ETV Bharat / sports

'HCA' ప్రక్షాళన.. పర్యవేక్షణ కమిటీ ముందున్న సవాళ్లివే!

author img

By

Published : Feb 16, 2023, 7:24 AM IST

hca polls single member committee
hca polls single member committee

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అవినీతి పరాకాష్ఠకు చేరింది. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను సుప్రీం కోర్టు.. ఏక సభ్య కమిటీకి అప్పగించింది. హెచ్​సీఏను గాడిలో పెట్టాలంటే.. జట్టులో చోటుకు ఓ రేటుతో వ్యాపారం సాగిస్తున్న అవినీతి పరులకు అడ్డుకట్ట వేయాలి. అయితే, పర్యవేక్షణ కమిటీ ముందున్న సవాళ్లివే..

హైదరాబాద్‌ రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపికవ్వాలంటే రూ.30 లక్షలు.. హైదరాబాద్‌ అండర్‌-16, 19, 25 జట్లలో చోటుకు రూ.20 లక్షలు.. 15 మందిలో ఉండాలంటే ఒక ధర.. తుది జట్టు (11)లో స్థానానికి ఇంకో రేటు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) కార్యవర్గ సభ్యులు, వారి సన్నిహితులు చాలా ఏళ్లుగా ఇలా క్రికెట్‌తో వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో ఈ వ్యాపారం కొత్త పుంతలు తొక్కింది. జట్టులో 15 మంది ఉంటే గిట్టుబాటు కావట్లేదని ఏకంగా 21 మందిని ఎంపిక చేసి రంజీ ట్రోఫీ చరిత్రలో రికార్డు సృష్టించిన ఘనత హెచ్‌సీఏది! అవినీతి పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ క్రికెట్‌ భవిష్యత్తుపై తిరిగి ఆశలు రేకెత్తిస్తోంది. హెచ్‌సీఏలోని అవినీతిపరులను పర్యవేక్షక కమిటీలోని అక్రమార్కుడిని కోర్టు ఇంటికి సాగనంపింది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)ను చక్కదిద్దిన సుంప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు (ఏకసభ్య కమిటీ)కు హైదరాబాద్‌ క్రికెట్‌ను గాడినపెట్టే బాధ్యతలను అప్పగించింది.

ఆ కమిటీతో పరిస్థితి మరింత దారుణం..
పరిపాలన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ గందరగోళంగా తయారైన ఐఓఏను జస్టిస్‌ నాగేశ్వరరావు ఇటీవలే చక్కదిద్దారు. ఐఓఏ రాజ్యాంగంలో సవరణలు చేసి కొత్త కార్యవర్గం ఎంపికకు మార్గం సుగమం చేశారు. ఫలితంగా దిగ్గజ క్రీడాకారిణి పీటీ ఉష ఐఓఏ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగలిగింది. ఐఓఏలో కొత్త శకం మొదలైంది. జస్టిస్‌ నాగేశ్వరరావు ఇప్పుడిక 'ఆపరేషన్‌ హైదరాబాద్‌'కు శ్రీకారం చుట్టనున్నారు. గాడి తప్పిన హైదరాబాద్‌ క్రికెట్‌కు చికిత్స అందించనున్నారు. అయితే హెచ్‌సీఏ సమస్య పరిష్కారం కోసం గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీతో తెలంగాణలోని ప్రతిభావంత క్రికెటర్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది.

అదే పెద్ద సవాల్​...
ప్రభుత్వ పెద్దల అండతో పర్యవేక్షక కమిటీలోని కొందరు సభ్యులు, హెచ్‌సీఏలోని అవినీతిపరులు చేతులు కలపడంతో అక్రమాలు హద్దులు దాటాయి. జట్ల ఎంపికలో ఎప్పుడూ లేనంత స్థాయిలో అవినీతి విజృంభించింది. ప్రస్తుతం జస్టిస్‌ నాగేశ్వరరావుకూ అదే సమస్య ఎదురుకావచ్చు. హెచ్‌సీఏ నిర్వహణ, క్రికెట్‌ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఆయన మాజీ క్రికెటర్ల సహాయం కోరితే కథ మళ్లీ మొదటికే రావొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అవినీతి పరులను హైదరాబాద్‌ క్రికెట్‌కు దూరంగా ఉంచడమే జస్టిస్‌ నాగేశ్వరరావు ముందున్న అతిపెద్ద సవాల్‌.

