కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ను కవర్ చేసేందుకు మన తెలుగు హీరోలు సిద్ధమయ్యారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా తారలంతా తెరపై వాలిపోతున్నారు. వరుస సినిమాలు విడుదలవుతున్నా ఇప్పటి వరకూ అగ్రహీరోల నుంచి ఒక్క సినిమా కూడా రాలేదనే నిరాశ మాత్రం ఉంది. దానికి చెక్ పెడుతూ.. స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ.. మన అభిమాన హీరోల రానున్న సినిమాలు.. వాళ్లు చేస్తున్న సినిమాలు.. చేతిలో ఉన్న సినిమాలేంటో తెలుసా..?
రేసులో చిరు టాపర్
వయసు ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్నారు చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 13న విడుదల కానుంది. దీని తర్వాత మోహన్రాజా దర్శకత్వంలో 'లూసిఫర్' పట్టాలెక్కనుంది.
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11030652_1.jpg)
తమిళ 'వేదాళం'కు తెలుగు రీమేక్లోనూ చిరు ప్రధానపాత్ర పోషించనున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉండగా.. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్ననట్లు చిరంజీవి గతంలోనే ప్రకటించారు. మరోవైపు.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇటీవల ప్రకటించిన 'అన్నం' చిత్రం కోసం చిరును సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఖరారు అయితే.. చిరు నుంచి అభిమానులు ఐదు సినిమాలు ఆశించవచ్చు. టాలీవుడ్లో మరే హీరో చేతిలో ఇన్ని సినిమాలు లేవు మరి.!
వెంకీ మామ జోరు
వెంకీమామ కూడా మంచి జోష్లో కనిపిస్తున్నారు. ఆయన నటించిన 'నారప్ప' మే 14న విడుదల కానుంది. తమిళంలో వచ్చి హిట్టు కొట్టిన 'అసురన్'కు రీమేక్గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్ నటిస్తున్న మరో చిత్రం 'ఎఫ్3' కూడా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11030652_2.jpg)
ఇదిలా ఉండగా.. మరో రీమేక్కు వెంకీమామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఓటీటీలో విడుదలై అందర్నీ ఆకట్టుకుంటున్న మలయాళ చిత్రం 'దృశ్యం2' ఇప్పటికే పట్టాలెక్కింది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నాగ్ మూడు చిత్రాలు..
బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తున్న అక్కినేని నాగార్జున ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చారు. ఆ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు నాగార్జున నటించిన 'వైల్డ్డాగ్' కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11030652_3.jpg)
దీంతో పాటు 'బంగార్రాజు' పేరుతో నాగార్జున హీరోగా ఒక సినిమా రాబోతోంది. తనయుడు అఖిల్తో కలిసి ఒక మల్టీస్టారర్లో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే నాగార్జునకు కథ వినిపించినట్లు సమాచారం. అయితే.. దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
నెమ్మదించిన బాలయ్య
తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేస్తున్నారు. 'బీబీ3' పేరుతో ఈ సినిమా పట్టాలెక్కుతోంది. 'గాడ్ ఫాదర్' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. మే 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహ', 'లెజెండ్' సినిమాలు ఎంతలా అలరించాయి.
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/thumb_0403newsroom_1614832905_949.jpg)
ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే.. 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో దర్శకత్వంలో బాలయ్యబాబు ఓ సినిమా చేయనున్నారు. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల సినిమాల విషయంలో బాలకృష్ణ కాస్త నెమ్మదిగా ఉన్నారు.
పవన్ కల్యాణ్ మెరుపులు..
పవన్కల్యాణ్కు రీఎంట్రీ చిత్రం 'వకీల్సాబ్'. దీనిపై భారీ అంచనాలున్నాయి. వేణుశ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ చిత్రం 'పింక్'కు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే.. పవన్ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో రానాతో కలిసి నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమాకు 'బిల్లా రంగా', 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్ను ఆలోచిస్తున్నారట.
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11030652_5.jpg)
మరోవైపు క్రిష్తో కలిసి 'హరిహర వీరమల్లు'తో అలరించేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన ఆ చిత్రం ఫస్ట్లుక్ యూట్యూబ్లో రికార్డు వీక్షణలు సొంతం చేసుకుంటోంది.
ప్రభాస్.. పాన్ ఇండియా మంత్రం
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నన్ని పాన్ ఇండియా సినిమాలు మరో హీరో చేయడం లేదు. సినిమా ప్రకటనతో పాటు విడుదల తేదీలు ప్రకటిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాధేశ్యామ్'. జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కేజీయఫ్' కెప్టెన్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో 'సలార్'లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. అది 2022 ఏప్రిల్ 14న విడుదల కానుంది.
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11030652_6.jpg)
ఇవే కాదు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్-ప్రభాస్ కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ 'ఆదిపురుష్' తెరకెక్కనుంది. వీటితో పాటు నాగ్అశ్విన్తో మరో సినిమా చేయనున్నారు ప్రభాస్.
బాలయ్య బాటలోనే మహేశ్
హీరో మహేశ్బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఆయన 'సర్కారువారి పాట'లో నటిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో కలిసి ఒక సినిమా చేయనున్నారు. నా తర్వాతి సినిమా మహేశ్తోనే అని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు.
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11030652_7.jpg)
అనిల్ రావిపూడి-మహేశ్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక స్ట్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
తారక్ @3
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11030652_8.jpg)
ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో చిత్రం పట్టాలెక్కనుంది. గతంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' మంచి విజయం సాధించింది. దీంతో మరోసారి వీళ్లిద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. దీని తర్వాత తారక్ కోసం మరో డైరెక్టర్ లైన్లో ఉన్నారు. ప్రస్తుతం 'సలార్' పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్నీల్ తర్వాతి సినిమాను తారక్తో చేయనున్నారు.
చరణ్.. లెక్క తక్కువైనా పర్లేదు
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/145106367_325109062230631_9207074828186048824_n_0502newsroom_1612522622_87.jpg)
ఓవైపు 'ఆర్ఆర్ఆర్'.. మరోవైపు 'ఆచార్య' సినిమాలతో మస్త్ బిజీగా ఉన్నారు రామ్చరణ్. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో ఒక సినిమా చేయనున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఇప్పటికే చర్చ మొదలైంది. కాగా.. చరణ్ నటిస్తున్న 'ఆచార్య' మే 13న, 'ఆర్ఆర్ఆర్' అక్టోబర్ 13న విడుదల కానున్నాయి.
బన్నీ.. రాబోయే సినిమాలు ఎన్ని..?
ఇటీవల మంచి జోష్లో ఉన్న టాలీవుడ్ హీరో ఎవరంటే.. అది అల్లు అర్జున్ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. కరోనా ఏడాది(2020)లోనూ ఆయన 'అల వైకుంఠపురములో..' చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'లో నటిస్తున్నారు. ఆగస్టు 13న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆర్య', 'ఆర్య2' చిత్రాల తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడం వల్ల భారీ అంచనాలే ఉన్నాయి.
![tollywood herose are getting ready with their movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11030652_9.jpg)
దీని తర్వాత కొరటాల శివతో ఓ క్రైమ్ థ్రిల్లర్లో బన్నీ నటించనున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రశాంత్నీల్ను కలిసి ఒక కథ చెప్పినట్లు తెలుస్తోంది. మరి దానిపై బన్నీ ఏమన్నారు..? అసలు ప్రశాంత్నీల్-బన్నీ కాంబినేషన్లో నిజంగానే సినిమా రాబోతుందా? అనే విషయాలు తెలియాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే మరి.!
ఇదీ చూడండి: మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ: నాగార్జున