ETV Bharat / science-and-technology

నాసాకు రూ.15 వేల కోట్ల డిస్కౌంట్‌ ఇస్తానంటున్న బెజోస్‌!

author img

By

Published : Jul 27, 2021, 12:37 PM IST

అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) చంద్రునిపైకి చేపట్టబోయే మానవసహిత యాత్రకు అవసరమైన సాంకేతికతను అందించేందుకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ముందుకొచ్చారు. దీనికోసం రూ.15వేల కోట్ల రాయితీని ప్రకటించారు. ఇప్పటికే ఈ కాంట్రాక్ట్​ను ఎలాన్ మస్క్​కు చెందిన 'స్పేస్ ఎక్స్'కి కేటాయించగా.. ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బెజోస్‌ పెద్దఎత్తున పైరవీ చేస్తున్నట్లు సమాచారం.

jeff bezos
బెజోస్

అమెజాన్‌, బ్లూ ఆరిజిన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా'కు భారీ ఆఫర్‌ ఇచ్చారు. 2024లో చంద్రునిపైకి మానవసహిత యాత్రకు కావాల్సిన హ్యూమన్ ల్యాండింగ్‌ సిస్టం(హెచ్‌ఎల్‌ఎస్‌)ను బ్లూ ఆరిజిన్‌ ద్వారా నిర్మిస్తామని తెలిపారు. అయితే, దీనికోసం నాసా ఇప్పటికే ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్‌ ఎక్స్‌'తో ఏప్రిల్‌లోనే ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 2.9 బిలియన్ డాలర్లు. కానీ, బెజోస్ మాత్రం ఈ ఒప్పందాన్ని తమకు అప్పగిస్తే రెండు బిలియన్ డాలర్ల(దాదాపు రూ.15 వేల కోట్లు) డిస్కౌంట్‌ ఇస్తామని కళ్లుచెదరే ఆఫర్‌ ప్రకటించారు.

భారీ ఎత్తున పైరవీలు..

ఈ ఒప్పందాన్ని స్పేస్‌ ఎక్స్‌కు మాత్రమే అప్పగించడాన్ని నిరసిస్తూ బ్లూ ఆరిజిన్‌తో పాటు మరో సంస్థ డైనెటిక్స్‌ అమెరికా ప్రభుత్వంలో సంబంధిత శాఖను ఆశ్రయించాయి. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. తన ప్రతిపాదన నిధుల కొరతను తీరుస్తుందని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌కు రాసిన లేఖలో బెజోస్‌ తెలిపారు. తాను ఇస్తానంటున్న ఆఫర్‌ వాయిదా పద్ధతి కాదని.. శాశ్వతంగా 2 బిలియన్ డాలర్లు రద్దు చేస్తామని వివరించారు. ఈ కాంట్రాక్ట్​ను ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బెజోస్‌ పెద్దఎత్తున పైరవీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నిధుల కేటాయింపునుకు సంబంధించిన బిల్లుపై అక్కడి సెనేట్‌లో చర్చ జరుగుతోంది.

ఇంకా చాలా ప్రయోజనాలు..

ఈ కాంట్రాక్ట్‌ను 'బ్లూ ఆరిజిన్‌'కు ఇవ్వడం వల్ల డిస్కౌంట్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నట్లు బెజోస్‌ తెలిపారు. తాము తయారు చేయబోయే 'బ్లూ మూన్‌ ల్యాండర్‌' లిక్విడ్‌ హైడ్రోజన్‌తో నడిచేలా రూపొందించనున్నామన్నారు. ల్యూనార్‌ ఐస్‌ నుంచి సైతం దీనికి ఇంధనాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సౌరవ్యవస్థలో మరింత లోపలికి ప్రయాణించడానికి సైతం ఇది ఉపయోగపడుతుందన్నారు. పైగా ఈ ల్యాండర్‌ను తమ సొంత ఖర్చుతో భూ కక్ష్యలో పరీక్షిస్తామని స్పష్టం చేశారు. చంద్రుడిపైకి మానవసహిత యాత్రలోని నిధుల కొరత సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. తద్వారా మిషన్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి స్పేస్‌ ఎక్స్‌తో కుదిరిన ఒప్పందంపై బెజోస్‌ ప్రతిపాదన ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

పట్టుకోసం తహతహ..

స్పేస్‌ ఎక్స్‌ నిర్మించిన వ్యోమనౌక 'క్రూ డ్రాగన్‌' ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చింది. మరోవైపు బ్లూ ఆరిజిన్‌ రూపొందించిన 'న్యూ షెపర్డ్‌' వ్యోమనౌకలో ఇటీవలే బెజోస్ అంతరిక్ష యాత్ర చేసి వచ్చారు. దీంతో అంతరిక్షయాన రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. భవిష్యత్తులో ఇవి పర్యటక యాత్రలుగా మారి ట్రిలియన్ డాలర్ల వ్యాపారంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో నాసా తాజా ప్రాజెక్టును దక్కించుకోవడం వల్ల ఈ రంగంపై పట్టుసాధించి పై చేయి సాధించవచ్చని బెజోస్‌ ఊవిళ్లూరుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.