ETV Bharat / opinion

World Fisheries Day: ఒడుదొడుకుల మధ్యే మత్స్యకారుల జీవితాలు

author img

By

Published : Nov 20, 2021, 6:32 AM IST

చేపల ఉత్పత్తిలో భారత్‌ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే కొన్ని తరాలుగా చేపల వేటతోనే జీవితం సాగిస్తున్న సంప్రదాయ మత్స్యకార కుటుంబాలు కష్టాలకు ఎదురీదుతున్నాయి. కాలానుగుణంగా మార్పును స్వీకరించకపోవడం, ఆధునిక వేట పద్ధతులను అందిపుచ్చుకోలేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దళారుల దందా, ప్రభుత్వ పథకాల లబ్ధిని అందుకోవడంలో ఇబ్బందులు వెరసి మత్స్యకారుల జీవితాలు ఒడుదొడుకుల మధ్యే సాగుతున్నాయి.

World Fisheries Day
ప్రపంచ మత్స్య దినోత్సవం

భారత్‌లో సుదీర్ఘ తీరప్రాంతం దాదాపు రెండు కోట్ల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తోంది. చేపల ఉత్పత్తిలో భారత్‌ మూడో స్థానంలో ఉండటం ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెబుతోంది. అయితే కొన్ని తరాలుగా చేపల వేటతోనే జీవితం సాగిస్తున్న సంప్రదాయ మత్స్యకార కుటుంబాలు కష్టాలకు ఎదురీదుతున్నాయి. కాలానుగుణంగా మార్పును స్వీకరించకపోవడం, ఆధునిక వేట పద్ధతులను అందిపుచ్చుకోలేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దళారుల దందా, ప్రభుత్వ పథకాల లబ్ధిని అందుకోవడంలో ఇబ్బందులు వెరసి మత్స్యకారుల జీవితాలు ఒడుదొడుకుల మధ్యే సాగుతున్నాయి.

పెరుగుతున్న డీజిలు ధరలు వేట ఖర్చును భారీగా పెంచేస్తున్నాయి. రేపు (నవంబరు 21న) ప్రపంచ మత్స్య దినోత్సవం(World Fisheries Day) సందర్భంగా దేశీయ మత్స్యకారుల సమస్యలపై చర్చ జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా మత్స్యకారుల జీవితాల్లో ఆశించినంత మెరుగుదల కనిపించడం లేదు. వీరి పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ సౌకర్యాన్ని కల్పించింది. చేపల పెంపకం, విక్రయంలో మత్స్యకారులను సంఘటిత పరచేందుకు దేశవ్యాప్తంగా మత్స్యకార సంఘాలు ఏర్పాటయ్యాయి. ఇందులో అనర్హుల చొరబాటు, స్థానిక రాజకీయ నాయకుల ప్రాబల్యంవల్ల అసలైన లబ్ధిదారులకు చాలాచోట్ల న్యాయం జరగడంలేదు.

నిరుడు కేంద్రం ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పేరిట ప్రకటించిన కార్యక్రమం- ఇప్పటిదాకా మత్స్యరంగంలో తీసుకొచ్చిన అతి పెద్ద పథకం. ఇందులో రూ.12,340 కోట్లు మత్స్యకారుల సంక్షేమ పథకాలకు, మరో రూ.7,710 కోట్లు ఈ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించారు. పథకం వచ్చి ఏడాదిన్నరయినా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విషయంలో వడివడిగా అడుగులు పడటం లేదు.

వలసల చిక్కులు

సుదూర సముద్ర తీరమున్నా ఫిషింగ్‌ హార్బర్లు, పట్టి తెచ్చిన చేపల్ని నిల్వ చేసే సౌకర్యాలు లేక వందల కొద్దీ మత్స్యకార గ్రామాల నుంచి ప్రజలు సుదూర తీరాలకు వలసపోతున్నారు. వేట తప్ప వేరే జీవనోపాధి తెలియని గంగపుత్రులు కుటుంబాన్ని పోషించేందుకు వెట్టిచాకిరీ పాలవుతున్నారు.

ఉదాహరణకు 193 కి.మీ. తీరప్రాంతమున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 57 వేల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి బతుకుబండిని నెట్టుకొస్తున్నాయి. జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్లు, వేటకు సరకు నిల్వకు మౌలిక వసతులు లేక 25 వేలకుపైగా మత్స్యకారులు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిశా, గోవా, కేరళ, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ వంటి తీరప్రాంతాలకు వలస వెళ్లారు. అక్కడ తక్కువ కూలీకే పని చేయాల్సిన దుస్థితిలో మగ్గుతున్నారు. వేట సాగిస్తూ పొరపాటున పొరుగు దేశాల జలాల్లోకి వెళ్ళి పట్టుబడితే, స్వస్థలాలకు తిరిగివచ్చి కుటుంబ సభ్యులను కలుసుకొనేందుకు కొన్నేళ్లు పడుతోంది. కొంతమంది అక్కడే ప్రాణాలూ కోల్పోతున్నారు. ఆటుపోట్ల ఆనుపానులు తెలుసుకుని ప్రాణాలు పణంగా పెట్టి సముద్రంపై వేటకెళ్లే గంగపుత్రులను దళారులు దోచుకుంటున్నారు.

