ETV Bharat / sitara

రామోజీరావు బ్లాంక్ చెక్ ఇచ్చారు: సుధాచంద్రన్

author img

By

Published : Dec 30, 2020, 9:59 AM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటి సుధాచంద్రన్.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. 'మయూరి' సినిమాలో తాను నటించడం వెనుకున్న కథేంటి? ఆ చిత్ర సంగతులేంటి? తదితర అంశాల్ని పంచుకున్నారు.

actor sudha chandran in ali tho saradaga show in ETV
రామోజీరావు బ్లాంక్ చెక్ ఇచ్చారు: సుధాచంద్రన్

ఆమె మహా సంకల్ప బలం ఉన్న నారి.. నటరాజు గర్వించే భరతనాట్య మయూరి. జీవితం తన ముందుంచిన సమస్యను సవాలుగా స్వీకరించి మనోధైర్యంతో.. దృఢ సంకల్పంతో విధిని సైతం ఎదురించి విజయాలవైపు తరలింది తన దారి. సుమారు మూడున్నర దశాబ్దాల కాలం నుంచి నట, నాట్య రంగాల్లో తనదైన ప్రతిభతో కళలకే కళగా నిలిచిన వెండితెర నాట్య మయూరి 'సుధాచంద్రన్‌'. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'లో ఆమె అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

sudha chandran in ali tho saradaga show
నటి సుధాచంద్రన్

ఆలీ: రమోలా సికంద్‌‌. అలియాస్‌ సుధాచంద్రన్‌. ఏం చదువుకున్నారు?

సుధాచంద్రన్‌: ఇండస్ట్రియల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశాను. తర్వాత.. మా అమ్మ నన్ను ఐఏఎస్‌.. ఐఎఫ్‌ఎస్‌ చేయించాలనుకున్నారు. కానీ.. మన రాత ముందే రాసి ఉంటుంది. అది మారదు కదా..! 1985లో ప్రమాదం తర్వాత నృత్యం చేయడం మొదలు పెట్టాను. రామోజీరావు గారు గమనించి.. సుధాచంద్రన్‌ జీవిత చరిత్రతో ఒక బయోపిక్‌ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మనం చాలా బయోపిక్‌ల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మొదటి బయోపిక్‌ చేసిన ఒకేఒక్క నిర్మాత రామోజీ రావు గారు. అదే 'మయూరి'. ఈ విషయంలో నేను ఎంతో గర్వపడుతున్నాను. సాధారణంగా బయోపిక్‌లో సెలబ్రిటీలు నటిస్తారు. కానీ.. 'మయూరి'లో నేనే నా పాత్ర పోషించాను. అది రామోజీరావు గారి గొప్పతనం. మరే ఇతర నిర్మాత కూడా ఇలా చేయలేదు.

ఆలీ: ఒక్క సినిమాతోనే 'మయూరి' ఎందుకు ఆగిపోయింది?

సుధాచంద్రన్‌: ఆ సినిమాలో ఒక్కో పాట చాలా ముఖ్యం. తెలుగు భాషనే నాకు పెద్ద సవాల్‌. ఆ సినిమాలో పెద్ద పెద్ద డైలాగ్‌లు నాకు ఇంకా గుర్తున్నాయి. రాత్రి వరకూ షూటింగ్‌లో పాల్గొని రూమ్‌లోకి వచ్చిన తర్వాత మొత్తం బట్టీపట్టి తర్వాత రోజు తెల్లవారుజామున 4గంటలకే సెట్‌కు వెళ్లేదాన్ని. 15 రోజుల పాటు అలా హైదరాబాద్‌లో షూటింగ్‌ చేశాం. ఆ తర్వాత జయపుర వెళ్లాం. మయూరి సినిమా మంచి విజయం సాధించినా తెలుగులో ఆ తర్వాత నాకెందుకో అవకాశాలు రాలేదు. తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. బాహుబాలిలో రమ్యకృష్ణను చూసి అసూయ పడ్డాను. అప్పట్లో సినిమా పరిశ్రమ అంటే చాలా మందికి చాలా అపోహలు ఉండేవి. అందుకే మా అమ్మ వద్దని చెప్పేది. మా నాన్న మాత్రం.. ఈ ఒక్క సినిమా చేసి వీడ్కోలు తీసుకోమని చెప్పారు. నాకు ఇంకా గుర్తుంది.. ‘మయూరి’కి ఒప్పుకొన్న తర్వాత హైదరాబాద్‌ బయలుదేరాను. విమానంలో ఉండగానే.. ఇవన్నీ మనకెందుకు తిరిగి ఇంటికి వెళ్లిపోదామన్న ఆలోచలు మొదలయ్యాయి. అయోమయంలో పడిపోయాను.

