ETV Bharat / jagte-raho

ప్రేమ,స్నేహం పేరుతో వంచన... ప్రతిపాదన నిరాకరిస్తే పైశాచికత్వం..!

author img

By

Published : Dec 3, 2020, 10:21 PM IST

ఏపీలోని విశాఖ నగరంలో పలువురు యువతులు, బాలికలపై సాక్షాత్తూ వారికి తెలిసిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు నిర్ఘాంతపరుస్తున్నాయి. చుట్టరికాన్నో, స్నేహాన్నో, ముఖ పరిచయాన్నో అడ్డంపెట్టుకుని వారిని మాటలతో మాయచేస్తున్నారు. ముందు కొంతకాలంపాటు స్నేహంగా మెలిగినప్పటికీ... ప్రేమ ప్రతిపాదననో, పెళ్లి ప్రతిపాదననో తిరస్కరిస్తే మాత్రం కాలయములవుతున్నారు. ఏళ్లనాటి నుంచి ఉన్న పరిచయాన్ని, స్నేహాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా అత్యంత కిరాతకంగా దాడులకు తెగబడుతుండటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.

ప్రేమ,స్నేహం పేరుతో వంచన... ప్రతిపాదన నిరాకరిస్తే పైశాచికత్వం..!
ప్రేమ,స్నేహం పేరుతో వంచన... ప్రతిపాదన నిరాకరిస్తే పైశాచికత్వం..!

ఆంధ్రపద్రేశ్​లోని విశాఖ పట్టణం గాజువాకలో ఓ యువతిని గొంతుకోసి హత్య చేసిన ఉదంతాన్ని మర్చిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ ప్రాంతం థాంప్సన్‌ వీధిలో మరో యువతి తన పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందన్న కారణంతో శ్రీకాంత్‌ అనే యువకుడు దాడి చేశారు. బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది. ప్రాణాపాయం నుంచి యువతి తప్పించుకున్నప్పటికీ ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కమిషనరేట్‌ పరిధిలో ఏటా 1200 మంది వరకు మహిళలు వివిధ రకాల మోసాలకు, నేరాలకు గురై పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నగరంలో యువతులు, బాలికలు పలు రకాల హింసలకు గురవతుండడం ఆందోళన కలిగిస్తోంది.

కొందరు ప్రేమోన్మాదానికి బలైపోతుండగా... మరికొందరు తీవ్రమైన భౌతికదాడులకు, లైంగికదాడులకు గురవుతున్నారు. కొందరు ఉన్మాదులు తమతో సన్నిహితంగా మెలిగిన వారితో రహస్యంగా ఫొటోలు తీసుకుని వాటిని చూపించి బ్లాక్‌మెయిల్‌ చేసి యువతుల నుంచి, వారి కుటుంబసభ్యుల నుంచి రూ.లక్షలు దండుకున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. గాజువాక డీసీపీగా ఉదయభాస్కర్‌ ఉన్న సమయంలో పలువురు యువతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. యువతుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్మయకర విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి.

మత్తుమందు కలిపి...

ప్రేమ, స్నేహం ఏమీ లేనప్పటికీ సాధారణ పరిచయంతో ఓ వ్యక్తి ఇచ్చిన శీతలపానీయం తాగిన పాపానికి ఓ యువతి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాధితురాలిని మోసం చేయాలన్న పక్కా ప్రణాళికతో నిందితుడు శీతలపానీయంలో ముందుగానే మత్తుమందు కలిపాడు. శీతలపాయం తాగి స్పృహ కోల్పోయిన అనంతరం ఆమెతో సన్నిహితంగా ఫొటోలు దిగి బ్లాక్‌మెయిల్‌ చేయటం మొదలుపెట్టాడు. బాధితురాలు నుంచి భారీగా డబ్బులు వసూలుచేశాడు. యువతి పోలీసులను ఆశ్రయించిన తరువాత గానీ నిందితుడి ఆగడాలకు అడ్డుకట్టపడలేదు.

