ETV Bharat / sitara

Veturi: 'యమహా నగరి' పాట వెనుక ఇంత కథ ఉందా?

author img

By

Published : Jun 6, 2021, 6:45 PM IST

Updated : Jun 6, 2021, 7:05 PM IST

ప్రముఖ రచయిత వేటూరి కలం నుంచి ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. అలాంటి వాటిలో పుస్తకాలు, పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 'యమహా నగరి' పాట కూడా ఒకటి. ఆ పాటలోని సాహిత్యం శ్రోతల్ని ఇప్పటికే పరవశించేలా చేస్తూనే ఉంది. ఇటీవల కాలంలో ఓ యువ రచయిత ఆ పాటలో సాహిత్యాన్ని వర్ణిస్తూ రాసిన విశ్లేషణే ఈ స్టోరీ.

Chiranjeevi Yamaha Nagari telugu song explanation
చిరు చూడాలని ఉంది మూవీ

కోల్​కతాగా పేరు మార్చుకున్నా ఆనాటి కలకత్తా మహానగరం బెంగాల్​కు, మన దేశ రాజకీయ సంస్కృతికి కేంద్రం! 17వ శతాబ్దానికి ముందు కాలికట్ అన్న జాలర్ల గ్రామం, సుతానుతి అనే నేత పనివాళ్ల ఊరు, ఇంకా ఒకటి రెండు ఊర్లు కలిసి 100-200 సంవత్సరాలు గడిచేసరికి కలకత్తా మహానగరంగా రూపుదిద్దుకుంది.

బ్రిటిష్ వాళ్లు మన దేశంలో ఉన్న చాలా రోజులు కలకత్తానే రాజధాని. అయితే బెంగాలీల రాజకీయ చైతన్యం, స్వాతంత్ర్యం కోసం తీవ్ర పోరాటం చేయడం వల్ల వాటిని తట్టుకోలేక బ్రిటీషర్స్ తమ రాజధానిని దిల్లీకి మార్చేశారు. చరిత్రకు ఉదాహరణగా నిలిచిన ఈ మహానగరం గురించి తెలుగు సినిమాలో పాట పెట్టాలనుకోవడం.. అందులోనూ ఓ కమర్షియల్ హీరో చిత్రంలో పాటగా పెట్టడం సాహసం. అలాంటి గీతం గురించే ఈ స్టోరీ.

Chiranjeevi Yamaha Nagari telugu song
యమహానగరి పాటలో చిరంజీవి

సినిమా పాట పరిధిని సూచించే పాట ఇది. సినిమా పాట అంటే కొన్ని పరిధులకు లోబడి గీతాలు రాసుకునేలా కాకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రదేశాల గురించి, చరిత్ర కూడా రాయాల్సి వస్తుంది. అప్పుడే ఆ పాటకు గౌరవం దక్కుతుంది. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తున్న ఆ రోజుల్లో, ప్రముఖ రచయిత వేటూరికి వచ్చిన అవకాశం కలకత్తా నగరం కోసం రాయడం.

ఈ పాట సందర్భం..

ఒకతను కలకత్తా రావాల్సి ఉన్న సందర్భం, కానీ తెలియని భాష. అందుకే తెలుగులో ఒక పాట పాడితే అక్కడ ఎవరన్నా ఆ తెలుగు పాట విని, అతనికి సహాయం చేస్తారని అనుకునే సందర్భం. ఇక్కడ పాటే కదా రాయాలి అంటే ఏదోకటి తెలుగు పాట రాసేస్తే సరిపోతుంది. కానీ అలా రాసేస్తే ఆయన వేటూరి ఎందుకు అవుతారు. అతను వచ్చినది కలకత్తా నగరం కాబట్టి ఆ నగర చరిత్ర మరియు చరిత్రకారులు కోసం వర్ణిస్తూ రాసిన పాట.

జర్నలిస్ట్​గా పనిచేసిన అనుభవం, తెలుగు భాష మీద పట్టు, సంగీత జ్ఞానం, చరిత్ర మరియు చరిత్రకారుల జీవిత విశేషాలు బాగా తెలిసిన వేటూరికి ఈ పాట రాయడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటివి అప్పటికే కొన్ని పాటలు రాసి ఉన్నారు కాబట్టి. కానీ ఇలాంటి సందర్భం సృష్టించిన దర్శకుడు గుణశేఖర్ అభినందనలు.