sudha chandran in ali tho saradaga show
నటి సుధాచంద్రన్

మొదటి రోజు షూటింగ్‌.. కాలేజ్‌ డ్రెస్‌లో ఉన్న నేను ఏడ్చే సన్నివేశం అది‌. ఆ సీన్‌ తర్వాత ఇంటికి వెళ్లిపోతానని నిజంగానే ఏడ్చాను. నేను నటించలేనని సింగీతం (డైరెక్టర్‌) గారితో చెప్పాను. ‘నువ్వు రెండు రోజులు ప్రయత్నించు.. నీవల్ల కాకపోతే వెళ్లిపో’ అని ఆయన చెప్పారు. రెండో రోజు నా నటన చూసి.. ‘చాలా బాగా చేశారు సుధా.. ఈ పాత్ర మీరే చేయాలి. ఇంకెవరూ చేయలేరు’ అని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ అంటే పద్మవ్యూహం. మనం రావడమే తప్పితే వెళ్లడం మన చేతిలో ఉండదు.. ఇది నా విషయంలో జరిగింది. 15రోజుల తర్వాత షూటింగ్‌ పూర్తవడం వల్ల మళ్లీ ఏడుపు మొదలుపెట్టాను. 'నేను ముంబయి వెళ్లను. మీతో అసిస్టెంట్‌గా ఉంటా'నని అనడం వల్ల.. సింగీతం గారు నవ్వుతూ.. నేను చెప్పాను కదా.. ఇండస్ట్రీకి వస్తే మళ్లీ బయటికి వెళ్లాలనిపించదని నాతో చెప్పాను. మయూరి తర్వాత మళ్లీ వెనక్కి తగ్గి చూడలేదు. సినిమాలు, బుల్లితెరపై నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఆలీ: మీ సొంతూరు..?

సుధాచంద్రన్‌: మాది కేరళ. నేను మాత్రం ముంబయిలో పుట్టి పెరిగాను.

ఆలీ: సుధాచంద్రన్‌ బయోపిక్‌ ప్రత్యేకత ఏంటీ..?

సుధాచంద్రన్‌: నిజానికి ఈ బయోపిక్‌లో ఒక పెద్ద హీరోయిన్‌ను తీసుకోవాలనేది ఆలోచన. ద్వితీయార్ధంలో రోడ్డు ప్రమాదం తర్వాత నా కాళ్లను చూపిద్దామనుకున్నారు. కానీ.. సింగీతం శ్రీనివాసరావు గారితో మీటింగ్‌ తర్వాత నన్ను ‘మీరైతే ముంబయి రండి.. దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుందాం’ అని చెప్పారు. అదలా ఉండగానే.. నేను హైదరాబాద్‌కు వచ్చిన రెండో రోజు.. నాకు ఫోన్‌ చేసి.. ‘మీరే మీ పాత్ర పోషిస్తే బాగుంటుంది’ అని చెప్పారు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాను. ‘నేనా.. హీరోయిన్‌గానా.. నేను చేయలేను సర్‌..’ అని చెప్పాను. ‘చేయలేకపోవడం ఏంటి.. మీరు ప్రయత్నించి చూడండి’ అని రామోజీరావు అన్నారు. మా కుటుంబ నేపథ్యం వల్ల సభ్యులందరితో సమావేశమై వాళ్లందరి అభిప్రాయం తీసుకోవాల్సి వచ్చింది. సినిమా చేయమని మా నాన్న.. వద్దని మా అమ్మ. చివరికి చేయాలని నిర్ణయం తీసుకున్నాను.

ఆలీ: సినిమా పూర్తయిపోయే వరకూ రామోజీ గారిని చూడలేదంట..?

