ETV Bharat / lifestyle

Karthika masam 2021: కార్తిక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?

author img

By

Published : Nov 5, 2021, 7:07 AM IST

Updated : Nov 5, 2021, 12:33 PM IST

తెలుగు నెలల్లో అత్యంత మహిమాన్వితమైన మాసం కార్తికం(Karthika masam 2021). ఈ నెలలో హరిహరాదులను స్తుతించడంతోపాటూ చేసే ఇతర పూజలకూ, వ్రతాలకూ ఎంతో విశిష్టత ఉంటుందని అంటారు. కుమారస్వామిని పెంచిన కృత్తికల పేరిట వచ్చినదే ఇది. అందుకే ఇది పరమశివుడికి ప్రియమైన మాసం. సృష్టి ఆరంభం జరిగిందీ త్రేతాయుగం మొదలైందీ ఈ నెలలోనే... ఇలా మరెన్నో విశేషాలతో నిండిన కార్తికంలో లింగరూపంలో కొలువైన ఆ మహేశ్వరుడిని దర్శించుకుని పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తుంటారు భక్తులు. కార్తిక మాసం సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Karthika masam 2021, karthikam story
కార్తీక మాసం, కార్తీక మాసం పూజలు

సనాతన ధర్మంలో ఆయనములు రెండు. ఉత్తరాయణం.. దక్షిణాయణం. ఉత్తరాయణంలో మాఘ మాసానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో.. దక్షిణాయణంలో కార్తిక మాసానికి(Karthika masam 2021) అంతటి విశిష్టత ఉంది. ఈ పుణ్య మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తిక పురాణం చెబుతోంది.

దీపారాధన విశిష్టత

కార్తిక మాసంలో ఏం చేయాలి?

కార్తిక మాసంలో(Karthika masam 2021) స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తిక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ప్రదోషకాలమనందు చేసే శివారాధన అనంతకోటి పుణ్యఫలాల్ని ఇస్తాయి. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం ఆచరించడం వల్ల ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

సూర్యోదయానికి ముందే కార్తిక స్నానాలు

కార్తికంలో వచ్చే ముఖ్యమైన పండుగలివే..

కార్తిక శుక్ల పాడ్యమి/బలి పాడ్యమి: ఈరోజు బలి చక్రవర్తిని స్మరించడం వల్ల కీర్తి, యశస్సు కలుగుతాయి.

కార్తిక శుద్ధ విదదియ/ భగినీహస్త భోజనం: ఈరోజు ప్రజలు ‘భ్రాతృద్వితీయ’ పేరుతో భగినీ హస్తభోజనం (సోదరీమణుల ఇళ్లకు వెళ్ళి మృష్టాన్న భోజనం చేసి, వారికి కానుకలను సమర్పించడం) చేస్తారు. సోదరీమణుల ఇళ్లకు వెళ్లి వారి చేతి వంటను తిని తమ స్తోమతకు తగినట్టుగా వస్త్రాలు, తాంబూలం సమర్పించి వాళ్లను ఆనందింపజేస్తారు. ఆమె చేతి భోజనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆడపిల్లలకు సౌభాగ్యం, పురుషులకు ఆయురారోగ్య ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రవచనం.

భక్తి పారవశ్యం...

నాగుల చవితి: ఈరోజు నాగ దేవతను, సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆరాధించిన వాళ్లకు కుజ దోషం, రాహుకేతు దోషం, కాలసర్ప దోషం తొలగుతాయి. మహిళలకు సౌభాగ్యం, పురుషులకు కుటుంబంనందు సౌఖ్యం కలుగును.

కార్తిక శుక్ల ఏకాదశి: ఈరోజు శివారాధన చేయడం, మహా విష్ణువును పూజించడం, విశేషించి సత్యనారాయణ వ్రతం ఆచరించడం ఫలప్రదం. ఈ ఏకాదశిని ప్రభోదని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశితోనే చాతుర్మాస్య వ్రతములు పూర్తవుతాయి.

కార్తీకం.. పుణ్యఫలం

కార్తిక మాసంలో సత్యనారాయణస్వామి వ్రత ప్రాధాన్యం:

సత్యనారాయణ స్వామి వ్రత కథా విధానం ప్రకారం.. సత్యనారాయణ వ్రతం జీవితంలో ఎప్పుడైనా ఆచరించవచ్చు. కానీ.. వ్రత కథ ప్రకారం కొన్ని ముఖ్యమైన విశేష దినములు/స్వామికి ప్రీతికరమైన దినములుగా పేర్కొంటారు. అందులో ప్రతిమాసంలో వచ్చే ఏకాదశి/ద్వాదశి/ పౌర్ణమి తిథుల యందు, రవి సంక్రమణములు (సూర్యుడు ఒక రాశి నుంచి మరోరాశికి ప్రవేశించి పుణ్య సమయం), మాఘ, ఫాల్గుణ, శ్రావణ కార్తిక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల యందు చేసేటువంటి సత్యనారాయణస్వామి పూజలు అత్యంత ఇష్టమైనటువంటివిగా వ్రతకల్పనలో పేర్కొనబడినది.

కార్తిక మాసంలో(Karthika masam 2021) అత్యంత ముఖ్యమైనది క్షీరాబ్ది ద్వాదశి. మన సనాతన ధర్మంలో పంచభూతాలను దైవంగా భావించవలెను. అందులో అగ్నిని ఆరాధించడం, ప్రతిరోజూ దీపమును వెలిగించడం ప్రాధాన్యతగా చెప్పబడింది. ప్రతి మనిషి తన జీవితంలో రోజూ ఆలయంలో, ఇంటి వద్ద దీపం వెలిగించి దీపారాధన చేయవలెను. కలియుగంలో ఇలా నిత్యం చేయలేని స్థితి ఏర్పడినప్పుడు కార్తిక శుక్ల ద్వాదశి రోజు (క్షీరాబ్ది ద్వాదశి) దీపారాధన చేస్తే వారికి ఏడాదంతా దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుందని కార్తిక పురాణం పేర్కొంది. కార్తిక శుద్ధ ద్వాదశి రోజున తులసికోట వద్ద ఉసిరి కొమ్మ ఉంచాలి. తులసికోటను లక్ష్మీ స్వరూపంగా, ఉసిరిని మహా విష్ణువుగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించవలెను. పూర్వం దేవతలు పాలకడలిని చిలికిన రోజు అయినందున ఈరోజును చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు.

కార్తీక వెలుగులు

కార్తిక పౌర్ణమి: కార్తిక పౌర్ణమి(Karthika pournami 2021) రోజు శివాలయంలో ఈశ్వరుడిని అభిషేకం చేసుకొని శివారాధన చేసి జ్వాలా తోరణంను దర్శించవలెను. ఈ పుణ్య మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవిగా శివపురాణం చెబుతోంది. సోమవారాల రోజు శివారాధన చేయడం, ఈశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించడం, ఉపవాసం వంటివి ఆచరించడం, నదీస్నానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం స్పష్టంగా చెబుతోంది. ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుస్సు, ఆరోగ్యం కలిగి కష్టాలు తొలగుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.


ఇదీ చదవండి: వెలుగు జిలుగులు నిండగా.. సంబరంగా దీపావళి పండగ

Last Updated :Nov 5, 2021, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.