ETV Bharat / opinion

ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు

author img

By

Published : Jul 10, 2020, 9:14 AM IST

పర్యావరణ చట్టంలో మార్పులకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదంగా మారాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు చట్టాల్లోని లోపాలను సవరించాల్సింది పోయి.. వాటిని మరింత నిర్వీర్యం చేసే చర్యలు తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న పర్యావరణ ప్రభావ మదింపు ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Environment is in Critical Position and the rules are only for paper
ప్రమాదంలో పర్యావరణం

దేశంలో అభివృద్ధి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల ప్రక్రియలో కీలక మార్పులకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చేస్తున్న కసరత్తు వివాదాస్పదంగా మారింది. పర్యావరణ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు చట్టాల్లోని లోపాలను సరిదిద్దాల్సింది పోయి- వాటిని మరింత నిర్వీర్యం చేసేందుకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 పరిధిలోని పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నోటిఫికేషన్‌-2020 ప్రక్రియను నిలిపివేయాలన్న డిమాండ్‌ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఈ ప్రకటన ముసాయిదాపై సలహాలు, అభ్యంతరాల స్వీకరణకు మంత్రిత్వశాఖ జూన్‌ 30 వరకు గడువిచ్చింది.

అదే అసంతృప్తి..

కరోనా వైరస్‌- లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ గడువుపై గత వారం దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆంగ్లం, హిందీ భాషల్లో మాత్రమే కాకుండా దేశంలోని మిగతా అన్ని భాషల్లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచాలంది. సూచనలను స్వీకరించేందుకు ఆగస్టు 11 వరకు గడువును పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. కొన్ని దశాబ్దాలుగా దేశంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియలో లోపాలపై పర్యావరణ వాదులు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన ప్రమాదంపై ఉన్నతాధికార సంఘం తమ నివేదికలో కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో పర్యావరణ అనుమతుల ప్రక్రియలోని లోపాలను బహిర్గతం చేసింది.

సవరణలతో దిగజారిన పరిస్థితి

ప్రజల ఆకాంక్షలు, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ లక్ష్యాలను విస్మరించి ఈఐఏ నిబంధనలను అంతకంతకూ సరళతరం చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. 1994 నోటిఫికేషన్‌ స్థానే అమలులోకి తెచ్చిన ఈఐఏ 2006 నిబంధనల్లో స్థానిక సంస్థల భాగస్వామ్యాన్ని తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఈఐఏ అమలు ప్రక్రియలో వివిధ దేశాల ధోరణిని విశ్లేషిస్తే- మన దేశ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది. దిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ పరిశీలన ప్రకారం అభివృద్ధి చెందిన ఐరోపా, అమెరికా దేశాల్లో ఈఐఏ ప్రక్రియ అమలులో రాజీపడకుండా ప్రజల భాగస్వామ్యాన్ని ఇతోధికం చేశాయి. పరిశ్రమలు, ప్రాజెక్టుల యాజమాన్యాల జవాబుదారీతనం పెరిగేలా పటిష్ఠంగా చట్టాలు అమలు చేస్తున్నాయి. భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ ప్రైవేటు యాజమాన్యాల కనుసన్నల్లో నిర్వహించే మొక్కుబడి తంతుగా మారింది. ఈఐఏ నివేదికలను తయారు చేసే గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలపైనా నియంత్రణ కొరవడింది. ఈ వ్యవహారాలన్నింటినీ చూసుకోవలసిన రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణ మండళ్లకు ఆర్థిక, మానవ వనరులు కరవయ్యాయి.

ఆందోళన..

కొత్త నోటిఫికేషన్‌ ముసాయిదాలో ప్రాజెక్టు, పరిశ్రమలు భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసే వీలు కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల నుంచి సూచనలను, వినతులను తీసుకునే ప్రక్రియకు కేవలం 20 రోజులే గడువివ్వడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. యాజమాన్యాలు తమ ప్రాజెక్టు వాస్తవస్థితి నివేదికను ఏడాదికి ఒకసారి ఇస్తే చాలు. ప్రాజెక్టు ప్రభావిత ప్రజలతో సంప్రదింపుల ప్రక్రియనూ పూర్తిగా నిర్వీర్యం చేశారు. పర్యావరణ వ్యవస్థల యాజమాన్యంలో సుస్థిర నిర్వహణ విధానాలను విస్మరించారు. ఈ ధోరణితో అడవులు, సముద్ర తీరం వంటి సహజ వనరులతో పాటు, వాటిపై ఆధికంగా ఆధారపడి జీవించే ఆదివాసులు, మత్స్యకారులు, భూమి హక్కు లేని ఇతర అసంఘటిత రంగాలకు చెందిన వృత్తిపనివారిపై తీవ్ర ప్రభావం ప్రసరించే అవకాశం ఉంది.

చట్టాల అమలుకు భరోసా ఏదీ?