కలకత్తా కోసం ఒకే పాటలో ఇన్ని విషయాలు పొందుపరచడం ఆ మహానుభావుడికే చెల్లింది. ఇన్ని అని ఎందుకు అన్నాను అంటే, వేటూరి గారు రాసినవి 5 చరణాలు. కానీ దర్శక, నిర్మాత మరియు సంగీత దర్శకులు వాళ్లకు ఉన్న పరిధి మేరకు మొదట రెండు చరణాలు రికార్డింగ్ చేసేసి వేటూరి బలవంతం మీద ఇంకో చరణం కలిపారు. రికార్డింగ్ చేయని, ఆ వదిలేసిన సాహిత్యంలో ఎన్ని విషయాలు ఉన్నాయో ఏమో!

చిరంజీవి మెగాస్టార్ అయ్యాక అడపాదడపా ఏవో కొన్ని కొన్ని సార్లు తన అభిరుచి మేరకు ప్రయోగాత్మక సినిమాలు చేసినా, ప్రేక్షకులు ఎక్కువ శాతం ఆదరించలేదు. అందుకే చాలావరకు కమర్షియల్ గానే చిరంజీవితో సినిమాలు చేస్తూ వస్తున్నారు దర్శక, నిర్మాతలు. పైగా సినిమాలో మొదట వచ్చే పాట ఎప్పుడూ కూడా డాన్స్​కు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటారు.

Chiranjeevi soundarya
చూడాలన ఉంది సినిమాలో చిరంజీవి, సౌందర్య

ఇప్పుడు ఈ పాటకు ట్యూన్ రూపొందించింది కొత్తగా సంగీత దర్శకత్వం మొదలుపెట్టిన మణిశర్మ. (కానీ ఈ సినిమా మణిశర్మ కి రెండవ సినిమాగా రిలీజ్ అయ్యింది). అందులోనూ చాలా పెద్ద బ్యానర్ వైజయంతి మూవీస్. సంగీతాభిరుచి ఉన్న నిర్మాత అశ్వినీదత్. ఈయన సినిమాలు కొన్ని కొన్ని సరిగ్గా ప్రేక్షకాదరణ పొందకపోయిన, పాటలు మాత్రం ఎప్పుడూ కూడా నిరాశపరచలేదు.

ఈ పాటకు క్లాసికల్ ట్యూన్​తో వెస్ట్రన్ మ్యూజిక్ కలిపి చేశారు. మొత్తం పాట ఫైనల్ కాంపోజిషన్ అయిన తర్వాతనే చిరంజీవికి వినిపించారు. ఒకవేళ చిరు ఈ పాటని అంగీకరించకపోతే ఈ పాట కనుమరుగయ్యేదేమో. మణిశర్మకు ఉత్తమ సంగీత దర్శకునిగా 1998 సంవత్సరానికి నంది, ఫిలింఫేర్ అవార్డులు తీసుకొచ్చింది ఈ గీతం.

హరిహరన్ ఈ పాట పాడడానికి ఇబ్బంది పడినా, చాలా పట్టుదలగా రాత్రి తెల్లవార్లూ కష్టపడి నేర్చుకుని పాడిన పాట. ఇష్టపడిన పాట కాబట్టే అంత పట్టుదలగా పాడి మనందరి మనసుల్లో ఆ పాటను చిరస్థాయిగా నిలిపేశారు.

పాటలోని సాహిత్యం...

యమహా నగరి కలకత్తాపురి

యమహా నగరి అనడానికి కారణం.. మహానగర్ కలకత్తాకు పేరు. ఇండియా మొత్తం మీద మహనగర్ అని పిలిచింది కలకత్తానే. ఈ పేరుతో సత్యజిత్ రే 1963లో బెంగాలీ సినిమా కూడా తీశారు.

యమహానగరి అనడానికి కారణం బ్లాక్ హోల్ అని కూడా కలకత్తాను అంటారు. బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా. ఇది చాలా పెద్ద అంశం. యముడు నివసించే చోటులా అనిపిస్తుంది. మరియు భయంకరమైన నేరాలు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతం. అందుకే యమహా నగరి అని రాశారు. అలానే కలకత్తాకు మొదట్లో యమపురి అని పేరు ఉండేదట. అందుకే యమహా అని అన్నరేమో.

