ETV Bharat / sitara

మేరునగధీరుడు.. సెల్యులాయిడ్ కర్షకుడు.. ఆంధ్రా జేమ్స్​బాండ్

author img

By

Published : May 31, 2020, 5:29 AM IST

Updated : May 31, 2020, 7:23 AM IST

కృష్ణ
కృష్ణ

తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టంకట్టి, పడిలేచిన కెరటంలా విజృంభించిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో అభిమానులను అలరించిన ఈ మేరునగధీరుడి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాల జుట్టుతో, ఊరించే కన్నులతో నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమహేమీలుగా ఉన్న ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా, నమ్మి అంచలంచెలుగా సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగిన సుకుమారుడు, నటశేఖరుడు, పద్మవిభూషణుడు ఘట్టమనేని కృష్ణ. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టం కట్టి, సినిమాలు నిర్మించి నష్టపోయి, పడిలేచిన కెరటంలా విజృంభించి నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో అభిమానులను అలరించిన కృష్ణ.. సెల్యులాయిడ్‌ కర్షకుడు. ఈ మేరునగధీరుడి పుట్టిన రోజు ఈరోజు (మే 31). ఈ సందర్భంగా అతని సాహస ప్రస్థానం గురించి కొన్ని విషయాలు...

krishna
కృష్ణ

సినిమాల్లో తొలి అడుగులు

ఈ బుర్రిపాలెం బుల్లోడు ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో బీఎస్సీ చదువుతుండగా నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావుకు పౌరసత్కారం జరిగింది. అక్కడ అక్కినేనికి అభిమానులు పట్టిన నీరాజనాలు, అందించిన గౌరవ సత్కారాలు చూసి, తను కూడా ఒక మంచి నటుడిగా ఎదిగితే ఎంత బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడం వల్ల మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడం వల్ల తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో 'ఛైర్మన్‌' వంటి అనేక నాటికల్లో, నాటకాల్లో పాల్గొని నటనపై అవగాహన పెంచుకున్నారు.

krishna
మహేశ్, గౌతమ్​లతో కృష్ణ

ప్రముఖ దర్శక నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ తనయుడు ఆనందబాబుని కలవమని అతని మామ ఇచ్చిన సలహాతో మద్రాసులో కృష్ణ అతనిని కలిశారు. ప్రసాద్‌ అప్పుడే 'కొడుకులు - కోడళ్ళు' సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. కృష్ణని ఆ సినిమాలో ఒక పాత్రకు ఎంపికచేసి, కొంత రిహార్సల్సు కూడా నిర్వహించారు. కారణాంతరాల వలన ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. మద్రాసులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న శోభన్‌బాబుతో కలిసి కొన్ని నాటకాల్లో నటించారు కూడా. జగ్గయ్య నిర్మించిన 'పదండి ముందుకు' సినిమాలో కృష్ణ చిన్నపాత్ర పోషించారు. ఒకసారి కొడవటిగంటి కుటుంబరావుతో పాండీ బజార్లో ఉన్న కృష్ణను, కొత్తనటుల అన్వేషణలో ఉన్న దర్శకనిర్మాత శ్రీధర్‌ చూసి, 'కాదలిక్కనేరమిల్లై' (తెలుగులో 'ప్రేమించిచూడు')లో ఒక హీరోగా పరిచయం చేద్దామనుకుంటే, తమిళ భాష రాని కృష్ణకు ఆ అవకాశం చేజారి రవిచంద్రన్‌కి దక్కింది.

అనంతరం కృష్ణ 'కులగోత్రాలు', 'పరువు-ప్రతిష్ట' సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. తెనాలి తిరగి వెళ్లాక, 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఫొటోలు పంపిన కృష్ణకు మద్రాసు రమ్మని కబురొచ్చింది. స్క్రీన్‌ టెస్ట్‌ చేసి కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. కృష్ణంరాజు, జయలలిత, హేమామాలిని కూడా తనతో పాటు ఇంటర్వ్యూకి వచ్చినా వారెవరూ ఎంపిక కాలేదు. కృష్ణ అదృష్టవంతుడని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా ఉన్న కె.విశ్వనాథ్‌ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్‌ డ్యాన్సు చేయడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనెమనసులు' కృష్ణని హీరో చేసి నిలబెట్టింది. ఈ సినిమాలో కృష్ణ సరసన సుకన్య, రామ్మోహన్‌ సరసన సంధ్యారాణి నటించగా, 31 మార్చి 1965న సినిమా విడుదలై వంద రోజులు ఆడింది.

