ETV Bharat / science-and-technology

4డీ ప్రింటర్​.. అంధుల కోసం ప్రత్యేక వ్యాచ్.. ఆకట్టుకుంటున్న ఐఐటీ ఆవిష్కరణలు!

author img

By

Published : Nov 9, 2022, 8:54 AM IST

Updated : Nov 9, 2022, 9:29 AM IST

iit students innovations
ఐఐటీ ఆవిష్కరణలు

ఐఐటీ విద్యార్థులు నిత్యం సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. అయితే దేశంలో ఉన్న అన్ని ఐఐటీల నుంచి వారు రూపొందించిన ఆవిష్కరణలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దిల్లీ ఐఐటీలో ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శనలో.. కొన్ని ఆవిష్కరణలు మీకోసం!

ఐఐటీలంటేనే సాంకేతిక భాండాగారాలు. నిరంతర పరిశోధనల నిలయాలు. కొంగొత్త ఆవిష్కరణల పుట్టిళ్లు. ఒకటి కాదు, రెండు కాదు.. దేశంలోని మొత్తం 23 ఐఐటీలు ఒకేచోట కలిస్తే? తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తే? అది నిజంగా శాస్త్ర, సాంకేతిక మేళానే. ఐఐటీ దిల్లీ ప్రాంగణంలో ఇటీవల అలాంటి వేడుకే జరిగింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన ఈ సంబరంలో ఐఐటీల ఆవిష్కరణలెన్నో ప్రదర్శితమయ్యాయి. వాటిల్లో కొన్నింటి విశేషాలు ఇవీ..

అంధుల కోసం ప్రత్యేక వాచ్​ తయారు చేేసిన ఐఐటీ కాన్పూర్​ పరిశోధకులు

అంధుల కోసం ప్రత్యేక వాచ్‌
రోజువారీ పనుల్లో సమయం ఎంత కీలకమో తెలిసిందే. చేతి వాచ్‌ను చూసి టైమెంతో ఇట్టే తెలుసుకోవచ్చు. కానీ కళ్లు కనిపించనివారికి? కష్టమే కదా. చూపు కోల్పోయినవారి కోసమూ టాక్టయిల్‌, వైబ్రేషన్‌, సౌండ్‌, బ్రెయిలీ వాచ్‌లు ఉన్నాయి. అయితే వీటితో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. టాక్టయిల్‌ వాచ్‌లను వేలితో తాకినప్పుడు ముళ్లు విరిగిపోవచ్చు. వైబ్రేషన్‌ వాచ్‌ల్లో రకరకాల కంపనాలతో టైమ్‌ సరిగా తెలియకపోవచ్చు. సౌండ్‌తో టైమ్‌ను చెప్పే వాచ్‌లు గోప్యతకు భంగం కలిగించొచ్చు. బ్రెయిలీ వాచ్‌లు సౌకర్యంగానే ఉంటాయి గానీ ఖరీదు ఎక్కువ. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికి ఐఐటీ కాన్పూర్‌ పరిశోధకులు వినూత్నమైన టాక్‌వైబ్స్‌ వాచ్‌ను రూపొందించారు.

ఇది స్పర్శ, కంపనాలు రెండింటి సాయంతో సమయాన్ని తెలియజేస్తుంది. దీని చుట్టూరా గంటలను తెలిపే చోట సెన్సిటివ్‌ మార్కర్లుంటాయి. వేలితో తాకినప్పుడు అప్పటి సమయానికి అనుగుణంగా కంపించి, సమయాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకు- 12 గంటల 30 నిమిషాలు అయ్యిందనుకోండి. 12 గంటల గుర్తు వద్ద తాకినప్పుడు అది కాస్త ఎక్కువసేపు కంపిస్తుంది. అలాగే వేలిని ముందుకు తీసుకొస్తూ ఉంటే 6 గంటల దగ్గర కాస్త తక్కువసేపు కంపిస్తుంది. అప్పుడు 12.30 అయ్యిందని తెలుస్తుందన్నమాట. నిమిషాల వారీగా సమయాన్ని తెలుసుకునే సదుపాయమూ ఇందులో ఉంటుంది. తేలికగా వాడుకునేలా, గోప్యతకు భంగం కలిగించని విధంగా, చవకగా అందుబాటులో ఉండేలా చూడటం దీని ఉద్దేశం. దీన్ని రూ.1,500కు అందించాలని భావిస్తున్నారు. చూపులేనివారికి ఈ వాచ్‌ను అమర్చి పరీక్షించారు కూడా. అంతా సంతృప్తి వ్యక్తం చేయటం విశేషం.