సుధాచంద్రన్‌: అవును. సినిమా పూర్తయిన తర్వాత అట్లూరి రామారావు గారు వచ్చి ‘రామోజీరావు గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు’ అని చెప్పారు. నేను మా అమ్మ, నాన్నతో కలిసి వెళ్లాను. తెలుగు నిర్మాత అనగానే ఆయనను నేను వేరేలా ఊహించుకున్నాను. కానీ.. నా ఊహకు పూర్తి భిన్నంగా ఉన్నారాయన. తెలుగు నిర్మాతకు చిహ్నంలా కనిపించారు. ఆయన్ను చూడగానే మొదట భయపడ్డాను. మ్యాన్ ఇన్‌ వైట్‌. మ్యాన్‌ ఇన్‌ ప్రిన్సిపల్స్‌. నన్ను చూడగానే.. ‘నమస్కారం మయూరి గారు’ అన్నారు. మీ గురించి నేను చాలా విన్నానని చెబుతూనే.. ఇంకేదో చెప్పబోయాను.. ‘మీరు కూర్చోండి.. మీరు మా హీరోయిన్‌.. మీరు కూర్చోవాలి.. నేను నిల్చుంటాను. మేము మిమ్మల్ని గౌరవిస్తాం’ అని రామోజీ రావు గారు అన్నారు. అక్కడ ఉన్న టేబుల్‌ మీద పూలు, పండ్లు, స్వీట్లు డెకరేషన్‌ చేసి ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత మా నాన్నను చూస్తూ.. ‘అప్పా.. యే క్యా హై’ అని అన్నాను. అయితే.. అప్పటివరకూ రెమ్యునరేషన్‌ గురించి ఏం మాట్లాడలేదు. రామోజీ గారు ఒక బ్లాంక్‌ చెక్‌ టేబుల్‌ మీద పెట్టారు. ‘ఇది మీదే.. మీరు సంతకం చేయండి. ఎంత రెమ్యునరేషన్‌ కావాలో మేరే చెప్పండి’ అని అన్నారు. మా నాన్న మాట్లాడుతూ.. ‘నాకు నా కూతురి మీద సినిమా తీయాలని ఉండేది. కానీ.. నా దగ్గర డబ్బు లేదు. మీరు ఫైనాన్షియర్‌గా ఉండి నన్ను నిర్మాతను చేయండి అన్నారు. చెక్‌ను రామోజీ గారికి ఇచ్చారు. మీకేం ఇవ్వాలనిపిస్తే.. అదే ఇవ్వండని చెప్పారు. అప్పటినుంచి నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌.. పెరగడమే తప్ప ఒక్కసారి కూడా తగ్గింది లేదు. అప్పట్లో రూ.1.2లక్షలు ఒక కొత్త నటికి ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ సినిమా విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. పెద్ద కటౌట్‌ పెట్టారు. కొంతమంది హారతివ్వడం.. పూజలు చేయడం చూశాను. అదే నా జీవితంలో పెద్ద పురస్కారం.

sudha chandran in ali tho saradaga show
నటి సుధాచంద్రన్

ఆలీ: మయూరి సినిమా తర్వాత మయూరి డిస్ట్రిబ్యూషన్స్‌ అని పెట్టారు తెలుసా..?

సుధాచంద్రన్‌: అవును.. దాని వెనకాల పెద్ద కథ ఉంది. మయూరి సినిమా పూర్తయిన తర్వాత రామోజీరావు గారే స్వయంగా డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. సినిమా విడుదలైన మొదట్లో వారం రోజులు థియేటర్‌కు ఒక్కరిద్దరూ మాత్రమే వచ్చేవారు. కానీ.. ఒకవారం రోజుల తర్వాత థియేటర్లన్న హౌస్‌ఫుల్‌ అయ్యాయి. టికెట్లు కూడా దొరకలేదు.

ఆలీ: సంగీత దర్శకులు ఎవరో గుర్తున్నారా..?

సుధాచంద్రన్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. తమిళంలో వచ్చిన డబ్బింగ్‌ సినిమాకు ఆయనే నిర్మాతగా వ్యవహరించారు.

ఆలీ: 35 ఏళ్లు గడిచినా.. జనాలు మిమ్మల్ని ‘సుధాచంద్రన్‌ మయూరి’గానే గుర్తు పెట్టుకున్నారు.

సుధాచంద్రన్‌: సుధాచంద్రన్‌ కూడా లేదు. మయూరిగానే గుర్తుపెట్టుకున్నారు. నేను హిందీ సినిమాలు చేస్తాను. తమిళంలో చేస్తాను. ఇంకా చాలా భాషల్లో నటించాను. కానీ 35ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో నేను దిగగానే ‘మయూరి గారు’ కదా..? అన్నారు.

sudha chandran in ali tho saradaga show
నటి సుధాచంద్రన్

ఆలీ: ఈటీవీ వాళ్లు మిమ్మల్ని ఎలా కలిశారు..?

