ETV Bharat / sports

'ఫిట్​నెస్​ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి'.. IPL ఫ్రాంఛైజీలకు రోహిత్​ రిక్వెస్ట్​!

author img

By

Published : Mar 23, 2023, 2:18 PM IST

Etv ipl 20123 team india captain rohit sharma concern about players health
ipl 20123 team india captain rohit sharma concern about players health

టీమ్​ఇండియాలో పలువురు ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. అయితే గాయం అంత తీవ్రతరమైనది కాకుంటే ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడించాలనే ప్రయత్నాల్లో ఆయా జట్టు యాజమాన్యాలు ఉన్నాయి. దీంతో రోహిత్​ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అన్నాడు.

మార్చి 31వ తేదీన ఐపీఎల్ 16వ సీజన్​ ప్రారంభం కానుంది. ఇక శుక్రవారం నుంచి ప్రాక్టీస్ సెషన్‌లు కూడా ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్‌లో ఆడాల్సి ఉన్న పలు స్టార్ క్రికెటర్లు గాయాలతో టోర్నమెంట్‌కు దూరమయ్యారు. టీమ్​ఇండియాలోని పలు ప్లేయర్లు కూడా ఐపీఎల్‌కు గాయం కారణంగా దూరంకానున్నారు. గాయం అంత తీవ్రతరమైనది కాకుంటే ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడించాలనే ప్రయత్నాల్లో జట్టు యాజమాన్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఆటగాళ్లపై భారీగా ఖర్చు చేశాయి. ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్‌లో భారత్ పలు కీలక టోర్నమెంట్‌లు ఆడాల్సి ఉంది. గాయాలపాలైన ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడిస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉంది. దీనిపై టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేశాడు.

రెండు నెలల సుదీర్ఘ ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత జూన్‌లో టీమ్​ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ జరుగనుంది. దీంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్ చాలా కీలకమని రోహిత్ శర్మ చెబుతున్నాడు. భవిష్యత్తులో టీమ్​ఇండియా పలు ఐసీసీ టోర్నీల్లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌తో ఆటగాళ్లు ఫిట్‌నెస్ కోల్పోతారు కదా అన్న ప్రశ్నకు రోహిత్ శర్మ సూటిగా జవాబిచ్చాడు. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసిందని చెప్పారు. కానీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అన్నాడు. కానీ అంతిమ నిర్ణయం ఫ్రాంఛైజీలదే అని స్పష్టం చేశాడు.

"ఆటగాళ్లకు భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు కాబట్టి ఆ నిర్ణయం ఫ్రాంఛైజీలదే ఉంటుంది. అయితే ఎవరైతే గాయాలతో ఇబ్బంది పడుతున్నారో.. వారు ఏ ఐపీఎల్ జట్టుకైతే ఆడుతున్నారో ఆ జట్టు యాజమాన్యాలకు ఉన్న పరిస్థితిని వివరించాం. ఇక అంతిమ నిర్ణయం ఫ్రాంఛైజీలదే. ఇక ఆటగాళ్లు కూడా తమ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ తమ శరీరంలో మార్పులు గమనించినట్లయితే ఆయా ఫ్రాంఛైజీలతో మాట్లాడి ఒకటి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవాలి" అంటూ రోహిత్​ చెప్పుకొచ్చాడు.

అయితే టీమ్​ఇండియాలో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. జస్ప్రీత్ బుమ్రా, రిషభ్​ పంత్‌లు ఇప్పటికే దూరమయ్యారు. ఇక శ్రేయస్​అయ్యర్ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్న కచ్చితమైన ప్లేయర్లు మిస్ అయితే వారి స్థానాలను భర్తీ చేయడం కష్టతరమవుతుందున రోహిత్ అభిప్రాయపడ్డాడు. అందుకే కొంతమంది కీలక ప్లేయర్లపై దృష్టి సారించినట్లు చెప్పిన రోహిత్.. వారికి సరైన విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

సూర్యకు రోహిత్​ మద్దతు..
వన్డేల్లో వరుసగా విఫలమువుతున్న సూర్యకుమార్​ యాదవ్​కు కెప్టెన్​ రోహిత్​ శర్మ మద్దతుగా నిలిచాడు. "ఈ సిరీస్‌లో అతడు మూడు మ్యాచ్‌ల్లో మూడు బంతులు మాత్రమే ఆడాడు. దాన్ని ఎలా చూడాలో నాకు తెలీదు. మూడు వన్డేల్లోనూ అతడు అత్యంత కఠినమైన బంతులను ఎదుర్కొని ఔటయ్యాడు. అయితే మూడో మ్యాచ్‌లో సూర్య ఔటైన తీరు నేను అస్సలు ఊహించలేదు. అతడు స్పిన్‌ బాగా ఆడగలడు. గత రెండు ఏళ్లుగా స్పిన్నర్లను ఎలా ఎదుర్కొన్నాడో మనం కూడా చూశాం. అందుకే మేం అతడిని లోయర్‌ ఆర్డర్లో పంపాం. ఆఖరు 15-20 ఓవర్లలో అతడు తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటాడని భావించాం. కానీ, దురదృష్టవశాత్తూ సూర్యకుమార్‌ మూడు బంతులే ఆడాడు. ఇలా ఎవరికైనా జరగొచ్చు. అంత మాత్రాన అతని సత్తా తగ్గినట్లు కాదు. సూర్య తిరిగి అద్భుతంగా పుంజుకుంటాడని ఆశిస్తున్నా" అని రోహిత్​ శర్మ చెప్పుకొచ్చాడు. ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్​ చేరిన సూర్యకుమార్‌.. మూడో వన్డేలో అగర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.