పక్షవాతం బాధితుల కోసం రోబో చేతి చట్రం

రోబో చేతి చట్రం
పక్షవాతం తీవ్ర సమస్య. శరీరంలో ఒకవైపు భాగాన్ని చచ్చుబడేలా చేస్తుంది. సరైన ఫిజియోథెరపీ తీసుకుంటే తిరిగి అవయవాలు స్వాధీనంలోకి వచ్చే అవకాశముంది. నిపుణులు అవయవాలను కదిలిస్తుంటే దానికి అనుగుణంగా మెదడులో అనుసంధానాలు ఏర్పడతాయి. ఇవి తిరిగి కదలికలు అబ్బటానికి తోడ్పడతాయి. అయితే అన్నిసార్లూ ఫిజియోథెరపీ నిపుణులు అందుబాటులో లేకపోవచ్చు. ఉన్నా కూడా ఎక్కువసేపు వ్యాయామాలు చేయించలేకపోవచ్చు. ఫిజియోథెరపీ చేయిస్తున్నప్పుడు పరధ్యానంగా ఉంటే మెదడులో అనుసంధానాలు సరిగా ఏర్పడవు కూడా.

ఐఐటీ కాన్పూర్‌ రూపొందించిన రోబో చేతి చట్రంతో మాత్రం వేళ్ల కదలికలను తేలికగా తిరిగి పొందొచ్చు. పక్షవాతం బాధితుల కోసం బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్ఫేస్‌ (బీసీఐ) ఆధారంగా రూపొందించారు దీన్ని చచ్చుబడిన చేతికి పైన తగిలించుకుంటే చాలు. వేళ్లు సహజంగా కదిలినట్టుగానే కదిలిస్తూ తర్ఫీదు ఇస్తుంది. ఆయా కదలికలకు సంబంధించి మెదడులో అనుసంధానాలు ఏర్పడేలా చేస్తుంది. పక్షవాతం బాధితులపై ప్రయోగ పరీక్షలు నిర్వహించగా పిడికిలి బిగువు, పనులు మెరుగుపడినట్టు బయటపడింది. దీంతో చికిత్స తీసుకున్నాక అందరిలోనూ చేతి పనులు పూర్తిగా తిరిగి రావటం గమనార్హం.

నావిగేషన్‌ చిప్‌ ధ్రువ

నావిగేషన్‌ చిప్‌ ధ్రువ
ఇప్పుడు లొకేషన్‌ సేవలు జీవితంలో ఒక భాగంగా మారి పోయాయి. వీటి సాయంతో మొబైల్‌ ఫోన్ల ద్వారా ఆయా చోట్లను తేలికగా గుర్తిస్తున్నాం, వెళ్లగలుగుతున్నాం కూడా. ఈ సేవల్లో అత్యంత ఆదరణ పొందింది గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌). అమెరికా ప్రభుత్వం ఆధీనంలోని దీన్ని అన్నిసార్లు నమ్మటానికి లేదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో మన సైన్యం వాడుకోవటానికి అంగీకరించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మనదేశం నావిక్‌ (నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కమ్యూనికేషన్స్‌) అనే నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థను రూపొందించింది. కానీ నావిక్‌ అన్ని బ్యాండ్లను గ్రహించే రిసీవర్‌ లేకపోవటం వల్ల మొబైల్‌ సంస్థలేవీ దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీన్ని పరిష్కరించటానికి ఐఐటీ బాంబే ధ్రువ అనే ఆర్‌ఎఫ్‌ రిసీవర్‌ను తయారుచేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దీన్ని స్మార్ట్‌ఫోన్లు, నావిగేషన్‌ పరికరాల్లో వాడుకోవచ్చు. నావిగేషన్‌ ఉపగ్రహాల (నావిక్‌) నుంచే కాదు, అమెరికా గ్లోబల్‌ పొజిషనింగ్‌ వ్యవస్థల నుంచి అందే అన్నిరకాల నావిగేషన్‌ ఫ్రీక్వెన్సీలను ధ్రువ స్వీకరించగలదు.

డిజిటల్‌ పత్రాల చేతిరాత గుర్తింపు

డిజిటల్‌ పత్రాల చేతిరాత గుర్తింపు
ఫొటోల్లో, స్కాన్‌ చేసిన ఇమేజెస్‌లో చేతిరాతను గుర్తించటం అంత తేలికైన పని కాదు. మనదేశంలో ఎన్నెన్నో భాషలు. ఒకే భాషలోనూ ఎన్నో రీతులు. ఆ అక్షరాలను, వాక్యాలను గుర్తించాలంటే మార్పులకు అనుగుణంగా అప్పటికప్పుడు మారిపోయి, నిర్ణయాలు తీసుకునే ఆల్గారిథమ్‌ అవసరం. అందుకే దీనిపై చాలా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీ తిరుపతి శ్రీఅక్షర అనే విభన్నమైన ఆల్గారిథమ్‌ను రూపొందించింది. ప్రాంతీయ భాషల్లోని డిజిటల్‌ డాక్యుమెంట్లలో అక్షరాలను ఇది తేలికగా గుర్తిచగలదు. ఇందుకోసం పరిశోధకులు ఆయా అక్షరాలను గుర్తించటానికి ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించారు. ఇది ప్రత్యక్షంగా అప్పటికప్పుడు డిజిటల్‌ పత్రాల్లోని అక్షరాలను గుర్తిస్తుంది. సులభమైన ఈ వ్యవస్థ తనకు తాను కొత్త విషయాలనూ నేర్చుకోగలదు. నాలుగు భాషల అక్షరాలు, పదాలు, అంకెలకు సంబంధించి సుమారు 200 రకాల ఆకారాలను విశ్లేషించగలదు.