సుధాచంద్రన్‌: ఒక పేపర్‌లో నా గురించి చదివిన తర్వాత రామోజీరావు గారు అందరికీ స్ఫూర్తిదాయకమైన ఓ సినిమా చేయాలనుకున్నారు. చెన్నైలోని అమెరికన్‌ లైబ్రరీకి ఫోన్‌ చేసి.. నటుడు శ్రీకాంత్‌ గారితో మాట్లాడారు. అక్కడి నుంచి ముంబయిలోని అమెరికన్‌ లైబ్రరీకి ఫోన్‌ చేశారు. అక్కడే పనిచేసే మా నాన్నగారితో మాట్లాడారు. అలా ఈటీవీతో బంధం ఏర్పడింది. అదో పెద్ద ప్రక్రియ. సినిమా రంగంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. సినీ పరిశ్రమ మంచిది కాదనే భావన నాలోనూ ఉండేది. కానీ.. అది నిజం కాదు. మయూరి తర్వాత నా అభిప్రాయం మారింది. సినిమా ఇండస్ట్రీ చాలా అందమైన ప్రాంతం అని అందరికీ చెప్పాలని అనుకునేదాన్ని.

ఆలీ: మీ కుంటుంబం గురించి చెప్పండి..

సుధాచంద్రన్‌: అమ్మ, నాన్న, ఓ కూతురు, నా భర్త. మాది చిన్న కుటుంబం. 2004లో కేన్సర్‌తో అమ్మ చనిపోయారు. మా ఆయన పంజాబీ. హిందీ టెలివిజన్‌ డైరెక్టర్‌, నిర్మాత. ఓ హిందీ సినిమా చేసినప్పుడు ఆయన పరిచయమయ్యారు. సినిమా అయితే విడుదల కాలేదు కానీ.. మా ప్రేమ కథ మాత్రం రిలీజ్‌ అయింది. ఆ సినిమాకు ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. మేం ఇద్దరి మంచి స్నేహితులం. నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన అభిప్రాయం తీసుకుంటాను. నేనేమో వాగుడుకాయ.. మా ఆయన మాత్రం చాలా సైలెంట్‌.

sudha chandran in ali tho saradaga show
నటి సుధాచంద్రన్

ఆలీ: ఒక వ్యక్తి మయూరి బొట్టుబిల్లలు ఇక్కడ కొని లండన్‌లో ఒక్కోదాన్ని 3 పౌండ్లకు అమ్మాడు. ఆ విషయం మీకు తెలుసా..?

సుధాచంద్రన్‌: పాములు, బొద్దింకలు.. ఇలా అన్నిరకాల బొట్టుబిల్లలు నేను ప్రయత్నించాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా నుదుటిని ఓ డ్రాయింగ్ ‌బోర్డులా వాడుకునేదాన్ని. ఆ ఆలోచన కూడా నాదే. నేను ఒకసారి నాగ్‌పుర్‌ వెళ్లినప్పుడు.. ఒక చిన్నపాప వచ్చి ‘మేడం ఆ బొద్దింక చాలా సెక్సీగా ఉంది’ అని చెప్పింది. బొద్దింక సెక్సీగా ఉండటమేంటని నాలో నేను నవ్వుకున్నాను. బొట్టుబిల్లతో ఒక ఛానల్‌ లోగో కూడా డిజైన్‌ చేశాను. లండన్‌ నుంచి మా స్నేహితులు ఫోన్‌ చేసి.. మీ బొట్టుబిల్లలు ఒక్కోదానికి రూ.120 అమ్ముతున్నారు. ఇది చాలా ఖరీదు తెలుసా అన్నారు. ఒకసారి ముంబయిలో బొట్టుబిల్లల దుకాణానికి వెళ్లాను (మేకప్‌ లేకుండా). ఒక ప్యాకెట్‌ చూపించాడు. ధరెంత అని అడిగితే.. రూ.650 మేడం అని చెప్పాడు. అంత ఖరీదా? అని అడగ్గా.. అవును మేడం.. ఇది రమోలా సికంద్‌ బొట్టుబిల్లలు అన్నాడు. హాలో.. నేనే రమోలా సికంద్‌ అన్నాను. అప్పుడు మేకప్‌ లేకపోవడం వల్ల నన్ను ఆ వ్యక్తి గుర్తుపట్టలేదు. రూ.25కు ఎక్కువ ఇచ్చేది లేదనగానే.. మేడం మా గిరాకీ చెడగొట్టకండి వెళ్లండి అన్నాడు.