అలా చేస్తూ.. పరువు తీస్తున్నారు..
ఇక ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుంది హెచ్‌సీఏ క్లబ్‌ల పరిస్థితి. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని ఎన్నుకునే 215 క్లబ్‌ల కార్యదర్శులలో అత్యధికులది అవినీతి.. అక్రమార్జన దారే. ఎక్కువ క్లబ్‌లున్న కార్యదర్శులు ఆటగాళ్ల ఎంపిక, కాంట్రాక్టులతో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు. ఒకటి, రెండు క్లబ్‌లు కలిగిన వాళ్లు ప్రైవేటు అకాడమీలకు ఒక్కో క్లబ్‌ను సీజన్‌కు రూ.5 లక్షల చొప్పున లీజుకు ఇస్తున్నారు. ఆ క్లబ్‌ల తరఫున లీగ్‌ క్రికెట్‌ ఆడాలంటే ఆటగాళ్లు మళ్లీ డబ్బులు ఇవ్వాల్సిందే. లీజు తీసుకున్న వ్యక్తి జట్టులో ఓపెనర్‌ నుంచి 11వ నంబరు వరకు ఒక్కో స్థానానికి ఒక్కో ధరకు అమ్ముకుంటున్నాడు. దీంతో తల్లిదండ్రుల ఒత్తిడితో కొందరు.. ఆటపై ఇష్టంతో మరికొందరు ప్రైవేటు అకాడమీల్లో లక్షలు వెచ్చించి ఆట నేర్చుకుంటున్నారు. మళ్లీ డబ్బు ఖర్చు చేసి లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్నారు. లక్షలు పోసి హైదరాబాద్‌ జట్లకు ఎంపికవుతున్నారు. చివరికి దేశవాళీ టోర్నీలో పరుగులు చేయలేక, వికెట్లు తీయలేక ఘోరంగా విఫలమవుతూ హైదరాబాద్‌ క్రికెట్‌ పరువు తీస్తున్నారు.

ఆధిపత్యానికి గండికొట్టాలి..
లీగ్‌ క్రికెట్‌ ఆడాలంటే ఈ 215 జట్లే దిక్కవడం, ఈ క్లబ్‌లే ఎన్నికలను శాసిస్తుండడం, ఎక్కువ క్లబ్‌లు ఉన్న వ్యక్తులు హెచ్‌సీఏను తమ నియంత్రణలో ఉంచుకోవడం.. ఇటు క్రికెట్‌, అటు ప్రతిభావంతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. జస్టిస్‌ నాగేశ్వరరావు.. హెచ్‌సీఏ నియమావళిలో మార్పులు తెస్తే ప్రయోజనం ఉండొచ్చు. ప్రస్తుతం హెచ్‌సీఏలో 10 మంది పెద్దల దగ్గరే 70-80 క్లబ్‌లు ఉన్నాయి. వీళ్ల ఆధిపత్యాన్ని గండికొట్టాలంటే హెచ్‌సీఏ ఓటర్ల సంఖ్యను పెంచాల్సిందే. హైదరాబాద్‌ నుంచి ఎంతోమంది ఆటగాళ్లు టీమ్‌ఇండియాకు ఆడారు. ఇరానీ, దులీప్‌, రంజీ ట్రోఫీలలో బరిలో దిగారు. మహిళా క్రికెటర్లు, బీసీసీఐ ప్యానెల్‌ అంపైర్లు, స్కోరర్లు కూడా ఉన్నారు. వీళ్లందరికి ఓటు హక్కు కల్పిస్తే హెచ్‌సీఏలో ఓటర్ల సంఖ్య 600 దాటుతుంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లుంటే హెచ్‌సీఏను శాసిస్తున్న ఆ 10 మంది పెద్దలు, అవినీతిపరుల గుత్తాధిపత్యానికి తెరపడొచ్చు. ప్రశ్నించే గొంతులు పెరిగితే అవినీతి, జట్ల ఎంపికలో అక్రమాల్ని కొంత వరకైనా నియంత్రించొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.