Chiranjeevi Yamaha Nagari telugu song
చూడాలని వుంది మూవీ

నమహో హుగిలీ హౌరా వారధి

పశ్చిమ బెంగాల్ కి ప్రాణాధారమైన హుగ్లీ నదికి, దాని మీద కట్టిన అందమైన హౌరా బ్రిడ్జికి నమస్కారం చెప్పుకుంటూ పల్లవి ప్రారంభించారు. హుగ్లీ నది గంగా నదే. పశ్చిమ బెంగాల్​లో హుగ్లీ పేరుతో పిలుస్తారు.

చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది

రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ పాట ట్యూన్​లాగా అనిపించే కదన కుతూహల రాగంలో ఉన్న ఈ పాట త్యాగరాజు కీర్తన కాదు. ఆయన శిష్యులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్​ది.

అందుకే వేటూరి చిరు త్యాగరాజు అని చెప్పారు. ఆయనకు తెలియని విషయమా. ఇక్కడ మనం చిరు త్యాగరాజు అంటే చిన్న త్యాగరాజుగా కూడా అనుకోవచ్చు.

నేతాజీ పుట్టినచోట

తీవ్రమైన జాతీయ వాదాలున్న సుభాష్ చంద్రబోస్ ఒరిస్సాలోని కటక్​లో జన్మించారు. మరి వేటూరి ఏంటి నేతాజీ పుట్టిన చోట అని కలకత్తా కోసం చెప్తూ, ఒరిస్సాలో పుట్టిన బోస్ కోసం రాశారు అనుకుంటున్నారా..

వేటూరి నేతాజీ అని సంబోధించారు. నేతాజీ అనేది బోస్ బిరుదు. ఆయన పుట్టినది కలకత్తా లో కాకపోయినా, 1940 లో కలకత్తా లో బ్రిటిష్ వాళ్ళ హౌస్ అరెస్ట్ నుండి చాకచక్యం గా తప్పించుకుని, సాహసోపతంగా మారు వేషంలో జర్మనీ వెళ్లి, భారత దేశం కోసం పోరాడినప్పటి నుండి బోస్​ను నేతాజీ అన్నారు. అందుకే వేటూరి, నేతాజీ బిరుదు పుట్టింది కలకత్తాలో కాబట్టి అలా రాశారు.

గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో

1861 మే 7 న కలకత్తాలో జన్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్ భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. రవీంద్రునిగా ప్రసిద్ది చెందిన ఈయన రాసిన బెంగాలీ వెర్షన్ 'గీతాంజలి' కావ్యం 1910 ఆగస్టు 14 న విడుదలైంది. రవీంద్రుడు స్వయంగా ఆంగ్లంలో అనువదించిన ఈ గీతాంజలి పుస్తకం 1912 లో విడుదలైంది. ఈ ఆంగ్ల అనువాదనికే సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియా వాసి. భారతీయ సాహిత్యానికి వచ్చిన ఒకే ఒక్క నోబెల్ బహుమతి కూడా ఇదే.

బెంగాలీ కావ్యమైనా కూడా తెలుగులోనే సుమారు 70 కి పైగా తెలుగు అనువాదాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో గుడిపాటి వెంకట చలం గారి అనువాదం చాలా ప్రసిద్ది. సినీ నటుడు కొంగర జగయ్య, బెల్లంకొండ రామదాసు.. ఇలా చాలా మంది తెలుగులో అనువదించారు.

103 గీతాలున్న ఈ గీతాంజలిలో నోబెల్ బహుమతి వచ్చే విషయం ఏముందో తెలుసుకోవాలంటే, కచ్చితంగా తెలుగు వెర్షన్లలో ఏదోకటి చదివితే మనకు అర్ధమయ్యే అవకాశం ఉంటుంది.

ఇక వేటూరి రాసేటప్పుడు గీతాంజలి పూసిన చోట అని ఎందుకు రాశారో చూద్దాం. రాసిన చోట అనో వెలసిన (కావ్యం వెలసిన) చోట అనో రాయొచ్చు కదా...

మనం చెట్టుకు పూసిన పువ్వులను భగవంతుడికి చేసే పూజలో ఎలా ఉపయోగించుకుంటామో, అలానే రవీంద్రుడు, భగవంతుడిని ఆరాధించడానికి తన కలం అనే మొక్క నుంచి పూచిన 103 గీతాలను పువ్వులుగా ఉపయోగించిన అంజలి ఘటించిన విధానమే గీతాంజలి సారాంశం...