ఆ సమయంలో.. రమోలా సికంద్‌ బొట్టుబిల్లలు.. రమోలా సికంద్‌ రింగ్‌లు వాడేదాన్ని. అవి వేసుకొని చేసినప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌ విపరీతంగా పెరిగింది. అందుకే వాటిని వాడటం మొదలుపెట్టాను. ఆ రింగ్‌ ధర కేవలం రూ.45 మాత్రమే ఉండేది. ఒకసారి జయపురలో బంగారు వ్యాపారవేత్తల సమావేశం జరుగుతోంది. నా రింగ్‌ను చూసి.. మేడం మీ రింగ్‌ చాలా బాగుందని అన్నారు. ఇంకో వ్యక్తి వచ్చి.. మేడం 500 రింగులు అమ్మాను. చాలా లాభం వచ్చింది మేడం అన్నారు. నేను వాడే రింగులను బంగారంతో తయారు చేసి ఒక్కో రింగ్‌కు రూ.10వేలకు అమ్మారంట. అప్పుడైనా.. ఇప్పుడైనా.. నా మెడలో నుంచి ఆభరణాలు మాత్రం తీయను. అలా అని ఎక్కువ ధర అసలే పెట్టను. రూ.100 నుంచి 150 అంతకు మించను. అది కూడా రోడ్డు మీదే కొంటాను.

ఆలీ: ఇప్పుడేం చేస్తున్నారు.

సుధాచంద్రన్‌: ఒక సీరియల్‌ చేస్తున్నాను. అది మంచి పాత్ర. చదువు ప్రాముఖ్యతను తెలిపే పాత్ర అది. నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినదాన్నే. చదువు.. మధ్య తరగతి కుటుంబాలకు బ్లాంక్‌ చెక్‌లాంటిదని మా అమ్మ చెబుతుండేది. అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యమని మంచి సందేశమిచ్చే సీరియల్‌ అది.

ఆలీ: ప్రతిరోజూ మీ నాన్నతో గొడవ పడతారంట.?

సుధాచంద్రన్‌: అవును.. బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి డిన్నర్‌ వరకూ మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మళ్లీ ఇద్దరం కలిసిపోతాం. ‘ఐ లవ్యూ డాడీ’ అని నేను.. ‘ఐ టూ లవ్యూ’ అంటూ మా నాన్న చెప్పుకొంటూ ఉంటాం. ఆ తర్వాత రోజు ఉదయం ఇంకో విషయంపై మళ్లీ గొడవ మొదలవుతుంది.

ఆలీ: అసలు ప్రమాదం ఎలా జరిగింది..?

సుధాచంద్రన్‌: నాకు 13ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచురాపల్లి నుంచి చెన్నై రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో అందరికంటే తక్కువ గాయపడ్డది నేనే. కానీ మా నాన్న ముక్కుకు పెద్దగాయమైంది. అమ్మ చనిపోయిందని పోలీసులు చెప్పారు. అయితే.. ఆమె శ్వాస తీసుకోవడం గమనించాను. దీంతో వెంటనే అంబులెన్సులో అమ్మను పంపించారు. నాలుగు రోజుల పాటు నేను చిన్న పిల్లల వార్డు.. అమ్మ మహిళల వార్డు.. నాన్న పురుషుల వార్డులో ఉన్నాం. ‘అమర్‌ అక్బర్‌ అంటోనీ’ సినిమాలోని సీన్‌ నా జీవితంలో నిజంగానే జరిగింది. నాలుగు రోజుల తర్వాత మేం ఒకర్ని ఒకరం కలుసుకున్నాం. అందరం బతికే ఉన్నామని అప్పుడే తెలిసింది. నాకు అయింది చిన్న గాయమే కానీ.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల అది పెద్దదైంది. మోకాలి కంటే మూడు ఇంచులు కింద నుంచి కాలు కోల్పోవాల్సి వచ్చింది. విధిని మనం మార్చలేం కదా. ఒక్కగానొక్క కూతురినైన నా భవిష్యత్‌ గురించి మా అమ్మానాన్న బాధపడుతుండటం చూసి.. నేను ఎలాగైనా డ్యాన్స్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను.