వినూత్న సానిటైజర్‌

వినూత్న సానిటైజర్‌
జబ్బులకు చికిత్స చేయించుకోవటానికి ఆసుపత్రులకు వెళ్తుంటాం. కానీ కొన్నిసార్లు అక్కడి పరికరాలు, పరిసరాలతోనే ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 10-19% ఇన్‌ఫెక్షన్లు ఆసుపత్రులు, చికిత్సలతో ముడిపడినవే. వీటి కారణంగా ఎక్కువరోజులు ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తుంది. జబ్బులూ తీవ్రం కావొచ్చు. మరణాలూ సంభవించొచ్చు. సూక్ష్మక్రిములు రోజురోజుకీ యాంటీబయాటిక్‌ మందులను లొంగని విధంగా తయారవుతున్న నేపథ్యంలో ఇది మరింత కలవరం కలిగిస్తోంది. కాబట్టే ఆసుపత్రుల్లో పరికరాలను, పరిసరాలను తరచూ శుభ్రం చేస్తుంటారు. అయితే చిక్కేంటంటే ప్రస్తుతం వాడుతున్న సానిటైజర్లు అంత త్వరగా పనిచేయకపోవచ్చు. కొంతకాలమే ప్రభావం చూపొచ్చు. మళ్లీ మళ్లీ సానిటైజర్‌ను చల్లాల్సి రావొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఐఐటీ హైదరాబాద్‌, మరికొన్ని సంస్థలతో కలిసి డ్యూరోకియా అనే కొత్త సానిటైజర్‌ను రూపొందించింది.

మందును వెదజల్లే నానోపార్టికల్స్‌తో కూడిన దీన్ని ఉపరితలాలపై చల్లినప్పుడు అతి సూక్ష్మమైన ముళ్ల మాదిరి ఆకారంలోకి మారుతుంది. దీనిపై సూక్ష్మక్రిములు అంటుకుంటే వెంటనే చనిపోతాయి. దీన్ని చేతులను శుభ్రం చేసుకోవటానికే కాదు.. సోఫాలు, బెంచీలు, కుర్చీల వంటి ఎలాంటి వస్తువుల మీదైనా చల్లొచ్చు. ఒకసారి చల్లితే 35 రోజుల వరకు పనిచేస్తుంది. చల్లిన 60 సెకండ్లలోనే ప్రభావం చూపటం ఆరంభిస్తుంది. దీంతో సూక్ష్మక్రిములు త్వరగా చనిపోవటమే కాదు.. తక్కువసార్లు ఉపయోగించాల్సి రావటం వల్ల ఖర్చూ తగ్గుతుంది.

కొంగొత్త 4డీ ప్రింటర్‌

కొంగొత్త 4డీ ప్రింటర్‌
3డీ ముద్రణ గురించి తెలిసిందే. ఈ పద్ధతిలో ఇప్పుడు ఏకంగా ఇళ్లనే ముద్రిస్తున్నారు. దీన్ని మరింత అధునాతనం చేయటానికి ఉపయోగపడేది 4డీ ప్రింటింగ్‌. తమ ఆకారాలను గుర్తుంచుకొని, అవసరమైనప్పుడు తిరిగి అలా మారిపోవటానికి వీలు కల్పించేలా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాంటి ప్రయత్నమే చేస్తోంది ఐఐటీ ధార్వాడ్‌. ఆకారాలను గుర్తుంచుకునే మిశ్రలోహాన్ని (ఎస్‌ఎంఏ) 4డీ పద్ధతిలో విడిభాగాలుగా ముద్రించే ప్రింటర్‌ను రూపొందించింది.

