ETV Bharat / sports

IPL 2022: ప్రపంచకప్‌ గెలిచినా వేలానికి అనర్హులే! ఎందుకంటే..?

author img

By

Published : Feb 8, 2022, 1:02 PM IST

IPL 2022: ఎందరో ప్రతిభావంతులను జాతీయ జట్టుకు అందించడంలో ఐపీఎల్​ కీలక పాత్ర పోషించింది. అయితే ఇటీవలే అండర్ 19 ప్రపంచకప్​ సాధించిన భారత కుర్రాళ్లలో చాలామందికి ఈసారి ఐపీఎల్​లో ఆడే అవకాశం దక్కకపోవచ్చు. అందుకు బీసీసీఐ నిబంధనలే కారణం.

team india u19
ఐపీఎల్

IPL 2022: ఇటీవల టీమ్‌ఇండియా అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచినా అందులోని చాలా మంది యువకులు రాబోయే మెగా వేలంలో పాల్గొనేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అండర్-19 ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో పాల్గొనాలంటే బీసీసీఐ కొన్ని షరతులు విధించిన సంగతి తెలిసిందే. కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌లో ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ లేదా లిస్ట్‌-ఏ గేమ్‌ ఆడిన వారే అందుకు అర్హులు. ఒకవేళ దేశవాళీ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేకపోతే.. వేలం జరిగే తేదీ నాటికి ఆయా క్రికెటర్లు 19 ఏళ్లు కలిగి ఉండాలి.

team india u19
యువ భారత జట్టు

అయితే, ఇప్పుడు ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో కనీసం 8 మంది ఆటగాళ్లు బీసీసీఐ పేర్కొన్న అర్హతలు సాధించలేకపోయారు. దీంతో ప్రపంచకప్‌ గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన షేక్‌ రషీద్‌, దినేశ్‌ బానా, రవికుమార్‌, నిషాంత్‌ సింధు లాంటి కీలక ఆటగాళ్లు సైతం అవకాశం కోల్పోయే పరిస్థితి తలెత్తింది.

బీసీసీఐ సానుకూల నిర్ణయం?

team india u19
టీమ్‌ఇండియా అండర్‌-19

మరోవైపు ఈ విషయంపై బీసీసీఐ త్వరలోనే సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొంతకాలంగా కరోనా మహమ్మారి వల్ల దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగకపోవడమే అందుకు కారణం. మరోవైపు ఈనెల 17 నుంచి ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ మొదలవుతుండటం వల్ల ఆయా రాష్ట్ర సంఘాలు తమ ఆటగాళ్లను ఎంపిక చేసినా అవకాశం ఉండదు. ఎందుకంటే మెగా వేలం 12, 13 తేదీల్లోనే నిర్వహిస్తున్నారు.

ఇక ఈ మెగా వేలంలో మొత్తం 590 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. అందులో 228 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు.. మరో 355 మంది యువకులు ఉన్నారు. మరో ఏడుగురు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లూ ఉన్నారు.

ఇదీ చూడండి: Team India U19: కొత్తగా '19 ప్లస్​' టీమ్​.. బీసీసీఐ యోచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.