sudha chandran in ali tho saradaga show
షోలో కన్నీటి పర్యంతమవుతున్న సుధాచంద్రన్

జయపురలో ఉండే రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత డా.పీకే శెట్టి గారికి ఒక ఉత్తరం రాశాను. మీ అపాయింట్‌మెంట్‌ కావాలని అడిగాను. వెంటనే జయపురకు రమ్మని అక్కడి నుంచి నాకో లెటర్‌ వచ్చింది. అక్కడ శెట్టిగారిని కలిసి.. నేను మళ్లీ డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నట్లు ఆయనతో చెప్పాను. ‘ఆ విషయంలో మీకు నేను హామీ ఇవ్వలేను.. కానీ జయపుర ఫుట్‌ ఇస్తాను. ఎందుకంటే అది నా బాధ్యత’ అని అన్నారు. ఆ కృత్రిమ కాలుతో ఎలా డ్యాన్స్‌ చేయాలని అడిగితే.. ఆ విషయం మాకు తెలియదని ఆయన సమాధానం ఇచ్చారు. అక్కడ 12 గంటల్లోనే కృత్రిమ అవయవం తయారు చేస్తారు. అలా ఒక కృత్రిమ అవయవం తయారు చేసి ఇచ్చారు. దాదాపు 8నెలల తర్వాత నేను నేలపై నిల్చోగలిగాను. ఆ కృత్రిమ కాలితో నేను ముంబయికి చేరుకున్నాను. మూడేళ్ల పాటు నిరంతరంగా కఠోర సాధన చేశాను. రోజూ దాదాపు 18-20గంటలు నృత్యం చేయడమే నా పని.

ఆలీ: సినిమాలో చూపించిన ఆ ముగ్గురూ మీ నిజ జీవితంలో ఎవరు?

సుధాచంద్రన్‌: నిర్మలమ్మ మా నాయనమ్మ. ఫ్రెండ్‌ కేరెక్టర్‌ మా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉమా. ఆమె ముంబయిలో ఉంటుంది. మాస్టర్‌ గారు.. పీకే శెట్టిగారు. కానీ.. శుభాకర్‌ ఆ బాయ్‌ఫ్రెండ్‌ కేరక్టర్‌ మాత్రం నా నిజ జీవితంలో లేదు. ఒకసారి గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లాం. అక్కడ శుభాకర్‌పై ‘మీరే కదా.. ఆ హీరో’ అంటూ ఒక వ్యక్తి ఆగ్రహంతో చెప్పు విసిరారు. వాళ్లు ఆ సినిమాను అంతలా ఫీల్‌ అయ్యారు. అప్పటి నుంచి మీతో ఏ కార్యక్రమానికి నేను రానని ఆయన అంటుండేవారు. ఆ కేరక్టర్‌ను జనం అంతలా ద్వేషించారు.

ఆలీ: సినిమాలో కట్టుతీసి మీ కాలు చూపించారు. అప్పుడే ఇది నిజమైన కథ అని జనానికి తెలిసింది కదా..!

సుధాచంద్రన్‌: హైదరాబాద్‌లో సినిమా చూసేటప్పుడు జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. సినిమాలో డ్యాన్స్‌ చేసిన తర్వాత కాలు తొలగించే సన్నివేశం చూసి మొదటి వరుసలో కూర్చొని ఉన్న ఒక మహిళ కళ్లు తిరిగిపడిపోయింది. వెంటనే థియేటర్‌లో సినిమాను నిలిపేశారు. అది డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావుగారి గొప్పతనం. నిజంగా ఇదొక మైలురాయి.

ఆలీ: ఈ సినిమా మంచి జ్ఞాపకాలు ఇచ్చింది కదా..!

సుధాచంద్రన్‌: అందమైన.. గొప్ప జ్ఞాపకాలు.

ఆలీ: మయూరి సినిమా చూసి ఓ చిన్నపాప వాళ్ల అమ్మానాన్న దగ్గరికి వెళ్లి నా కాలు కూడా తీసేయండి. సుధాచంద్రన్‌లాగా నేను కూడా గొప్ప డ్యాన్సర్‌ అవుతా అని చెప్పిందట. ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?