krishna
సినిమాలోని ఓ దృశ్యం

ఈ సినిమా తర్వాత కృష్ణకు ఆరు నెలలు గ్యాప్‌ వచ్చింది. తెనాలి వెళ్లిపోయారు. ఈ లోగా ఆదుర్తి కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం కృష్ణతో 'కన్నెమనసులు' ప్రారంభమైంది. అదే టైమ్‌లో బాండ్‌ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటం వల్ల, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్‌ డూండేశ్వరరావు 'గూఢచారి116' సినిమా కోసం కృష్ణకు ఆఫర్‌ ఇస్తూ ఆదుర్తిని సంప్రదించారు. ఆదుర్తి దీవెనలతో ఆ యాక్షన్‌ చిత్ర అగ్రిమెంటుపై కృష్ణ సంతకం పెట్టి నటించారు. 'కన్నెమనసులు' జులై 22, 1966న విడుదలైతే, 'గూఢచారి116' ఆగస్టు 11, 1966న విడుదలై, తొలి స్పై పిక్చర్‌ కావడం వల్ల దుమ్ము రేపింది. 'కన్నెమనసులు' యావరేజిగా ఆడింది. ఈ సినిమా తర్వాత కృష్ణ డూండీతో 25 సినిమాల దాకా చేశారు. 'తేనెమనసులు' చిత్రానికి కృష్ణ అందుకున్న తొలి పారితోషికం రెండు వేలు. 'గూఢచారి116' తర్వాత కృష్ణని అందరూ 'ఆంధ్రా జేమ్స్‌బాండ్‌' అని పిలవటం మొదలెట్టారు. ఈ చిత్ర విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాల్లో బుక్‌ అయ్యారు.

krishna
గూఢచారి 116

వటుడంతై.. అంతంతై...

'తేనెమనసులు' సినిమా ద్వారా డైలాగులు చెప్పడం, డ్యాన్సు చేయడం, స్కూటరు, కారు నడపటం, హావభావాలు చక్కగా పలకటం నేర్చుకుంటే, 'కన్నెమనసులు' చిత్రం ద్వారా ఈత కొట్టటం, గుర్రపుస్వారీ చెయ్యడం, ఫోక్‌ డ్యాన్స్‌ చేయడం నేర్చుకున్నారు కృష్ణ. ఇక 'గూఢచారి116'లో స్పీడ్‌ యాక్షన్‌ మూవ్‌మెంట్లు, తుపాకీ వాడటం, ఫైటింగులు చేయడం అలవడింది. 'గూఢచారి 116' విడుదలైన 100వ రోజు ఉదయాన విఠలాచార్య సినిమా కృష్ణ తలుపు తట్టింది. 'ఇద్దరు మొనగాళ్ళు' అనే జానపద సినిమా అది. కాంతారావుతో పాటు, 'తేనెమనసులు' సహనటులు సంధ్యారాణి, సుకన్యలతో కలిసి నటించిన ఈ చిత్రంలో చాలా భాగం కృష్ణకి మాటలే ఉండవు. 1967లో ఈ సినిమాతో కలిసి ఏకంగా ఆరు సినిమాల్లో కృష్ణ నటించారు. వీటిలో చిత్రకారుడు బాపు తీసిన పూర్తి అవుట్‌డోర్‌ చిత్రం 'సాక్షి' కృష్ణ ఇమేజ్‌ని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటి చిత్రం కూడా ఇదే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమాల్లో నటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో మొదటి నాలుగైదు చిత్రాలు కృష్ణకు పాఠాలు నేర్పాయి. విజయనిర్మలతో నాలుగైదు సినిమాలు చేయగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పరస్పర అంగీకారంతో 1969లో ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. సాహసానికి మారుపేరు కృష్ణ. తొలి 30 సంవత్సరాల్లో కృష్ణ ఏకబిగిన 296 సినిమాల్లో నటించడం ఒక అరుదైన రికార్డు. 2011లో నటనారంగం నుంచి వైదొలిగే దాకా కృష్ణ నటించిన సినిమాలు 344. ఇంత వరకు ఏ హీరో ఈ రికార్డుని బ్రేక్‌ చేయకపోవడమే ఒక రికార్డు.

krishna
కృష్ణ, విజయ నిర్మల

సొంత నిర్మాణ సంస్థ ఆవిర్భావం

1970లో పద్మాలయ సంస్థ నెలకొల్పి మొదటి ప్రయత్నంగా 'అగ్నిపరీక్ష' చిత్రాన్ని నిర్మించారు. సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు చిత్ర నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటుంటే కృష్ణ సొంత సినిమాలు నిర్మిస్తూ ఇతర సంస్థల చిత్రాల్లో నటించేవారు. 1971లో కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో నిర్మించారు. తెలుగులో ఇది తొలి సినిమాస్కోప్‌ చిత్రంగా రికార్డు సాధించింది. ఈ సినిమా సింహభాగాన్ని రాజస్థాన్‌ అడవుల్లో, హిమాచల్‌ప్రదేశ్‌లో తీశారు. ఈ చిత్రంలో కృష్ణని అభిమానులు కౌబాయ్‌గా చూసుకున్నారు. ఈ సినిమా ఖ్యాతి దేశవిదేశాలకు విస్తరించింది. 'ది ట్రెజర్‌ ఐలాండ్‌' పేరుతో ఇంగ్లీషులోకి అనువదించిన ఈ సినిమాను 125 దేశాల్లో ప్రదర్శించారు.

