ETV Bharat / sports

త్రీడీలో క్యాచ్‌ల వీక్షణం.. ఐపీఎల్​లో సరికొత్త టెక్నాలజీ

author img

By

Published : Apr 8, 2021, 7:28 AM IST

ఈసారి ఐపీఎల్​ వీక్షణ మరింత ప్రత్యేకంగా ఉండబోతుందని అంటున్నారు స్టార్-డిస్నీ హెడ్ (స్పోర్ట్స్) సంజోగ్ గుప్తా. సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sanjog Gupta
సంజోగ్ గుప్తా

క్యాచ్‌ను త్రీడీ కోణంలో చూస్తే ఎలా ఉంటుందో ఈసారి ఐపీఎల్‌లో చూడబోతున్నామంటున్నారు స్టార్‌-డిస్నీ హెడ్‌ (స్పోర్ట్స్‌) సంజోగ్‌ గుప్తా. ఈసారి ఐపీఎల్‌ను అత్యున్నత సాంకేతికత పరిజ్ఞానంతో అభిమానులకు అందిస్తామని ఆయన చెప్తున్నారు. క్రికెట్‌ ప్రసారంలో గతంలో ఎన్నడూ చూడని వినూత్నమైన విశేషాలకు ఐపీఎల్‌ వేదికగా నిలుస్తుందని సంజోగ్‌ 'ఈటీవీ భారత్​'తో వివరించారు.

"క్రికెట్‌ వీక్షణ విషయంలో ఈసారి ఐపీఎల్‌ ప్రత్యేకంగా ఉండబోతుంది. వికెట్ల మధ్య పరుగును కొలిచే 'ఆప్టికల్‌ ట్రాకింగ్‌ టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్నాం. దీని ద్వారా వికెట్ల మధ్య బ్యాట్స్‌మెన్‌ పరుగును కొలవొచ్చు. సింగిల్‌ తీయడంలో ఎవరెంత వేగంగా పరుగెత్తారు? డబుల్‌లో మొదటి సింగిల్‌, రెండో సింగిల్‌లో ఎవరి వేగం ఎంత? అన్నది టీవీ తెరపై కనిపిస్తుంది. ఆటగాడి ఫీల్డింగ్‌ గణాంకాలు తెలుస్తాయి. ఎన్ని క్యాచ్‌లు పట్టాడు? ఎన్ని వదిలేశాడు? 30 అడుగుల లోపల.. బయట ఎన్ని పరుగులు కాపాడాడు? అన్న విషయాలు ఎప్పటికప్పుడు వెల్లడవుతాయి. ఈ సాంకేతికతతో జట్టు బలాబలాలు, ఆటగాళ్ల ఫీల్డింగ్‌ ప్రమాణాలు ఇట్టే తెలిసిపోతాయి"

"ఇక స్టేడియాల్లో ప్రేక్షకులు ఉండరు కాబట్టి వేదికలకు అనుగుణంగా 32 నుంచి 36 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో డ్రోన్‌, బగ్గీ కెమెరాలు కూడా ఉంటాయి. సాధారణంగా అల్ట్రా మోషన్‌, స్లో మోషన్‌తో బౌండరీ దగ్గర అందుకున్న క్యాచ్‌ల్ని జూమ్‌లో చూపించొచ్చు. దీనికి 'పీరో టెక్నాలజీ'ని జోడిస్తున్నాం. అన్ని కెమెరాల క్లిప్పింగులను జోడించడం ద్వారా ఒకేసారి భిన్న కోణాల్లో క్యాచ్‌ను వీక్షించొచ్చు. ఉదాహరణకు.. 2018 ఐపీఎల్‌లో కోహ్లీ క్యాచ్‌ను బౌండరీ వద్ద ట్రెంట్‌ బౌల్ట్‌ అందుకున్నాడు. భిన్న కోణాల్లో ఈ క్యాచ్‌ను చూపించారు. క్లిప్పింగులు ఒకటి తర్వాత ఒకటి వచ్చాయి. ఈసారి అన్ని క్లిప్పింగులను కలిపి ఒకేసారి చూపిస్తాం. 3డీ కోణంలో క్యాచ్‌ను వీక్షించినట్లుగా అనిపిస్తుంది. క్యాచ్‌ను అందుకున్న ఫీల్డర్‌ చుట్టూ కెమెరా తిరుగుతున్న భావన కలుగుతుంది."

"ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌ల నిర్వహణ అనివార్యం. అయితే ప్రేక్షకులు లేని భావన క్రికెట్లకు కలగకుండా.. మ్యాచ్‌లో కేరింతలు కొట్టలేకపోతున్నామన్న బాధ అభిమానులకు లేకుండా ఏర్పాట్లు చేశాం. స్టేడియాల్లో అభిమానులు లేకపోయినా.. ఐపీఎల్‌కు టీవీ వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరగడం సానుకూలాంశం. గత ఐపీఎల్‌ 8 కోట్ల ఇళ్లలో ప్రసారమైంది. ఈసారి ఆ సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా" అని సంజోగ్‌ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.