దళారులంతా కూటమి కట్టి, వచ్చిన సరకు ధర అడ్డంగా తగ్గించేస్తున్నారన్న మత్స్యకారుల వేదన దశాబ్దాలుగా తీరని చింతే. వేటకు పెట్టుబడి కోసమే అప్పులు తెచ్చే మత్స్యకారులు, చేపలు పట్టిన తరవాత వాటిని నిల్వ చేసే సదుపాయాలు అంతంతమాత్రమే. ప్రభుత్వపరంగా నిల్వకు చాలినన్ని సౌకర్యాల్లేక దళారులు అడిగినకాడికే సరకు ఇచ్చేసి అరకొర డబ్బులతో ఇంటిముఖం పట్టే పరిస్థితి అత్యధిక ప్రాంతాల్లో కనిపిస్తోంది. చేపలు, రొయ్యలు తక్కువగా దొరుకుతున్నప్పుడో లేదా అరుదైన మత్స్యసంపద లభించినప్పుడో తప్ప చేతినిండా డబ్బులు చూసే సందర్భాలు తక్కువే.

మత్స్యసంపద పెరుగుదల కోసం ఏటా ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య చేపల వేటపై నిషేధం విధిస్తారు. తీరానికి సమీపంలో చేపలు పట్టడమే తప్ప సముద్ర జలాల్లోకి వెళ్లనివ్వరు. ఆ సమయంలో వారికి ఉపాధి కోసం ఇచ్చేదీ అరకొర సాయమే. ఒకపక్క చేపల వేట లేక, మరోపని చేతకాక ఆ మూడు నెలలూ అర్ధాకలితోనే గడపాల్సి వస్తోంది.

వాతావరణ మార్పుల ప్రభావం

వాతావరణ మార్పుల ప్రభావమూ మత్స్య రంగంపై దుష్ఫలితాలు చూపుతోంది. హిమాలయాల్లో మంచు కరిగి సముద్రంలోకి ప్రవహిస్తుండటంతో సముద్రమట్టం పెరగడం మత్స్యజాతులకు ముప్పుగా పరిణమిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత- దేశవ్యాప్తంగా ఉన్న తీరప్రాంతాల్లో ఏటా పెరిగిపోతోంది. దేశీయ సముద్ర జలాల్లో పెరిగే మత్స్యజాతులు ముఖ్యంగా చేపలు, రొయ్యలు వంటివి ఓ మాదిరి ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటాయి. ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత పెరిగినా చాలా రకాల చేపలు ఆ వాతావరణానికి అలవాటు పడలేక శీతలప్రాంతాల వైపు వలస పోతుంటాయి. అక్కడ వాటి ఆహారానికి సరిపడా చిన్నజీవులు, నాచు మొక్కలు నశించిపోవడంతో మనుగడ సాగించడం కష్టమవుతోంది. ఇది మత్స్యకారులకు శరాఘాతంగా మారుతోంది.

వాతావరణ మార్పులతో సముద్ర మట్టం కూడా పెరగడం వల్ల నేల కోతకు గురవడం, తుపాన్లతో పరిసర ప్రాంతాలు ముంపు బారిన పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. తీరప్రాంత గ్రామాల్లో నివసించే గంగపుత్రుల జీవనంపైనా ఇది ప్రభావం చూపుతుంది. తమిళనాడు, కేరళ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో చేపల వేటలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. హార్బర్ల నిర్మాణంతో ఉపాధి అవకాశాలు అక్కడ వేగం పుంజుకొన్నాయి.

ఇతర రాష్ట్రాలూ దీన్ని అందిపుచ్చుకోవడం అత్యవసరం. మత్స్యరంగంలో యువతకు శిక్షణ ఇవ్వడంతోపాటు, సులభతర రుణాల ద్వారా స్వయంఉపాధి కల్పించాలి. నిల్వ సౌకర్యాల్ని ప్రభుత్వమే కల్పించాలి. తీరప్రాంతం లేని రాష్ట్రాల్లో జలవనరుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ రంగం అభివృద్ధికి ఇతోధిక కృషి జరపాలి. మత్స్యకార సంఘాల్ని బలోపేతం చేసి వారి సంక్షేమంపై దృష్టి పెట్టాలి. అప్పుడే వారి జీవితాల్లో వెలుగులు విరబూసేది!

డీజిలు ధరల మంట

చేపల వేటకెళ్ళే పడవలకు వాడే డీజిలు ధర భారీగా పెరిగిపోవడం మత్స్యకారులపై ఖర్చుల భారాన్ని పెంచేస్తోంది. ఒక్కసారి వేటకెళ్ళి రావాలంటే కనీసం రెండు వేల లీటర్ల డీజిలు పడుతుందని, ఇప్పుడున్న ధరలో డీజిలుకే సుమారు రెండు లక్షల రూపాయలదాకా ఖర్చవుతుందని, దీనిపై ప్రభుత్వం తమకు పెద్దయెత్తున రాయితీ కల్పించాలన్నది మత్స్యకార నాయకుల డిమాండ్‌. డీజిలు కోటా, దానిపై రాయితీ పెంచితే తమకు వెసులుబాటు కలుగుతుందని వారు కోరుతున్నారు. రోడ్లపై తిరిగే వాహనాలకు డీజిలు ధరలో రోడ్డు సెస్సు, హరిత పన్ను కలిసి ఉంటాయని, సముద్రంలో అలాంటివేవీ లేనందువల్ల సెస్సులు, ట్యాక్సులు లేకుండా డీజిలును తమకు ఇవ్వాలని మత్స్యకార సంఘాల నాయకులు అభ్యర్థిస్తున్నారు.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.