంట్లో ఎవరికీ తెలియదట. తమ తల్లికి సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకొని.. తను వస్తున్నట్లు పంత్‌ ఎవరికీ చెప్పలేదని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే అతడి కుటుంభసభ్యులు ఆస్పత్రికి బయలు దేరారు.

బీసీసీఐ ఏం చెప్పిందంటే.. పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. పంత్‌ నుదురు చిట్లినట్లు, వీపుపై కాలిన గాయాలు, కుడి మోకాలి లిగ్మెంట్‌ స్థానభ్రంశమైనట్లు ఎక్స్‌రేల్లో తెలిసినట్లు పేర్కొంది. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది. పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇతర స్కాన్‌ల కోసం ట్రీట్‌మెంట్ జరుగుతోందని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. అలాగే పంత్ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడినట్లు పేర్కొన్నారు. "రిషభ్‌ పంత్ త్వరగా కోలుకొని రావాలని ప్రార్థిస్తున్నా. ఇప్పటికే పంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడా. వైద్యులతో కూడా సంప్రదింపులు జరిపా. రిషభ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరికొన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అతడి పరిస్థితిని సునిశతంగా పరిశీలిస్తున్నాం. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సంసిద్ధంగా ఉన్నాం" అని షా ట్వీట్ చేశారు.

ఖర్చంతా భరిస్తాం.. పంత్‌ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అంతకుముందు పంత్‌కు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ ఆశిష్ యాగ్నిక్ మాట్లాడుతూ.. ‘పంత్‌కు చిన్నపాటి గాయాలు తగిలాయి. నడుము భాగంలో అయిన గాయాలకు చికిత్స అందిస్తున్నాం. పంత్‌ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు’ అని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో కారులో పంత్‌ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడని.. దీంతో వాహనంలో మంటలు చెలరేగినట్లు డీజీపీ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.