సుధాచంద్రన్‌: నాకు యాక్సిడెంట్‌ జరిగిన తర్వాత ఎందుకు.. ఎందుకు.. ఎందుకు అనే ప్రశ్నలే ఎదురయ్యాయి. అయితే, ఇలాంటి సంఘటనలు వాటన్నింటికీ సమాధానం చెప్పాయి. ఈ ప్రపంచానికి మనం ఏదో ఒక లక్ష్యంతో వస్తాం. ఇది నా లక్ష్యం. నా జీవితకాల లక్ష్యం. నేను చనిపోయిన తర్వాత.. కనీసం ఒక్క వ్యక్తి నా గురించి మాట్లాడుకున్నా చాలు. నేను బతికున్నట్లే.

ఆలీ: జయపుర కాలుతో మొదటి డ్యాన్స్‌ ప్రదర్శన ఎక్కడ చేశారు?

సుధాచంద్రన్‌: 1984 జనవరిలో ప్రదర్శన ఇచ్చాను. మూడు గంటల నిడివిగల ప్రదర్శన అది. అందుకోసం బాగా సిద్ధమై వెళ్లాను. నేను మొదటి స్టెప్‌ వేయగానే మా అమ్మ లేచి నిల్చుంది. నువ్వేం భయపడకు.. నేనున్నానని అభయమిచ్చింది. ఆ తర్వాత మూడు గంటలు నేను డ్యాన్స్‌ మాత్రమే చేశాను. అందరూ లేచి జయధ్వానాలు చేశారు. అదంతా చూసి మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె దగ్గరికి వెళ్లి ‘అమ్మా నేను సాధించాను’ అని చెప్పాను. ఇంటికి వెళ్లిన తర్వాత నా ప్రదర్శన గురించి.. ‘పప్పా.. ఎలా చేశాను’ అని అడిగాను. ఆయన ఏం మాట్లాడకుండా నా కాలిని తాకారు. ఇది సుధాచంద్రన్‌ కాదు.. సరస్వతి అని చెప్పారు. నా జీవితంలో సాధించిన గొప్ప ఘనత ఇదే. నాకు అంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడా దేవుడు.

ఆలీ: 85 ఏళ్ల ఆవిడ మీ షూ కావాలని అడిగిందట!

సుధాచంద్రన్‌: వాంకోవర్ (కెనడా)లో ఒక కార్యక్రమం కోసం అక్కడికి వెళ్లాను. ప్రదర్శన అయిపోయిన తర్వాత ఒక పెద్దావిడ వచ్చి నన్ను కలిసింది. మీరు చేసిన డ్యాన్స్‌ ఏంటో నాకు తెలియదు. కానీ.. నీ షూ కావాలని అడిగారు. షూ ఎందుకని నేను అడగ్గా.. నేను ఇండియాను వదిలి 30ఏళ్లు దాటింది. మీ షూలో భారత మట్టి సువాసన ఉందని ఆమె చెప్పారు. ఆ క్షణంలో.. నేను ఇండియన్‌గా ఎంతో గర్వపడ్డాను.

ఆలీ: సాధారణంగా అబ్బాయిలకు గోళీలాడటం ఇష్టం. మరి మీరు..?

సుధాచంద్రన్‌: అవును.. నేను గోళీలు బాగా ఆడేదాన్ని. నేనొక టామ్‌ బాయ్‌. ఇప్పుడు కూడా మా ఆయన ఒక అమ్మాయిలాగా ఉండాలని చెబుతుంటారు.

ఆలీ: హీరోయిన్‌ మయూరి నెగెటివ్‌ పాత్రలు చేయడం ఏంటి..?

సుధాచంద్రన్‌: ఎమోషనల్‌‌ పాత్రలు చేసీచేసీ బోర్‌ కొట్టింది. నా కళ్లలో నెగెటివిటీ బాగా ఉందని.. ఏక్తాకపూర్‌ చెప్పి నన్ను విలన్‌గా మార్చారు. ఆ తర్వాత ఒక్కరు కూడా పాజిటివ్‌ పాత్రలు ఇవ్వలేదు.

ఆలీ: పక్కవాళ్ల పేపర్‌లో కాపీ కొట్టి పరీక్షలు రాసేవారట..!

సుధాచంద్రన్‌: నేనెప్పుడూ కాపీ కొట్టలేదు. నాకు పనిష్‌మెంట్‌ కోసం కావాలనే నేను అబద్దం చెప్పాను. ‘ఒట్టు మేడం.. నేను కాపీ కొట్టాను’ అని చెప్పడంతో.. మూడు రోజుల పాటు పాఠశాల నుంచి బహిష్కరించారు. క్లాస్‌లో మొదటి ర్యాంక్‌ నాదే. ఒకసారి సెకండ్‌ ర్యాంక్‌ వచ్చిందని అమ్మ ఇంటి బయట నిల్చోబెట్టింది. ఆమె ఎక్కువ మాట్లాడదు. కానీ.. ఇంట్లో అమ్మ చెప్పిందే వేదం.

