ETV Bharat / sports

వారికి ఛాన్స్​ ఇచ్చేందుకే లోయర్‌ ఆర్డర్‌లో ధోనీ.. నిజం చెప్పేసిన బ్రావో!

author img

By

Published : Apr 28, 2023, 7:03 PM IST

Why Dhoni Is Playing In Lower Order Bravo Answer
ధోనీ లోయర్​ ఆర్డర్​ ఆడటానికి కారణం చెప్పిన బ్రావో

సీఎస్​కే కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎందుకు ముందుకు రావడం లేదనే కారణాన్ని చెప్పేశాడు ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ డ్వేన్‌ బ్రావో. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..

ఐపీఎల్​-16 చెన్నై సూపర్​ కింగ్స్​ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ డ్వేన్‌ బ్రావో. ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎందుకు ముందుకు రావడం లేదు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్​ సీజన్ మ్యాచుల్లో ఎంఎస్‌ ధోనీ ఫినిషర్‌ పాత్ర పోషిస్తూ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 7 లేదా 8వ స్థానంలో దిగుతున్నాడు. అయితే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్​ సీజన్‌ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆయన ముందుకు రావాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో చివర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్న ధోనీ.. లోయర్​ ఆర్డర్​లో కాకుండా టాప్​ఆర్డర్​లో వచ్చి ఎందుకు బ్యాటింగ్​ చేయడం లేదన్న ఫ్యాన్స్​ ప్రశ్నలకు బ్రావో ఈ విధంగా బదులిచ్చాడు.

"అతడు బ్యాటింగ్‌ చేయాల్సిన స్థానం ఇదే. రాయుడు, దూబే, జడేజాలాంటి వారికి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకే ధోనీ లోయర్‌ ఆర్డర్‌లో దిగుతున్నాడు. ఒక కెప్టెన్‌గా ధోనీ తన బాధ్యతను తీసుకుని ఈ విధంగా చేస్తున్నాడు. ఫినిషింగ్‌ పాత్రను నిర్వహిస్తున్నందుకు అతడు చాలా సంతోషంగా ఉన్నాడు."
-సీఎస్​కే బౌలింగ్‌ కోచ్‌ డ్వేన్‌ బ్రావో

ఇక ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు విజయాలను తమ ఖాతాలో వేసుకుంది చెన్నై సూపర్​ కింగ్స్​. తాజాగా రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 32 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ఈ సీజన్​లో ఆర్‌ఆర్‌పై సీఎస్​కేకు ఇది రెండో ఓటమి. తదుపరి మ్యాచ్‌ ఈ నెల 30న చెన్నై వేదికగా పంజాబ్​ కింగ్స్‌తో తలపడనుంది ధోనీ సేన.

ఆ స్టేడియం చాలా ప్రత్యేకం..: ధోనీ
రాజస్థాన్​ జైపుర్​లోని సవాయి మాన్‌సింగ్‌ స్టేడియంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గురువారం ఆర్​ఆర్​తో జరిగిన మ్యాచ్​ అనంతరం ధోనీ అన్నాడు. ఎందుకంటే ధోనీ వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు(183) కొట్టింది ఈ మైదానంలోనే. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌లో షేర్ చేసింది.

"ఇది నాకెంతో ప్రత్యేకమైన స్టేడియం. తొలి వన్డే సెంచరీ నాకు వైజాగ్‌లో లభించింది. దాంతో నాకు మరో పది మ్యాచుల్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే.. ఇక్కడ (జైపుర్​ స్టేడియంలో) నేను సాధించిన 183 వ్యక్తిగత స్కోరు నాకు మరో ఏడాది టీమ్‌ఇండియాలో ఆడేందుకు స్థానం కల్పించింది. ఇదో అద్భుతమైన వేదిక.. దీనికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. నేను ఎన్నో ప్రాంతాల్లో ఆడినప్పటికీ.. ఇక్కడికి తిరిగి వచ్చి ఆడటం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది."
- ధోనీ, సీఎస్​కే కెప్టెన్​

2005లో శ్రీలంకతో జరిగిన వన్డేలో ధోనీ ధనాధన్‌ బ్యాటింగ్​తో విజృంభించాడు. ఎంతలా అంటే 15 ఫోర్లు, 10 సిక్స్​లతో 145 బంతుల్లో 183 పరుగులు చేసి అజేయంగా నిలిచి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతేకాకుండా ఈ ఇన్నింగ్స్‌తో ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. వన్డేల్లో ఓ వికెట్‌ కీపర్‌ నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేస్తే.. భారత్‌ 46.1 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.