పాలిమర్‌ పదార్థంతో 3డీ పద్ధతిలో ఆకారాలను ముద్రిస్తున్న సమయంలోనే మరోవైపు నుంచి అవసరమైన చోట ఆకారాన్ని గుర్తుంచుకునే మిశ్రలోహాన్ని జత చేయటం దీనిలోని ప్రత్యేకత. దీని ద్వారా వస్తువులను పట్టుకునే గ్రిప్పర్లు, సర్క్యూట్‌ బ్రేకర్లు, శరీరానికి దన్నుగా నిల్చే చట్రాలు, తమంత తాముగా కలిసిపోయే నిర్మాణాలను రూపొందించొచ్చు. ఇప్పటికే ఈ పరిజ్ఞానంతో గ్రిప్పర్లు, చట్రాలను తయారుచేశారు. ఉదాహరణకు- రోబోల చేతికి ఇలాంటి గ్రిప్పర్లను జత చేస్తే అగ్ని ప్రమాదాల వంటివి జరిగినప్పుడు వాటంతటవే వస్తువును పట్టుకోగలవు. ఈ 4డీ ప్రింటర్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అవసరం తీరాక దానంతటదే క్షీణించే (బయోడిగ్రేడబుల్‌) పదార్థంతో వస్తువులను తయారు చేసే వీలుండటం వల్ల పర్యావరణ హితం కూడా. వాణిజ్య పరంగా పరిశ్రమలు ఉపయోగించు కోవటానికి వీలుగా ఇప్పుడు డెస్క్‌టాప్‌ స్థాయి 4డీ ప్రింటర్‌ను రూపొందించటం మీదా పరిశోధకులు దృష్టి సారించారు.

రైతుల కోసం అక్కడికక్కడే మట్టి పరీక్ష

అక్కడికక్కడే మట్టి పరీక్ష
సుస్థిర వ్యవసాయానికి నిరంతరం నేల తీరుతెన్నులను గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం. మట్టిలో ఏయే పోషకాలు ఎంతెంత ఉన్నాయి? ఎలాంటి ఎరువులు అవసరం? అనేవి తెలుసుకోగలిగితే పంట దిగుబడిని పెంచుకోవచ్చు. ఇందుకు మట్టి పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. అయితే సంప్రదాయ మట్టి పరీక్షలను అధునాతన ల్యాబ్‌ల్లోనే చేస్తున్నారు. దీనికి చాలా సమయం పడుతుంది. ఖర్చూ ఎక్కువే అవుతుంది. అందరికి ల్యాబ్‌లు అందుబాటులో ఉండవు కూడా. మరి చవకగా, అక్కడికక్కడే మట్టిని పరీక్షించే పరికరం చేతిలో ఉంటే? అలాంటి సాధనాన్నే రూపొందించింది ఐఐటీ కాన్పూర్‌.

దీని పేరు భూ పరీక్షక్‌. దీనికి ఎలాంటి రసాయనాల అవసరమూ ఉండదు. ఎవరికి వారే మట్టిని పరీక్షించుకోవచ్చు. ఆప్టికల్‌ సెన్సర్లు, స్పెక్ట్రోస్కోపీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సాయంతోనే మట్టిని పరీక్షిస్తుంది. అప్పటి కప్పుడే ఇది ఫలితాలను వెల్లడిస్తుండటం విశేషం. మట్టిలోని నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనం వంటి వివరాలను మొబైల్‌ ఫోన్‌లోనే చూపెడుతుంది. మనదేశంలో ఎరువుల వినియోగంతో పోలిస్తే దిగుబడి చాలా తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భూ పరీక్షక్‌ పరికరం రైతులకు బాగా ఉపయోగపడగలదు.

వారసత్వ సంపద సంరక్షణ

వారసత్వ సంపద సంరక్షణ
మన వారసత్వ సంపద చాలా గొప్పది. ఎన్నెన్నో కట్టడాలు. ఎన్నెన్నో కళాకృతులు. వీటిని సంరక్షించుకోవటం మన విధి. ఈ దిశగానే కృషి చేస్తోంది ఐఐటీ గాంధీనగర్‌ పరిశోధకుల బృందం. భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను కృత్రిమ మేధ సాయంతో డిజిటల్‌ రూపంలో భద్ర పరచటానికి, అవసరమైతే పునర్నిర్మించటానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆయా కట్టడాలు, కళాకృతులను స్కాన్‌ చేసి 3డీ ఫొటోల రూపంలోకి మార్చే ప్రాజెక్టును చేపట్టింది. దెబ్బతిన్న కళాకృతులను ఈ ఫొటోల సాయంతో వాటిని 3డీ ప్రింట్‌ చేయటమూ ఆరంభించింది. గుజరాత్‌లోని ద్వారక, రాణీ కా వావ్‌, ఢోలవిర, లోథల్‌లోని నిర్మాణాల మీద ఇప్పటికే ప్రయోగాలు నిర్వహించింది. రెండు చిత్రాల నుంచి స్టీరియో ఫొటోలను తయారుచేయటం, 3డీ భాగాలను కలపటం వంటి వాటికి అవసరమైన కృత్రిమ మేధ పద్ధతులనూ రూపొందించింది.

Last Updated :Nov 9, 2022, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.