ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్గా వివో తప్పుకున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలకు వాటిల్లే నష్టంపై చర్చలు మొదలయ్యాయి. ఐదేళ్లకు(2022 వరకూ)గాను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివో ఏడాదికి సుమారు రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లించేది. దాంట్లో సగం ఫ్రాంఛైజీలకు దక్కేది. అంటే ఒక్కో ఫ్రాంఛైజీకి రూ.20 కోట్లకు పైనే ఖాతాలో చేరేది. కానీ రాబోయే సీజన్కు వివో దూరం కావడం వల్ల ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అంత మొత్తంలో చెల్లించే మరో స్పాన్సర్ దొరకడం కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇప్పటికిప్పుడు స్పాన్సర్ దొరికినప్పటికీ వివో చెల్లించిన దాంట్లో సగం.. అంటే సుమారు రూ.220 కోట్లు మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. అలా చూసుకుంటే గతంలో కంటే ఈ ఏడాది ఒక్కో ఫ్రాంఛైజీకి టైటిల్ స్పాన్సర్ రూపంలో వచ్చే డబ్బు సుమారు రూ.10 కోట్లు తగ్గనుంది. ఇప్పటికే యూఏఈలో లీగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం సహా మ్యాచ్లకు అభిమానులను అనుమతించకూడదని అనుకుంటుండడం వల్ల టికెట్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకుంటున్న ఫ్రాంఛైజీలకు టైటిల్ స్పాన్సర్ డబ్బు వల్ల కలిగే నష్టం మింగుడుపడని అంశమే.