ETV Bharat / sports

'స్మిత్​ ఛీటర్​ కాదు.. పంత్​ బ్యాటింగ్​ గార్డ్​​ను మార్చలేదు'

author img

By

Published : Jan 12, 2021, 2:27 PM IST

సిడ్నీ టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​ బ్యాటింగ్​ గార్డ్ మార్క్​ను స్టీవ్​స్మిత్​ చెరపలేదని ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​ పైన్​ తెలిపాడు. టెస్టుల్లో తరచూ అలా చేయడం స్మిత్​కు అలవాటని వెల్లడించాడు. ఆ వీడియో మరో విధంగా వైరల్​ అవ్వడం బాధ కలిగిస్తుందని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.

Smith was certainly not changing Pant's guard, says Paine
'స్మిత్​ ఛీటర్​ కాదు.. పంత్​ బ్యాటింగ్​ గార్డ్​​ను మార్చలేదు'

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్‌ రిషబ్ పంత్‌(97) బ్యాటింగ్‌ గార్డ్‌ మార్క్‌ను చెరిపేసిన స్టీవ్​ స్మిత్​ మరోసారి విమర్శల పాలయ్యాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ కావడం వల్ల ఇంకా తన దుర్బుద్ధిని మార్చుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, స్మిత్‌ అలా చేయలేదని ఆసీస్ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ వెనకేసుకొచ్చాడు. మ్యాచ్​ అనంతరం మీడియాతో మాట్లాడిన పైన్ టెస్టుల్లో స్మిత్‌ తరచూ క్రీజు వద్దకెళ్లి తాను బ్యాటింగ్‌ చేస్తున్నట్లు ఊహించుకుంటాడని చెప్పాడు. ఈ క్రమంలోనే తనకు అనుకూలంగా గార్డ్‌ మార్క్‌ను మార్చుకుంటాడని పేర్కొన్నాడు.

"ఈ విషయంపై నేను స్మిత్‌తో మాట్లాడాను. అయితే, ఆ వీడియో మరో విధంగా వైరల్‌ కావడం వల్ల అతడు బాధపడుతున్నాడు. స్మిత్‌ టెస్టు క్రికెట్‌ ఆడటం మీరు చూస్తే ప్రతి మ్యాచ్‌లో రోజుకు ఐదారుసార్లు అలా చేస్తాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పంత్‌ గార్డ్‌ మార్క్‌ను అతడు చెరిపేయలేదు. ఒకవేళ అలా చేసినా టీమ్‌ఇండియా దీనిపై ఫిర్యాదు చేసేది. కానీ, చేయలేదు. అయితే, స్మిత్‌ అలా క్రీజు వద్దకెళ్లి అతడే బ్యాటింగ్‌ చేస్తున్నట్లు గార్డ్‌ మార్క్‌ను మార్చుకోవడం నేను చాలాసార్లు చూశా."

- టిమ్ ​పైన్​, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్​

సోమవారం 98/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆదిలోనే కెప్టెన్‌ రహానె(4) వికెట్‌ కోల్పోయింది. అనంతరం వచ్చిన పంత్‌ ధాటిగా ఆడి ఆసీస్‌ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే తొలిసెషన్‌లో డ్రింక్స్‌ బ్రేక్‌ సందర్భంగా స్మిత్‌ బ్యాటింగ్‌ క్రీజు వద్దకు వచ్చి పంత్‌ చేసుకున్న మార్క్‌ను చెరిపేశాడు. అదంతా బెయిల్స్‌ కెమెరాకు చిక్కడం వల్ల విషయం బయటకు పొక్కింది. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక 2018లోనూ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా అప్పటి కెప్టెన్‌గా ఉన్న స్మిత్‌.. బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. అప్పుడు వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌తో సహా ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు.

ఇదీ చూడండి: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: మూడుకు పడిపోయిన కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.