ETV Bharat / opinion

చైనాకు దీటుగా విపణి వ్యూహమే భారత్​కు శ్రేయస్కరం

author img

By

Published : Jun 8, 2020, 6:52 AM IST

భారత్​ది సేవారంగ ప్రాధాన్య ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుత మందగమనాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ ఐటీ రంగాన్ని ఆకట్టుకునే మార్గాల్ని వెదకడం శ్రేయస్కరం. ప్రభుత్వం ఇప్పటికీ భారత్‌లో తయారీ బాటలోనే నడవాలనుకుంటే- భూమి, కార్మికులు, విద్యుత్తు ధరల విషయంలో చైనాతో పోటీపడి చౌకగా లభించేలా చూడాలి. నినాదాలు పెట్టుబడిదారులను ఆకట్టుకోలేవు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. కొన్నాళ్లపాటు ఆర్థిక వ్యవస్థ ఇదే తరహా కష్టాల దారిలోనే సాగే అవకాశం కనిపిస్తోంది.

market strategy
చైనాకు దీటుగా విపణి వ్యూహమే భారత్​కు శ్రేయస్కరం

ఆర్థిక వృద్ధిని లాక్‌డౌన్‌ ప్రభావం మరింతగా దిగజార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దేశానికి లాక్‌డౌన్‌ తీవ్ర నష్టం కలిగించిందంటూ ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజీవ్‌బజాజ్‌ వ్యాఖ్యానించారు. గిరాకీ లేకపోవడం వల్ల సమీప భవిష్యత్తులో వ్యాపారాలు మరింతగా దెబ్బతిని, ఉద్యోగాలు పోయే ప్రమాదం నెలకొంది. మందగమనం ప్రభావం నుంచి సమీప భవిష్యత్తులో తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రాథమికంగా ఇందుకు రెండు కారణాలు తోడవుతున్నాయి. దేశీయంగా సరైన గిరాకీ లేకపోవడం ఒకటైతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతుండటం రెండో కారణంగా నిలుస్తోంది. ప్రపంచ ముడి చమురు ధరలు చరిత్రలో లేనంతటి కనిష్ఠ స్థాయుల్లో కొనసాగుతుండటం కొంతలోకొంత మన అదృష్టంగానే భావించాలి. లేనిపక్షంలో ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కాకపోతే, మనం ఇప్పటికీ కరోనా వైరస్‌ విసిరిన సవాళ్లను పూర్తిగా అధిగమించలేదు.

లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపులు ఇవ్వడం వల్ల రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయి, రాజకీయ రాజధాని దిల్లీ రెండూ వైరస్‌ గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఈ రెండు నగరాలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటున్నట్లయితే కనిపించడం లేదు.

కార్మికుల కొరత

లక్షల మంది వలస కూలీలు తమ సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోవడం వల్ల, పరిశ్రమలను తిరిగి తెరవాలన్నా తగినంత మంది శ్రామికులు లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకు తీవ్రస్థాయిలో గిరాకీ పెరిగింది. ఎలాంటి నైపుణ్యాల్లేని సాధారణ శ్రామికుల ఆలోచనాతీరు మారిందనే సంగతిని ఈ ఉదంతం ఎత్తిచూపుతోంది.

అంటే, ఉపాధిహామీ పనుల్లో ఆర్జన కొంత తక్కువగా ఉండొచ్చుగానీ, పనులు వెదుక్కుంటూ వేల కిలోమీటర్ల దూరం వెళ్లకుండా, సొంతూరిలోనో, చేరువలోనో ఉండి పనిచేసుకునే అవకాశం దక్కుతోందన్న సంగతి మరవకూడదు. రోజువారీ ఆదాయ సంపాదన తక్కువగా ఉన్నా, సమీప బంధువులు చేరువలో ఉంటే మానసికంగా అదో పెద్ద ఊరట. ప్రస్తుతం పట్టణ కేంద్రాల్లో సైతం ఆర్థిక స్థితిగతులేమీ మెరుగ్గా లేవు. మార్కెట్లు తెరిచినా జనం పెద్దగా కనిపించడం లేదు.

