విశ్వవిజేత ఇంగ్లాండ్కు పరాభవం ఎదురైంది. ఆసీస్తో జరిగిన ప్రతిష్ఠాత్మక యాషెస్ తొలి టెస్టు మ్యాచ్లో పరాజయం పాలైంది ఇంగ్లీష్ జట్టు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రూట్ సేన 52.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లు నాథన్ లయన్, కమిన్స్ ధాటికి ఇంగ్లండ్ ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. 38 పరుగులు చేసిన వోక్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. జేసన్ రాయ్(28), జోయ్ రూట్(28), బర్న్(11), డెన్లీ(11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు.
ఆసీస్ బౌలర్లలో లయన్ 6 వికెట్లతో సత్తాచాటగా.. కమిన్స్ 4 వికెట్లు దక్కించుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 284, ఇంగ్లండ్ 374 పరుగులు చేశాయి. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి ఇన్నింగ్స్లో 144 పరుగులు చేసిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్లో 142 పరుగులతో సత్తాచాటాడు.
ఇవీ చూడండి.. వెటోరీ జెర్సీ రిటైర్: కివీస్ క్రికెట్ బోర్డు