ఆలీ: మీ అమ్మగారు మరికొన్ని గంటల్లో చనిపోతారని చెప్పినప్పుడు.. ఆవిడతో మీరు ఎలా సమయం గడిపారు?

సుధాచంద్రన్‌: అమ్మకు వచ్చింది రెక్టమ్‌ కేన్సర్‌. సాధారణంగా మాంసాహారం తీసుకునేవాళ్లకే ఎక్కువగా వస్తుంది. మా అమ్మ అలాంటివేం తీసుకునేది కాదు. ఒకసారి నేను అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లాను. అప్పుడే ఆమెకు కేన్సర్‌ ఉందని వైద్యులు చెప్పారు. రెక్టమ్‌ కేన్సర్‌ అంటే రెండేళ్లకంటే ఎక్కువ బతకలేరు. షూటింగ్‌లో పడి నేనంతా మర్చిపోయాను. ఆకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. అప్పుడు నేను ట్రాఫిక్‌ నిబంధనలు కూడా ఉల్లంఘించి సిగ్నళ్లు దాటుకుంటూ వెళ్లిపోయాను. ఆ రోజంతా మా అమ్మ చేతిని పట్టుకునే కూర్చున్నాను. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.

ఆలీ: మయూరి తర్వాత ఏమైనా అవార్డులు వచ్చాయా..?

సుధాచంద్రన్‌: ఒక జాతీయ పురస్కారం వచ్చింది. స్పెషల్‌ జ్యూరీ అవార్డు. దాంతో మా అమ్మ కూడా నా సక్సెస్‌ను చూసింది.

ఆలీ: మీ ఆయన గురించి..?

సుధాచంద్రన్‌: ఆయన (రవి)ది పాకిస్థాన్‌లోని పెషావర్‌. ఉత్తరప్రదేశ్‌కు వలస వచ్చారు. తొలినాళ్లలో మా ఆయన అంటే మా అమ్మకు ఇష్టం ఉండేది కాదు. పంజాబీ వాళ్లకు కల్చర్‌ ఉండదు. సౌత్‌ ఇండియా వాళ్లకు కల్చర్‌ ఉంటుందని చెప్పేది. దానికి మా ఆయన బదులిస్తూ.. ‘సౌత్‌ ఇండియన్స్‌కు కల్చర్‌ ఉంటే.. పంజాబీలకు అగ్రికల్చర్‌ ఉంది’ అని చెప్పేవారు. కేన్సర్‌ వచ్చిన తర్వాత అమ్మకు నా కంటే మా ఆయనే ఎక్కువ సేవ చేశారు. అమ్మ చివరి దశలో ఉన్నప్పుడు ఆయనకు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని ఆయనకు క్షమాపణలు కూడా చెప్పింది.

ఆలీ: తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా..?

సుధాచంద్రన్‌: కచ్చితంగా చేస్తా.

ఆలీ: మీ గురించి పాఠాలున్నాయి కదా..?

సుధాచంద్రన్‌: అవును. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, బెంగాల్‌తో పాటు సీబీఎస్‌ఈలో నా గురించి పాఠాలున్నాయి. 35 ఏళ్ల తర్వాత పోలవరంలో షూటింగ్‌ చేసేటప్పుడు ఒక పాఠశాల విద్యార్థులు వచ్చి నన్ను ఆటోగ్రాఫ్‌ ఇవ్వండి మేడం.. అంటూ అడిగారు. నేనెవరో మీకు తెలుసా..? అని అడిగితే మీగురించి మాకు పాఠం ఉంది మేడం అని చెప్పారు. వాళ్లకు నేను సుధాచంద్రన్‌గానే తెలుసు. అలా నా గురించి భవిష్యత్తు తరం కూడా చెప్పుకొంటున్నారు.

ఆలీ: రామోజీరావు గారు ఈ కార్యక్రమం తప్పకుండా చూస్తారంట. ఆయనకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?

సుధాచంద్రన్‌: ఆయన ‘మై లివింగ్‌ గాడ్‌’. ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వచ్చినా ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకుంటాను.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.