ETV Bharat / sports

Border gavaskar trophy: కంగారులను ఢీకొట్టే టీమ్​ఇండియా వీరులెవరో?

author img

By

Published : Feb 8, 2023, 8:13 PM IST

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ఈ నెల 9న ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జట్టు తుది కూర్పు ఇలా ఉండొచ్చు.

india-australia-test-series-2023-team-india-prediction
ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ 2023

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ బెర్త్‌, ర్యాంకింగ్స్‌లో మొదటి ప్లేస్‌.. ఈ రెండు కీలక అంశాలను తేల్చే బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య గురువారం (జనవరి 9) నాగ్‌పూర్‌లో తొలి టెస్టు మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ ఇండియా తుది కూర్పు ఇలా ఉండొచ్చు అని వార్తలొస్తున్నాయి. క్రికెట్‌ విశ్లేషకుల అంచనాల ప్రకారం కంగారూలను ఢీకొట్టే 11 మంది భారతీయులు వీరే కావొచ్చు.

బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీతో రోహిత్‌ శర్మ, ప్యాట్‌ కమిన్స్‌

టీమ్‌ ఇండియా ఫైనల్‌ 11 గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే.. ఏడు ప్లేస్‌ల గురించి అంతా ఓకే.. నాలుగు స్థానాల మీదే చర్చ నడుస్తోంది. ఆ స్థానాల కోసం పోటీలో ఉన్నది శుభ్‌మన్‌ గిల్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, కె.ఎస్‌.భరత్‌, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌. వీరిలో ముగ్గురు తుది జట్టులో ఉంటారు. అయితే వాళ్లెవరూ అనేదే ఇక్కడ చర్చ. రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌కు చోటు పక్కా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ల గత ఆటతీరు, ఫామ్‌, రికార్డులు.. ఇలా ఏవి చూసుకున్నా.. వీళ్ల ప్లేస్‌ గురించి ఆలోచనే అవసరం లేదు. జడేజా గత కొన్ని నెలలుగా గాయం కారణంగా దూరంగా ఉన్నా.. ఇటీవల రంజీలో దుమ్మురేపి జట్టులోకి వచ్చాడు.

స్పిన్నర్‌ ఎవరు.. కీపర్‌ ఎవరు..
పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాల్లో తొలుత మూడో స్పిన్నర్‌ సంగతి చూద్దాం. టెస్టులు, అందులోనూ భారత్‌లో టెస్టులు అంటే మూడో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌కి ఓటేస్తారు చాలామంది. అయితే అక్షర్‌ కంటే కుల్‌దీప్‌ యాదవ్‌ అయితే బెటర్‌ అనే మాటలు వినిపిస్తున్నాయి. జడేజా, అక్షర్‌ బౌలింగ్‌ స్టయిల్‌ కాస్త దగ్గరదగ్గరగా ఉంటాయని.. అందుకే వైవిధ్యం కోసం కుల్‌దీప్‌కు చోటివ్వాలని మాజీలు సూచిస్తున్నారు. ఎలాంటి పిచ్‌ మీదనైనా బంతిని తిప్పేయడం అక్షర్‌ కంటే కుల్‌దీప్‌కే సాధ్యం అనేది చర్చ. అయితే బ్యాటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటే అక్షర్‌కే ఎక్కువ మార్కులు పడతాయి.

రెండో చర్చనీయాంశం.. కీపర్‌. రిషబ్‌ పంత్‌ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌ జరుగుతుండటంతో రేసులోకి కె.ఎస్‌.భరత్‌, ఇషాన్‌ కిషన్‌ వచ్చారు. పంత్‌ స్టైల్‌ అగ్రెసివ్‌ బ్యాటింగ్‌, కీపింగ్‌ కావాలి అనుకుంటే ఇషాన్‌ని మించిన ఆప్షన్‌ లేదు. అయితే రంజీ గేమ్స్‌లో ప్రదర్శన భరత్‌కు పాజిటివ్‌గా మారింది. ఇటు బ్యాటింగ్‌లోను, అటు కీపింగ్‌లోనూ అదరగొట్టడం.. జట్టులో చాలా రోజులు బెంచ్‌ మీద ఉండటం లాంటి అంశాలు భరత్‌కు కలిసొస్తాయి అంటున్నారు పరిశీలకులు.

.

గిల్‌ ఉంటాడా.. స్కై వస్తాడా..
గాయంతో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు దూరం అవ్వడంతో ఆ ప్లేస్‌ను ఫిల్‌ చేసే తలనొప్పి టీమ్‌ మేనేజ్‌మెంట్‌కి వచ్చింది. అయితే ఇది ప్లేయర్లు లేక కాదు.. ఆ స్థానం కోసం ఒకరికి మించి పోటీలో ఉండటమే సమస్య. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న బ్యాటర్ల పేర్లు సూర్య కుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌. ఇప్పటికే గిల్‌ టెస్టుల్లో మూడు అర్థ సెంచరీలు, ఒక సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గిల్‌, సూర్య మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఫామ్‌కి ఓటేస్తారా.. తొలి ఛాన్స్‌ ఇచ్చి టెస్టులకు 'స్కై'ని పరిచయం చేస్తారా అనేది చూడాలి.

టీమ్‌లో పంత్‌ లేని నేపథ్యంలో దూకుడైన ప్లేయర్‌ కావాలంటే సూర్య ఉండాల్సిందే. రీసెంట్‌ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుంటే గిల్‌ను తీసుకుంటారు. అప్పుడు స్కై కోరిక ఇప్పుడు నెరవేరదు. అయితే మిడిలార్డర్‌లో ఆడటానికి సిద్ధం అని కేఎల్‌ రాహుల్‌ ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఓపెనింగ్‌ స్థానం ఖాళీ అని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే శుబ్‌మన్‌కే ఫైనల్‌ 11లో చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ భరత్‌ బదులు ఇషాన్‌ను తీసుకుంటే.. అతను ఓపెనింగ్‌ చేస్తాడు కాబట్టి.. అప్పుడు సూర్యకు జట్టులో చోటు ఉండొచ్చు. గిల్‌ బెంచ్‌కే పరిమితమవుతాడు. దానికితోడు రాహుల్‌ మిడిలార్డర్‌లోనే రాణిస్తుండటంతో.. జట్టు యాజమాన్యం కొత్త ఓపెనర్‌ ఆలోచనలో పడింది అంటున్నారు. ఒకవేళ ఓపెనర్‌ అనే పాయింట్‌ చర్చకు వస్తే.. సూర్యకి కష్టమే.

ఇది కష్టమే..
అవకాశాలు తక్కువగా ఉన్నా.. చర్చలో ఉన్న మరో అంశం మూడో పేసర్‌. నాగ్‌పూర్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందని... అందుకే ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌ బరిలోకి దిగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అనూహ్యంగా ముగ్గురు పేసర్లతో భారత్‌ బరిలోకి దిగాలి అనుకుంటే అక్షర్‌/ కుల్‌దీప్‌ స్థానంలో జయదేవ్‌ ఉనద్కత్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మార్పు దాదాపు అసాధ్యం అని చెప్పాలి.

తుది జట్టు అంచనా..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కె.ఎల్‌.రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌/ శుబ్‌మన్‌ గిల్‌, కె.ఎస్‌.భరత్‌/ ఇషాన్‌ కిషన్‌ (కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ / కుల్‌దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.