వైరస్‌ భయం, ఆదాయాలపై అనిశ్చితి నెలకొనడం వంటివి గిరాకీని బాగా దెబ్బతీశాయి. ప్రజలు తమ పొదుపుల్ని జాగ్రత్తగా సంరక్షించుకోవడం మొదలుపెట్టారు. ప్రతి రూపాయినీ జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. దేశ పరపతి రేటింగ్‌ను మూడీస్‌ సంస్థ తగ్గించడం ఆర్థిక వ్యవస్థ తిరోగమనాన్ని మరింతగా నిర్ధరిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో మునుపెన్నడూ లేని రీతిలో ద్రవ్య లభ్యత తగ్గుతున్నా, రుణగ్రహీతలూ కనిపించడం లేదు. వాణిజ్య వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో పెట్టుబడిదారుడులు నిరాశతో ఉన్నారు.

ఇటీవలి ఆర్థిక ప్యాకేజీలో భూమి, కార్మిక తదితర ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సంస్కరణలకు సంబంధించిన అంశాలూ పెట్టుబడిదారులను పెద్దగా ఆకర్షించలేకపోయాయి. ఆయా సంస్కరణలన్నీ వాస్తవికంగా ఆచరణలోకి వచ్చినప్పుడే వారు విశ్వసించే అవకాశం ఉంది. అస్పష్ట పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ వ్యయాలే వృద్ధిని పరుగులు పెట్టించే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం ఆర్థిక సంప్రదాయవాద ఆలోచనల వద్దే ఉండిపోతోంది.

మనసుంటే మార్గం...

లాక్‌డౌన్‌ కారణంగా వృద్ధిలో మునుపెన్నడూ లేని స్థాయిలో పతనం ఉన్నప్పటికీ ద్రవ్యలోటును కనిష్ఠంగా ఉంచాలనే ఆర్థిక విధానం కారణంగా ప్రభుత్వం ఇప్పటికీ తన వ్యయాల్ని పెంచే విషయంలో సుముఖంగా లేదు. జీడీపీలో అప్పుల వాటా 70 నుంచి 84 శాతానికి పెరిగింది. అయితే, భారీ ఆర్థిక వ్యవస్థల జీడీపీలో అప్పుల వాటా అంతకన్నా ఎక్కువే ఉంటున్న సంగతిని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. అమెరికా జీడీపీలో అప్పుల వాటా వందశాతంకన్నా ఎక్కువే. చైనాది కూడా ఇదే పరిస్థితి. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థల్లోని ప్రధాన దేశాలదీ ఇదే బాట.

జపాన్‌లో ఏకంగా జీడీపీలో రుణాల వాటా 225 శాతం కావడం గమనార్హం. ‘భారత్‌లో తయారీ’ వంటి భావన ఆర్థిక కష్టనష్టాల్ని మరింతగా పెంచకూడదంటే సరైన దిశానిర్దేశం అవసరం. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రక్షణాత్మక విధానం వినియోగదారులపై భారం మోపుతుంది. మన భూమి, కార్మిక, విద్యుత్‌ చట్టాలు విదేశీ పెట్టుబడులకు ప్రతికూలంగా ఉన్నంత కాలం మనం చైనా తరహాలో ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగలేమన్నది సుస్పష్టం.

మనది సేవారంగ ప్రాధాన్య ఆర్థిక వ్యవస్థ. అందుకని, ప్రపంచ ఐటీ రంగాన్ని ఆకట్టుకునే మార్గాల్ని వెదకడం శ్రేయస్కరం. ప్రభుత్వం ఇప్పటికీ భారత్‌లో తయారీ బాటలోనే నడవాలనుకుంటే- భూమి, కార్మికులు, విద్యుత్తు ధరల విషయంలో చైనాతో పోటీపడి చవకగా లభించేలా చూడాలి. నినాదాలు పెట్టుబడిదారులను ఆకట్టుకోలేవు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. కొన్నాళ్లపాటు ఆర్థిక వ్యవస్థ ఇదే తరహా కష్టాల దారిలోనే సాగే అవకాశం కనిపిస్తోంది. దేశం అందుకు సన్నద్ధం కావాల్సిందే!

(రచయిత- వీరేంద్ర కపూర్​)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.