పెళ్లి పేరుతో వంచన ...

నగరానికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని లోబరుచుకున్నాడు. పెళ్లి విషయం వచ్చే సరికి ముఖం చాటేయడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడు జైలుపాలుకాక తప్పలేదు.

మాదకద్రవ్యాలకు బానిసను చేసి...

స్నేహం పేరుతో ఓ యువతితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు ఆమెను లోబరుచుకోవడానికి అత్యంత నీచానికి ఒడికట్టాడు. ఆమెకు తెలియకుండానే శీతలపానీయాల్లో మాదకద్రవ్యాలు కలిపి ఇవ్వటంతో మత్తుకు బానిసైంది. ఆ మత్తులో ఉన్నప్పుడే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చదువులో ఎంతో ప్రతిభ కనబరచే ఆమె చివరికి విద్యాసంవత్సరాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అతడు చేసిన మోసానికి యువతి ఆరోగ్యం కూడా దెబ్బతిని మతిభ్రమించింది.

వైద్యుడి ముసుగులో సరికొత్త మోసం..

యువతుల్ని, మహిళల్ని మోసం చేయడానికి ఓ నిందితుడు ఏకంగా వైద్యుడి అవతారమెత్తాడు. మరింత అందంగా, ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన వైద్యం చేస్తానంటూ బాధిత మహిళలను నమ్మబలికి వారిని లోబరుచుకున్నాడు. వారి నుంచి భారీగా డబ్బులు కూడా దండుకున్నాడు. చివరకు ఓ మహిళ ఫిర్యాదుతో కటకటాలు లెక్కిస్తున్నాడు.

మగపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి..

పలువురు యువకులు తనకు నచ్చిన యువతి తన ప్రేమ నిరాకరించిందనో పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందనో ఆమెపై దాడులకు తెగబడుతున్నారు. ఎంతో అందమైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి దాడులకు తెగబడి జైలుపాలైతే వారికి భవిష్యత్తు ఉండదు. తమ అభిప్రాయంతో ఎదుటివారు ఏకీభవించి తీరాలన్న మనస్తత్వాన్ని యువకులు వదులుకోవాలి. యువకుల తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చజెప్పాలి. యువతుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైనా సమస్యలు ఎదురైతే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పరువుపోతుందనో.... ఇంటిగుట్టు రట్టవుతుందనో తల్లిదండ్రులు విషయాల్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఫలితంగా యువతులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది.

- ప్రేమ్‌కాజల్, ఏసీపీ, దిశ పోలీస్‌స్టేషన్

భావోద్వేగాలు అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర పర్యవసానాలు

యువకులు పరిపక్వతతో వ్యవహరించలేకపోతున్నారు. ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేని, అవమానాన్ని తట్టుకోలేని దయనీయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా వారికి నచ్చనిది జరిగితే కక్షతో, పగతో, ప్రతీకారంతో రగిలిపోతున్నారు. అలాంటి మనస్తత్వం ఉంటే చాలా ఇబ్బందులు పడతారని తల్లిదండ్రులు చెబుతుండాలి. తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పాటించే విలువలను చూసే పిల్లల ఆలోచనాధోరణి ఉంటుందన్న విషయాన్ని మరచిపోకూడదు. అదే సమయంలో యువకులతో ఎక్కువ సన్నిహితంగా ఉండకూడదన్న విషయాన్ని యువతులు గుర్తుంచుకోవాలి. కొంతకాలంపాటు సన్నిహితంగా మెలిగి ఒక్కసారిగా దూరమైతే యువకులు తీవ్రంగా స్పందించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరచిపోకూడదు.

- ఆచార్య హరిలక్ష్మి, విశ్రాంత ఆచార్యురాలు, మనస్తత్వశాస్త్ర విభాగం

ఇదీచదవండి: లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.