ఆ హంస పాడిన పాటే ... ఆనందుడు చూపిన బాట సాగనా

రామకృష్ణ పరమహంస మరియు వివేకానందుడు ఇద్దరు బెంగాలీ వాళ్లే. వివేకానందుడు మాత్రం కలకత్తాలో జన్మించారు. ఆ హంస అంటే రామకృష్ణ పరమహంస. ఆయన 15 సంవత్సరాలు మతాల్లో మూల సత్యములను కథలు, పాటలు, అలంకారాలతో ప్రభోధించేవారు. తన అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పిన ఆయన ముఖ్య శిష్యుడు వివేకానందుడు. రామకృష్ణ పరమహంస మరణించే ముందు తన ఆధ్యాత్మిక శక్తులు అన్నింటినీ, చాలా మంది శిష్యులు ఉన్నప్పటికీ స్వామి వివేకానందునికి ధారపోశారు.

అందుకే వేటూరి అలా రాశారు. ఆ హంస రాసిన పాడిన పాటే, ఆనందుడు చూపిన బాటగా సాగానా అని. ఇక్కడ ఆనందుడు అంటే వివేకానందుడు. గురువు వేసిన మరియు చెప్పిన దారిలోనే శిష్యుడు కూడా ప్రయాణించి ఎందరినో తన ప్రసంగాలతో తరింపచేశారు. పాడే అతను కూడా నేను అదే బాటలో సాగుతున్నా అని చెబుతున్నట్లు ఉంటుంది.

పదుగురు పరుగు తీసింది పట్నం

అందరివీ ఉరుకులు, పరుగులతో హడావిడి గా ఉండే నగరం

బ్రతుకుతో వెయ్యి పందెం

ఇక్కడ బతకడం అంటే జీవితం తో పందెం కాచెంత సాహసం ఉండాలి

కడకు చేరాలి గమ్యం కదలిపోరా

అయిన కూడా చివరకి గమ్యం చేరుకోవాలి. ముందుకు పోతూ ఉండాలి.

ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల

ఎవరితోనూ కనీసం నేను ఫలానా అని చెప్పుకునే సమయం కూడా దొరకనంత,

బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో

మన గోడు వినిపించుకొలేనంత హడావుడితో బిజీ గా, అటు ఇటు పరుగులు తీసేవారే...

బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలుపిల్ల మానిని సరోజిని

నైటింగెల్ ఆఫ్ ఇండియా (భారత కోకిల) మీ బెంగాలీ అమ్మాయి, మా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్న తెలుగింటి కోడలు తెలుసా అని తాను ఏ ప్రాంతం వాడో చెప్తున్నాడు

బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో హైదరాబాద్ లో జన్మించిన బెంగాలీ అమ్మాయి ఈవిడ. పుట్టడం హైదరాబాద్ అయినా విద్యాభ్యాసం వివిధ ప్రాంతాలలో జరిగింది.

సరోజినీ ఛటోపాధ్యయ హైదరాబాద్ నివాసి అయిన ముత్యాల గోవింద రాజుల నాయుడును వివాహం చేసుకుని సరోజినీ నాయుడుగా పేరు మార్చుకున్నారు. వీరిది కులాంతర వివాహం. సరోజినీకి కులం, మతం అనే మూఢ విశ్వాసాలు చిన్నతనం నుండి ఇష్టం లేదు. వీరి వివాహం చేసినది శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు.

మానిని అంటే నిరాడంబమైన స్త్రీ అని, ఆత్మగౌరవం గల స్త్రీ అని అర్ధాలు ఉన్నాయి.

రోజంతా సూర్యుడి కింద, రాత్రంతా రజినీగంధ సాగనీ

అలాగే రోజు పగలంతా నీడ లేకుండా గడిపినా, రాత్రికి మాత్రం మీ లిల్లీ పువ్వుల పరిమలాలు తోడుండి హాయితో ఆదరిస్తాయి.

రజనీ గంధలు అంటే లిల్లీ పువ్వులు. ఒక్కో రాష్ట్రానికి, అక్కడ ప్రజల ఇష్టాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బెంగాలీలకు ఈ లిల్లీ పువ్వులు అంటే చాలా ఇష్టం. అందుకే వేటూరి ఇక్కడ ఈ ప్రస్తావన తెచ్చారు.

పదుగురు ప్రేమలే లేని లోకం

కొద్దిమంది ప్రేమ కూడా లేని ఈ లోకం.. కనీసం నువ్వు ఎవరని అడిగే వారు లేని లోకం

దేవతా మార్కు మైకం

ఎప్పుడూ మేల్కొని ఉండే, ఎప్పుడూ నిద్రపోని మైకంలో ఉండే నగరం

శరన్నవలాభిషేకం తెలుసుకోరా

శరత్ చంద్ర రాసిన నవలల అభిషేకం లో తడిసిన నగరమా...