కృష్ణ 100వ సినిమా 'అల్లూరి సీతారామరాజు' గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 'అసాధ్యుడు' చిత్రంలో సీతారామరాజుగా కనిపించిన కృష్ణకు, ఆ కథను చిత్రంగా తీయాలనే అభిలాష కలిగింది. స్వాతంత్య్ర సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహంగా, విప్లవాగ్నులు మండించిన వీరాభిమన్యునిగా, స్వేచ్ఛా సమరశంఖమై, బ్రిటీషు సింహాసనపు పునాదుల్నే గజగజలాడించిన విప్లవ ప్రవక్తగా సీతారామరాజుని ఈ సినిమాస్కోప్‌ చిత్రంలో తీర్చిదిద్దారు కృష్ణ. భారీ బడ్జెట్‌ సినిమాలను 13 లక్షల్లో తీయగలిగే ఆ రోజుల్లోనే, కృష్ణ ఈ సినిమాకు 25 లక్షలు ఖర్చు చేశాడు. సినిమా విజయవంతమై మంచి లాభాలను ఆర్జించింది. 1982లో వచ్చిన కృష్ణ 200వ చిత్రం 'ఈనాడు' కూడా ఒక్క యుగళగీతం లేకున్నా బాగా ఆడింది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించిన 'తెలుగువీర లేవరా' కృష్ణకు 300వ చిత్రం.

కృష్ణ విశేషణాంశాలు

  • తన సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన ఈ అసాధ్యుడు డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరోగా పిలిపించుకున్నారు. 1969-72 మధ్య నాలుగేళ్లలోనే 60 చిత్రాల్లో నటించిన ఘనత పొందారు.
  • రోజూ మూడు షిఫ్టుల్లో ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటలదాకా ఏకబిగిన నటించి నిద్రలేని రాత్రులు గడిపిన సంఘటనలు కృష్ణ చలనచిత్ర ప్రస్థానంలో ఎన్నో!
  • కృష్ణ స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'సింహాసనం' సినిమా తెలుగులో తొలి 70 ఎం.ఎం. చిత్రంగా చరిత్ర పుటలకెక్కింది.
  • బప్పిలహరిని తెలుగులో సంగీత దర్శకునిగా పరిచయం చేసిన ఘనత కృష్ణదే!
  • కృష్ణ నటజీవితంలో మొత్తం 80 మంది హీరోయిన్ల సరసన నటించారు. అందులో 47 సినిమాల్లో విజయనిర్మలే హీరోయిన్‌. జయప్రద 42 చిత్రాల్లో, శ్రీదేవి 31 చిత్రాల్లో నటించి, అందమైన జోడీలుగా గుర్తింపు పొందారు.
  • 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో శ్రీశ్రీ రాసిన 'తెలుగు వీర లేవరా' పాటకు జాతీయస్థాయిల్లో ఉత్తమ గేయరచయిత బహుమతిని సాధించారు. ఒక తెలుగు చిత్రానికి జాతీయస్థాయి బహుమతి రావడం ఇదే ప్రథమం.
  • 'పండంటి కాపురం', 'దేవుడు చేసిన మనుషులు', 'పాడిపంటలు', 'రామరాజ్యంలో రక్తపాశం' వంటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించి సాహసాన్ని నిరూపించుకున్నారు.
  • ఎన్టీఆర్‌ 'దానవీర శూర కర్ణ' సినిమాకు పోటీగా 'కురుక్షేత్రం' చిత్రం నిర్మించి సంక్రాంతి కానుకగా ఒకేరోజు విడుదల చేసి ధీరుడనిపించుకున్నారు.

కృష్ణను 2009లో భారత ప్రభుత్వం 'పద్మభూషణ్‌' బిరుదుతో సత్కరించింది. కృష్ణకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మహేశ్‌బాబు అగ్రహీరోగా అలరారుతున్నారు. మంచితనం, నిజాయితీ, నిబద్దత కృష్ణకున్న సుగుణాలు. సగటు ప్రేక్షకుడి వినోద సాధనమైన సినిమా కన్నులపండువగా ఉండాలని ఆశించి, తెలుగు సినిమాకు భారీతనాన్ని చేకూర్చి, కళ్లముందు స్వప్నజగత్తును ఆవిష్కరించిన ఘనత కృష్ణదే! తెలుగు చిత్రసీమ కృష్ణకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. బుర్రిపాలెం బుల్లోడికి చిరాయురస్తు.

Last Updated :May 31, 2020, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.