ETV Bharat / sports

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా: రోహిత్​

author img

By

Published : Nov 8, 2019, 12:51 PM IST

Updated : Nov 8, 2019, 6:51 PM IST

రాజ్‌కోట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో సిక్సర్ల మోత మోగించాడు టీమిండియా స్టార్​ బ్యాట్స్​మన్​ రోహిత్​శర్మ. అయితే ఈ మ్యాచ్​లో బంగ్లా బౌలర్​ మొసదెక్​ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. మ్యాచ్​ అనంతరం చాహల్​తో ఇంటర్వ్యూలో మాట్లాడిన రోహిత్​ ఆసక్తికర విషయం వెల్లడించాడు.
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా: రోహిత్​

రాజ్‌కోట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​లో విధ్వంసకర ప్రదర్శన చేసిన రోహిత్​... సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 43 బంతుల్లో 85 పరుగులు (6ఫోర్లు, 6 సిక్సర్లు) బాదేశాడు. తన ప్రదర్శనపై మ్యాచ్​ అనంతరం సహఆటగాడు చాహల్​తో ఇంటర్వ్యూలో మాట్లాడిన హిట్​మ్యాన్..​ ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు.

"తొలి మూడు బంతులు సిక్సర్లుగా మలిచాక... మిగతా బంతుల్లోనూ సిక్స్​లు బాదాలనుకున్నా. ఆ ప్రయత్నంలో నాలుగో బంతి మిస్సయ్యింది. ఇక సిక్సర్లు కాకుండా సింగిల్స్​ కోసం చూశాను. పిచ్​ పరిస్థితి చూశాక ఆఫ్​ స్పిన్​ పెద్దగా టర్న్​ సాధించట్లేదని అర్థమైంది. అందుకే క్రీజులో ఉండే బంతిని గట్టిగా బాదాలని నిర్ణయించుకున్నా".

--రోహిత్‌శర్మ, టీమిండియా తాత్కాలిక కెప్టెన్

ఈ మ్యాచ్​లో ఆల్​రౌండర్, ఆఫ్​ స్పిన్నర్​​ మొసదెక్​ హొస్సేన్​ వేసిన 10వ ఓవర్లో తొలి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు రోహిత్. కానీ తర్వాత మూడు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి. ఫలితంగా ఒక్క ఓవరే వేసిన ఇతడు 21 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఓపెనర్​ గిబ్స్​ మాత్రమే వన్డేల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో మాత్రం టీమిండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​.. 2017 టీ20 ప్రపంచకప్​లో ఈ ఫీట్​ సాధించాడు.

హిట్​మ్యాన్​ రికార్డు..

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా కెప్టెన్​గా రికార్డు సృష్టించాడు రోహిత్​. 17 ఇన్నింగ్స్​లో 37 సిక్సర్లు కొట్టాడు. ధోనీ 62 ఇన్నింగ్స్​ల్లో 34 సిక్సర్లు, విరాట్​ 26 ఇన్నింగ్స్​ల్లో 26 సిక్సర్లు తర్వాతి స్థానంలో ఉన్నారు. టీ20ల్లో అత్యధిక సిక్సుల (115) రికార్డు రోహిత్ పేరిటే ఉంది.

గురువారం(నవంబర్​ 7) జరిగిన మ్యాచ్‌లో బంగ్లా నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌శర్మ(85), శిఖర్‌ ధావన్‌(31; 27 బంతుల్లో 4సిక్సర్లు) ధాటిగా ఆడడం వల్ల భారత్‌ 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్​ల సిరీస్​ 1-1తో సమమైంది. ఇరుజట్ల మధ్య ఆఖరి మ్యాచ్​ నాగపూర్​ వేదికగా ఆదివారం జరగనుంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated :Nov 8, 2019, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.