ఈ బెంగాలీ కవి శరత్ సాహిత్యం తెలుగులో కూడా చాలా పాపులర్. ఈయన రాసిన దేవదాసు నవల తెలియని వారు ఉండరేమో. దేవదాసు, ఆయన మందు గ్లాసు ఈయన నవలలో నుండే వచ్చాయి. తెలుగు సినిమాల ప్రస్తావన వాస్తే శరత్ ని తలుచుకోని ప్రేక్షకుడు ఉండడేమో.

కథలకు నెలవట

అనేక మంది రచయితలకి, కథలకి స్థానము

కళలకు కొలువట

అనేకమంది కళాకారులు పేరు తెచ్చుకున్న చోటు

తిథులకు సెలవట,

అతిథుల గొడవట

కలకట నగరపు కిటకటలో

ఇక్కడి పనులకు మంచి చెడూ అనే బేధం లేదు.

1950 నుండి నిరుద్యోగం, పేదరికం లాంటి కారణాలతో లెఫ్టిస్ట్ రాజకీయాలు పెరిగిపోయాయి. ట్రేడ్ యూనియన్స్ ఎక్కువ. మెరుపు సమ్మెలు మరియు బంద్ లు సర్వ సాధారణం. అలా ఊరిలో విధులకు సెలవైతే వేరే ప్రాంతం నుండి కలకత్తా కి పని మీద వచ్చిన వాళ్ల (అతిథులు) గొడవ కాక మరేమిటి.

అలా వచ్చి పోయే వాళ్ళతో ఎప్పుడూ హడావిడిగా సందడితో నిండి పోయిన నగరమా

వందేమాతర మే అన్న

వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా

వందేమాతరం అన్న జాతీయ గీతాన్ని ఇచ్చిన వంగ దేశం పూజనీయమైనది.

వందేమాతరం పాట మాత్రమే కాదు, గొప్ప ఆయుధం. విభజించి పాలించబోయిన బ్రిటిష్ వాళ్ళని వణికిస్తు బెంగాలీలు వందేమాతరం ఉద్యమం చేశారు. ఆ దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు రాజధానిని కలకత్తా నుండి మార్చాల్సి వచ్చింది. అందుకే వంగ భూతలమే మిన్న అని అంటున్నారు.

బెంగాలీ కవి బంకించంద్ర చటోఫాద్యాయ. బ్రిటిష్ వాళ్లు పలకలేక ఛటర్జీ అని పిలవగా, అదే అనుకరిస్తూ అందరూ కూడా ఛటర్జీ అని పిలుస్తూ, బంకించంద్ర చటోఫాద్యాయ పేరు కాస్తా బంకించంద్ర ఛటర్జీ గా మారిపోయింది.

ఈయన రాసిన ఆనంద్ మఠ్ నవల నుంచి ఈ వందేమాతర గీతాన్ని తీసుకున్నారు. జాతుల విముక్తి పోరాటాలలో, స్వాతంత్ర సమర చరిత్రలో ఒక కవి రాసిన దేశభక్తి గీతాలలో ఇంత శక్తివంతమైన గీతం ఇప్పటి వరకు రాలేదు అంటే అతిశయోక్తి లేదు.

మాతంగి కాళీ నిలయ

కలకత్తా లో దుర్గ పూజ, కాళీ ఘాట్ లో కాళీ ఆలయం బాగా ప్రసిద్ది. అందుకే కాళీ నిలయ. అంతేనా కలకత్తా పేరే కాళీకటా అంటూ కాళీ నిలయ అనే అర్దంతో వచ్చింది. అమ్మవారు కాళికా దేవి రూపంలో కొలవబడే చోటు.

కాళికా అమ్మవారి రూపాలలో మాతంగి సరస్వతీ స్వరూపం.

రంగి రంగుల దునియా నీదిరా

చౌరంగి కలకత్తా జిల్లాలో సెంట్రల్ కలకత్తా కి పొరుగు ప్రాంతం. చౌరంఘీ రోడ్ (అధికారకంగా జవహర్ లాల్ నెహ్రూ రోడ్). ఇది ఒక వ్యాపార ప్రదేశం. ఇక్కడ ఎక్కువగా వ్యాపారం చేసుకునే దుకాణాలకు, వినోద భరిత కార్యక్రమాలకు కేంద్ర బిందువు.

