ETV Bharat / priya

ఇమ్యూనిటీని పెంచే పవర్‌ఫుల్‌ పానీయాలివే!

author img

By

Published : Apr 28, 2021, 12:17 PM IST

powerful-drinks-that-boost-immunity
ఇమ్యూనిటీని పెంచే పవర్‌ఫుల్‌ పానీయాలివే!

కరోనా సెకండ్‌ వేవ్‌ యావత్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత అప్రమత్తంగా ఉంటున్నా లక్షలాది మంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. రోజుకు వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అందుకే ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఆరోగ్యం విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా కొవిడ్‌ లాంటి వైరస్‌ల నుంచి రక్షణ పొందాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిందేనంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతోనే ఇమ్యూనిటీని మెరుగుపరచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. పైగా వేసవి కాలం కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చట. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం..

పసుపు టీ

immunitydrinkstea650-1.jpg
పసుపు టీ


పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలతో పాటు కర్క్యుమిన్‌ అనే ఓ రసాయనిక సమ్మేళనం ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహకరిస్తాయి. అంతేకాదు మంట, నొప్పిని తట్టుకునేలా మన శరీరాన్ని తయారుచేస్తాయి. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. ఒక బౌల్‌లో కప్పు నీళ్లు తీసుకొని.. అందులో అర టీస్పూన్‌ పసుపు వేసి.. సుమారు 15-20 నిమిషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారాక తేనె, నిమ్మరసం కలుపుకొని గోరువెచ్చగా తాగేయాలి.

మసాలా టీ

immunitydrinkstea650-2.jpg
మసాలా టీ


వ్యాధినిరోధక శక్తిని పెంచే పానీయాల్లో మసాలా టీ ఒకటి. వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలతో సులభంగా దీనిని తయారుచేసుకోవచ్చు. తురిమిన అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, తులసి ఆకులను.. కొద్ది మొత్తాల్లో తీసుకొని, కప్పు నీటిలో వేసి 30 నిమిషాల పాటు మరిగించాలి. కాస్త చల్లారిన తర్వాత దీన్ని వడకట్టుకొని అందులో తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితముంటుంది. ఈ టీలో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు కరోనా లాంటి ఇన్ఫెక్షన్లను నివారించే లక్షణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు లాంటి వ్యాధులతో సమర్థంగా పోరాడడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను అందిస్తాయి.

గ్రీన్‌ స్మూతీ

immunitydrinkstea650-3.jpg
గ్రీన్‌ స్మూతీ


రోగనిరోధక శక్తిని పెంచుతూనే, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే పానీయాల్లో గ్రీన్‌ స్మూతీ కూడా ఒకటి. ఇందులో విటమిన్‌-ఎ, సి, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంలో బాగా సహకరిస్తాయి. అంతేకాదు శరీరానికి చలువనందించి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తాయి. ఇందుకోసం ఏం చేయాలంటే... కప్పు చొప్పున పాలకూర తరుగు, మామిడి లేదా పైనాపిల్‌ పండు ముక్కలు, బాదం పాలు లేదా పెరుగును ఒక బౌల్‌లోకి తీసుకుని.. అందులో టీస్పూన్‌ నిమ్మరసం, అర టీస్పూన్‌ తాజాగా తురిమిన అల్లం వేయాలి.. వీటన్నింటినీ మిక్సర్‌లో వేసి స్మూతీలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది.

తేనె-నిమ్మరసం టీ!

immunitydrinkstea650-4.jpg
తేనె-నిమ్మరసం టీ!


గొంతునొప్పి, దగ్గు లాంటి అనారోగ్యాలతో పోరాడే గుణాలు తేనెలో సమృద్ధిగా ఉంటాయి. ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు తీసుకుని, అందులోకి అర టీస్పూన్‌ అల్లం, చిన్న దాల్చిన చెక్క ముక్క, తరిగిన మూడు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్‌ పుదీనా రసం, అర టీస్పూన్‌ నిమ్మరసం కలిపి పావు గంట పాటు మరిగించాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి.. టీస్పూన్‌ తేనెను కలుపుకొని తీసుకోవాలి.

కాఢా టీ

immunitydrinkstea650-5.jpg
కాఢా టీ


కరోనా మొదలైనప్పటి నుంచి ఈ హెల్దీ డ్రింక్‌కు బాగా క్రేజ్‌ వచ్చింది. పలువురు సెలబ్రిటీలు కూడా దీని తయారీ గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని తమ అభిమానుల్లో ఆరోగ్య స్పృహ నింపారు. ఇలా ఆరోగ్యనిపుణులు, సెలబ్రిటీలు చెబుతున్నట్లే ఈ కాఢా టీలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రత్యేకించి జలుబు, దగ్గు లాంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచి ఔషధం. అంతేకాదు ఇది శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసి, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వాము, పసుపు, నల్ల మిరియాలు.. కొద్ది మోతాదుల్లో తీసుకొని ఒక గ్లాసు నీళ్లలో వేసి అరగంట సేపు మరిగించండి. ఆపై మిశ్రమం చల్లారాక వడకట్టుకొని తియ్యదనం కోసం ఆ మిశ్రమంలో కొంచెం తేనె కానీ బెల్లం కానీ కలుపుకొని తీసుకోవడమే! సో.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఈ పవర్‌ఫుల్‌ పానీయాలను మనమూ తీసుకుందాం.. కరోనాకు దూరంగా ఉందాం..!

ఇదీ చూడండి: కరోనా పేరుతో ధరలు పెంచేస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.