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పర్యావరణ చట్టాల అమలులో ఇష్టారాజ్యంగా ఉన్న లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థ సమగ్ర ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామంది. కానీ, వాస్తవ పరిస్థితి వేరేగా ఉంది. నాలుగేళ్ల క్రితం కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి సుబ్రమణియన్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ పర్యావరణ చట్టాల అనుమతులపై చేసిన కీలక సిఫార్సులను సైతం కేంద్రం పెడచెవిన పెట్టింది. పర్యావరణ అనుమతుల ప్రక్రియలో సమూల మార్పుల కోసం కొత్తగా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని ఈ కమిటీ నొక్కిచెప్పింది.

ఈఐఏకు అన్వయిస్తే..

ఇకనైనా పర్యావరణ పరిరక్షణ (1986), అటవీ పరిరక్షణ (1980), వన్యప్రాణి సంరక్షణ (1972), జల కాలుష్య నియంత్రణ (1974), వాయు కాలుష్య నియంత్రణ (1981) చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భూసేకరణ, పునరావాస చట్టం - 2013లో సామాజిక ప్రభావ అంచనా ప్రక్రియను తప్పనిసరి చేశారు. ఈ తరహా విధానాన్ని ఈఐఏ ప్రక్రియకు అన్వయించాలి. ఇకపై అమలులో ఉన్న చట్ట నియమాలను నిర్వీర్యపరచే ప్రయత్నాలకు స్వస్తి పలకాలి. పర్యావరణహితకరమైన, సమాజ సంక్షేమం ప్రతిబింబించే రీతిన పర్యావరణ చట్టాల పటిష్ఠ అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే ప్రజల్లో భవిష్యత్తుపై భరోసా, పాలన వ్యవస్థలపై నమ్మకం ఏర్పడతాయి!

మార్గదర్శకాలున్నా నెరవేరని లక్ష్యం

Environment is in Critical Position and the rules are only for paper
మార్గదర్శకాలున్నా నెరవేరని లక్ష్యం

దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఈఐఏ-2006 ప్రక్రియ పరిశ్రమలు, భారీ డ్యామ్‌లు, థర్మల్‌ ప్రాజెక్టుల నిర్మాణం, ఖనిజ తవ్వకాలకు అనుమతులిచ్చే ప్రక్రియ మొక్కుబడి తంతుగా మారిపోయింది. కాలుష్య ప్రమాదాల నియంత్రణ, ప్రకృతి వ్యవస్థల పరిరక్షణలో అధికార యంత్రాంగం విఫలమయింది. ఈఐఏ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టుల ప్రాంతంలో పర్యావరణ, సామాజిక, ఆర్థిక నష్టాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఆ నష్టాలను భర్తీ చేస్తూ సమన్యాయం అమలు చేసేందుకు యాజమాన్య ప్రణాళికలను రూపొందించాలి. స్పష్టమైన కార్యాచరణకు రూపకల్పన చేసి ప్రభావిత ప్రజలకు భరోసా కల్పించాలి. ఇందుకోసం పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించాలి. ఆ తరవాతే ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, సీఆర్‌జెడ్‌ అనుమతులను మంజూరుచేయాలి.

ఆ చట్టం అమలుతో..

1986లో భోపాల్‌ యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమ ప్రమాదంతో తలెత్తిన పెనువిషాదం తరవాత భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 అమలులోకి వచ్చింది. ప్రపంచదేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటులో అనుసరిస్తున్న ఈఐఏ - పర్యావరణ నిబంధనల ప్రక్రియను పర్యావరణ మంత్రిత్వశాఖ 1994 నాటి ఈఐఏ నోటిఫికేషన్‌ ద్వారా అమలులోకి తెచ్చింది. పెట్టుబడిదారుల అవసరాలు, సిఫార్సులు, ఒత్తిళ్ల ముందు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థల విశాల ప్రయోజనాలను చిన్నగా చూసే మన పరిపాలనా వ్యవస్థల నిర్లక్ష్య ధోరణి మూలంగా ఈఐఏ ప్రక్రియ అమలులో నీరుగారిపోయింది. ఈ ప్రక్రియ ఆధారంగా దేశంలో 1975-2014 మధ్య కాలంలో 21,632 చ.కి.మీ.ల అటవీ భూములను గనులు, పరిశ్రమల కోసం అభివృద్ధి పేరిట బదలాయించారు. గత ఆరేళ్లలో 14,822 చ.కి.మీ.ల విస్తీర్ణంలోని అటవీ భూములకు అనుమతులిచ్చారు.

- గంజివరపు శ్రీనివాస్​, రచయిత - అటవీ పర్యావరణ రంగ నిపుణులు

ఇదీ చదవండి: కాన్పుర్​ ఎన్‌కౌంట‌ర్ విచారణలో విస్తుపోయే నిజాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.