టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో.. రోహిత్ ఇప్పటికీ 70 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడని స్పష్టంచేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. గాయంతో ఉన్నప్పటికీ ఐపీఎల్ మ్యాచ్ల్ల్ రోహిత్ శర్మ ఎందుకు ఆడాడో అతడినే అడగాలని అన్నాడు.
"రోహిత్శర్మ ఇప్పటికీ 70 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్తో లేకపోయినా ఎందుకు ఆడాడో రోహిత్నే అడగండి. అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్తో లేడు కాబట్టే వన్డేలు, టీ20లకు ఎంపికవలేదు. టెస్టు జట్టులో మాత్రమే చోటు దక్కింది. ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి మాకు తెలుసు. టీమ్ఇండియా ఫిజియోకి తెలుసు. ఎన్సీఏకు తెలుసు. ఇంకా ఎవరు తెలుసుకోవాలి? బీసీసీఐ ఎలా పనిచేస్తుందో కొందరికి తెలియదు. వృద్ధిమాన్ సాహా రెండు తొడకండరాల గాయాల గురించి బీసీసీఐ ట్రెయినర్లు, ఫిజియోతో పాటు అతడికి కూడా తెలుసు. కొందరికి గాయాల గురించి అర్థంకాదు. అందుకే ఇష్టంవచ్చినట్లు మాట్లాడతారు. టెస్టుల సమయానికి ఫిట్గా అవుతాడనే సాహాను ఆసీస్కు పంపించాం. పరిమిత ఓవర్ల జట్టులో అతడు లేడు. ఐపీఎల్ ఆసాంతం టీమ్ఇండియా ఫిజియోలు, ట్రెయినర్లు దుబాయ్లోనే ఉన్నారు. ఆటగాళ్ల గాయాల్ని నితిన్ పటేల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాడు"
--సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
తొడ కండరాల గాయం కారణంగా రోహిత్ను మొదట ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. అయితే జట్లను ప్రకటించిన రోజు నుంచి రోహిత్ నెట్స్లో కనిపించాడు. ఐపీఎల్ ఫైనల్ సహా వరుసగా మూడు మ్యాచ్లు ఆడాడు. తాను ఫిట్నెస్తో ఉన్నట్లు ప్రకటించుకున్నాడు. దీంతో రోహిత్ను ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
కీలకమైన పర్యటనకు రోహిత్ను ఎంపిక చేయకపోవడం సరికాదని.. అతడి గాయం తీవ్రత గురించి మరింత స్పష్టత అవసరమంటూ మాజీ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, వెంగ్సర్కార్, సంజయ్ మంజ్రేకర్లు ఆక్షేపించారు. రోహిత్ ఫిట్నెస్ వివాదం ముదురుతున్న నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలు, టీ20లకు రోహిత్కు విశ్రాంతినిచ్చి.. టెస్టు జట్టుకు ఎంపిక చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. భారత్-ఆసిస్ మధ్య నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.
ఇదీ చూడండి:'సరైన వ్యక్తితో నిర్బంధంలో సమయాన్ని గడుపుతున్నా!'