ఈ ప్రదేశం అంతా కూడా రంగు రంగుల వస్తువులు, భవనాలలో నిండిపోయి, వేరే రంగుల ప్రపంచంలో ఉన్నామా అనేలా ఉన్న ప్రదేశం మీదే కదా

వినుగురు సత్యజిత్రే సితార, యస్ డి బర్మన్ కీ ధారా

కలకత్తా లో జన్మించిన సత్యజిత్ రాయ్, తాను తీసిన మొదటి సినిమా పథేర్ పాంచాలీ తో, కేన్స్ చలన చిత్రోత్సవాలలో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుని, ప్రపంచ సినీ అభిమానుల దృష్టిని తన వైపుకు తిప్పుకొన్న సినిమా డైరెక్టర్. తర్వాత ఎన్నో గొప్ప సినిమాలు బెంగాలీ భాషలో చేసి ప్రపంచలోని గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈయన బెంగాలీలో ఎన్నో రచనలు కూడా చేశారు.

త్రిపుర రాజ వంశానికి చెందిన యస్ డి బర్మన్ పుట్టినది కలకత్తా కాకపోయినా, విద్యాభ్యాసం కలకత్తా లోనే జరిగింది. 100 సినిమాలకి సంగీతం అందించిన యస్ డి బర్మన్, తను సంగీతం అందించిన మొదట సినిమా బెంగాల్ సినిమానే. తర్వాత ఎక్కువగా సంగీతం అందించిన చిత్రాలు హిందీ వి మరియు బెంగాల్ వే. భారతీయ సినీ ప్రస్థానంలో వీరి పరంపర (ధారా) ఎలా సాగిందో అందరికీ తెలుసు.

థెరీసా కీ కుమారా కదలిరారా

విదేశాల నుండి భారతదేశానికి వచ్చి, కలకత్తా లో స్థిర నివాసం ఏర్పుచుకుని మన దేశ పౌరసత్వం పొంది, కలకత్తా జనాలకి తల్లి లాగా సేవ చేశారు మదర్ థెరిస్సా. అందుకే కవి, థెరీసా కి కుమారా కదలిరా అని సంభోదించారు.

జనణమనముల స్వరపద వనముల హృదయపు లయలను శ్రుతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో

జనగణమన అనే స్వరాలతో స్వాతంత్ర్య కోరిన హృదయాల స్పందనను ఒకటి చేసిన ప్రియమైన రవీంద్రుడు అనే చిలక నోట పలికిన సంగీతం అందించిన ఓ కలకత్తా నగరం అనే వనమా...

ఇక్కడ శుక అంటే అర్దం చిలక. ఇక్కడ ఈ చరణం లో శుక వాడడానికి ఇంకో అర్దం ఉంది. అసల చిలక నే ఎందుకు వాడాలి...

పశ్చిమ బెంగాల్ లో ఉండే అమ్మవారి దేవాలయాలలో లోపల కాళికా మాత విగ్రహం ఉన్నా, బయట ఎక్కువగా మాతంగి మాట ఫోటోలు మనకి కనిపిస్తాయి. ఆ మాతంగి మాత చెయ్యి మీద చిలక ఉంటుంది. ఇన్ని రకాలుగా ఆలోచించి రచన చేసారు వేటూరి.

అంత గొప్ప నగరమా నాకు ఆశ్రమం ఇవ్వు అని హీరో పాడుకునే పాట.

ఈ పాటలో...

చరిత్ర, సామాజిక అధ్యయనం, మానవత్వం, స్థలాకృతి, సినిమా, సాహిత్యం, ఆధ్యాత్మికత, దేవుడు, స్వేచ్ఛ, పోరాటం, కళ, జీవితం, ప్రకృతి.. మొదలైన అంశాలను ఒక గొప్ప కవి మహానగరాన్ని వర్ణిస్తూ పాట రాస్తే ఎలా ఉంటుందో అనే దానికి ఉదాహరణ...

సినిమా పాటకు గౌరవం తీసుకువచ్చిన పాటల పూదోటలో ఈ పాట కూడా చేరిందనడంలో సందేహం లేదు. వందేమాతరం, జనగణమన జాతీయ గీతాలను మనకందించిన బెంగాలీ కవుల రుణం, వేటూరి మాత్రమే తీర్చుకున్నారు అనిపిస్తుంది. వాళ్ల రాష్ట్ర గీతానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న పాట.

-బందా కిరణ్ కుమార్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Jun 6, 2021, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.