ETV Bharat / sports

మరో నెలపాటు అదే పదవిలో గంగూలీ!

author img

By

Published : Dec 9, 2020, 10:49 PM IST

బీసీసీఐ కీలక పదవుల్లో ఉన్న గంగూలీ అతని బృందం జనవరి వరకు కొనసాగే అవకాశం ఉంది. బీసీసీఐ రాజ్యాంగంలో ఏడు కీలక సవరణల విషయంపై జనవరి మూడో వారంలో సుప్రీంకోర్టు విచారించనుంది. దీంతో ఆ కీలక పదవుల్లో వచ్చే ఏడాది వరకు అదే బృందం కొనసాగనుంది.

BCCI bosses Ganguly, Shah to continue as SC lists next hearing in Jan
మరో నెలపాటు అదే పదవిలో గంగూలీ!

క్రికెట్​ సంస్కరణల విషయంలో రాష్ట్ర క్రికెట్​ అసోసియేషన్లు దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ దరఖాస్తులను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. కానీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ, కార్యదర్శి జై షా, ఉమ్మడి కార్యదర్శి జయేశ్​ జార్జ్​ల బృందాన్ని బోర్డులో కొనసాగింపుపై వచ్చే ఏడాదికి తీర్పు వాయిదా పడింది.

సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ రూపొందించిన క్రికెట్​ రాజ్యాంగంలో కీలకమైన సవరణలు కోరుతూ భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యున్నత న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. అయితే దీనికి సంబంధించిన తదుపరి వాదనలను జనవరి మూడో వారంలో సవరణల జాబితాను చర్చించాలని కోర్టు బుధవారం కోరింది.

"వివిధ రాష్ట్రాల క్రికెట్​ బోర్డుల నుంచి వచ్చిన అనేక దరఖాస్తులను కోర్టు బుధవారం విచారించింది. ఇందులో నిధుల దుర్వినియోగం కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొన్ని కేసులు మాత్రమే మిగిలున్నాయి. జనవరి మూడో వారంలో వీటిని జాబితా చేయమని కోర్టు కోరింది. క్రికెట్​ రాజ్యాంగ సవరణలను కోరుతూ బీసీసీఐ చేసిన దరఖాస్తును కోర్టు బుధవారం స్వీకరించలేదు." అని కోర్టు వాదనల అనంతరం రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్ల మధ్యవర్తి నరసింహ ఈ విధంగా తెలిపారు.

జనవరి వరకు అదే పదవిలో

దీంతో సౌరవ్​ గంగూలీ, అతని బృందం.. 2021 వరకు అవే పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. వీరి పదవీకాలం కొన్ని నెలల క్రితమే పూర్తయింది. డిసెంబరు 24న జరగనున్న బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశంలో జై షా, జార్జ్​లతో పాటు గంగూలీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

గరిష్ఠంగా ఆరేళ్లు

కొత్త బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఆఫీస్​-బేరర్లైన.. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్​ సెక్రటరీ, కోశాధికారులు వరుసగా ఆరేళ్ల పాటు పదవీకాలాలు పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్ల పాటు కూలింగ్​ ఆఫ్​ పీరియడ్​లోకి వెళ్తారు. అయితే ఇది నిబంధన బీసీసీఐతో పాటు రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లకు వర్తిస్తుంది.

మూడేళ్ల కూలింగ్​ ఆఫ్​ పీరియడ్​ తర్వాత తిరిగి పదవి చేపట్టడానికి అర్హులు. లోధా కమిటీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి బీసీసీఐలో గరిష్ఠంగా తొమ్మిదేళ్లు, రాష్ట్ర క్రికెట్​ సంఘాల్లో మరో తొమ్మిదేళ్లు ఆఫీసు-బేరర్​గా పనిచేయొచ్చు. కొత్త రాజ్యాంగంలోని ఏడు కీలకమైన నియమాల మార్పులలో ఇదొకటి. ఇది సవరిస్తే ప్రస్తుత ఆఫీసు-బేరర్లను కొనసాగించడానికి అనుమతిస్తుంది.

ముగిసిన పదవీకాలం

గతేడాది అక్టోబరు 23న గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ఆ పదవిలో 278 రోజులు మాత్రమే కొనసాగాల్సి ఉంది. ఎందుకంటే క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బంగాల్​ (సీఏబీ)లో 2014లో కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ పదవీకాలాన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి చేర్చగా.. ఈ ఏడాది జులై 26తో అతని పదవీకాలం పూర్తయ్యింది.

కొన్ని వార్తాపత్రికల నివేదికల ద్వారా బీసీసీఐ కార్యదర్శి జై షా.. 2013 సెప్టెంబరు 8న గుజరాత్​ క్రికెట్​ అసోసియేషన్​ (జీసీఏ) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీంతో పాటు బీసీసీఐ పదవీకాలంతో సంబంధం ఉన్న కారణంగా.. జై షా పదవీకాలం కూడా కొన్ని నెలల క్రితమే పూర్తయ్యింది.

మరోవైపు జార్జ్​ ఐదేళ్ల పాటు కేరళ క్రికెట్​ అసోసియేషన్​ (కేసీఏ) కార్యదర్శిగా, జాయింట్​ సెక్రటరీగా, కోశాధికారిగా పనిచేశారు. దీంతో పాటు బీసీసీఐ జాయింట్​ సెక్రటరీగా ఏడాది పూర్తి చేశాడు. కేసీఏ ఎన్నికల సమయమైన గతేడాది సెప్టెంబరులో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జార్జ్​.."నేను 2013 జూన్ 21 నుంచి 2018 జులై వరకు ఆఫీసు-బేరర్​గా ఉన్నాను. ఆరేళ్లు పూర్తి చేయడానికి నాకు ఇంకా 11 నెలల సమయం ఉంది" అని అన్నాడు. ఇప్పటికే అతడి పదవీకాలం ముగిసింది.

2018 జులై 7 నుంచి 2019 సెప్టెంబరు 14 మధ్య ఏ పదవిలో కొనసాగలేదు. ఆ తర్వాత 2019 సెప్టెంబరు 15న అతను కేసీఏ అధ్యక్షడయ్యాడు. 2019 అక్టోబరు 23న బీసీసీఐ జాయింట్​ సెక్రటరీగా ఎన్నికైన తర్వాత ఆ పదవిని వదులుకున్నాడు. అంటే అతడి విరామ సమయాన్ని మినహాయిస్తే క్రికెట్​ నిర్వాహకుడిగా అతడి ఆరేళ్ల పదవీకాలం పూర్తి అయ్యినట్లే. దీని ప్రకారం సెప్టెంబరు 14 నుంచి అతను కూలింప్​ ఆఫ్​ పీరియడ్​లోకి వెళ్లాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.