ETV Bharat / sitara

నేత్రదానం చేసిన పునీత్​.. తండ్రి అడుగుజాడల్లోనే​...

author img

By

Published : Oct 29, 2021, 5:49 PM IST

గుండెపోటుతో మరణించిన పునీత్​ రాజ్​కుమార్​.. నేత్రదానం చేశారు. ఈ నిర్ణయం పట్ల అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. నటుడ్ని కొనియాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Puneeth Rajkumar donated his eyes
నేత్రదానం చేసిన పునీత్​

కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ తన కళ్లను దానం చేశారు. ఆయన తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. దిగ్గజ నటుడు డా. రాజ్​కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను వేరొకరికి దానం చేశారు.

పునీత్​ కోరిక మేరకు.. ఆయన నేత్రాలను బెంగళూరులోని నారాయణ కంటి ఆస్పత్రికి అందజేశారు. ఈ నిర్ణయం పట్ల అభిమానులు పునీత్​ను కొనియాడుతున్నారు. భావోద్వేగంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

''పునీత్​ రాజ్​కుమార్​.. ఎల్లప్పుడూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల కోసం మద్దతు ఇచ్చేవారు. రాష్ట్ర ప్రజల బాగు కోసం తపించారు. ఇప్పుడు.. మరణం తర్వాత కూడా కళ్లను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.''

- కె.సుధాకర్​, కర్ణాటక ఆరోగ్య మంత్రి

జిమ్​ చేస్తూ..

శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోయిన పునీత్​ను కుటుంబసభ్యులు హుటాహుటిన విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. పునీత్‌ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పునీత్​ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పవర్​స్టార్​ మరణంతో.. రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.

పునీత్​ రాజ్​కుమార్​ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: 'పునీత్​​' మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Puneeth Rajkumar News: ఆరు నెలల వయసులోనే సినీ అరంగేట్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.