ETV Bharat / jagte-raho

కొలువుల పేరుతో యువతకు వల

author img

By

Published : Jan 3, 2021, 10:35 AM IST

ప్రజల అవసరాన్ని అవకాశంగా మలుచుకుని సొమ్ము చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఎలా ఉంటారో, ఎక్కడుంటారో తెలియకుండా.. వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగంలో స్థిరపడాలనుకునే యువత ఆశనే క్యాష్ చేసుకుంటున్న ఈ కేటుగాళ్లు నకిలీ ఈ-మెయిల్​ పంపి వారి భవిష్యత్​కు బ్రేక్​ వేస్తున్నారు. ఏటికేడు పెరుగుతున్న సైబర్​ నేరాల్లో ఉద్యోగాల పేరుతో జరిగేవి ఎక్కువగా ఉండటం నిరుద్యోగులను కలవరపెడుతోంది.

cyber crime cases in telangana are related to unemployed
కొలువుల పేరుతో యువతకు సైబర్ వల

సైబర్ కేటుగాళ్ల కన్ను నిరుద్యోగులపై పడింది. కరోనా కారణంగా లాక్​డౌన్​తో ఉద్యోగాలు కోల్పోయి కొత్త ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని తమ ఈ-మెయిల్ వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. విషింగ్... స్మిషింగ్... ఫిషింగ్.... మంత్రంతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తియ్యటి మాటలతో... సంక్షిప్త సందేశాలతో.... నకిలీ ఈ-మెయిల్​తో ఉద్యోగ ఆశ చూపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు.

26,891 ఇవే కేసులు

గడిచిన మూడేళ్లలో నమోదైన 44 వేల 546 సైబర్ కేసుల్లో 26 వేల 891 కేసులు.. ఉద్యోగ మోసాలకు సంబంధించివే కావడం శోచనీయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉద్యోగ ప్రకటనలతోపాటు పలు బహుళజాతి కంపెనీలు, చిన్నచిన్న ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు, వివిధ రకాల వెబ్ సైట్లలో పోస్టు చేసే ప్రకటనలను చూసి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. పలు జాబ్ పోర్టల్స్ కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తూ అభ్యర్థులకు దారి చూపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అదునుగా మలుచుకుంటున్న కేటుగాళ్లు.. ఉద్యోగార్థుల డేటా మొత్తం చోరీ చేసి పక్కా ప్రణాళిక ప్రకారం మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు తెలియక, మరికొందరు ఆశకుపోయి, ఇంకొందరు అత్యాశకుపోయి సైబర్‌నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోతున్నారు.

ఇలా మోసం చేస్తారు

ఉద్యోగాల కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను కొన్ని ప్రైవేట్‌ ఏజెన్సీలతో పాటు సైబర్‌నేరగాళ్లు కూడా కొనుగోలు చేస్తారు. రెజ్యూమ్‌లో ఉండే వివరాలతో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు ఈ-మెయిల్‌ పంపిస్తారు. ఫోన్‌ చేస్తారు. అది నిజమని నమ్మి.. చాలా మంది వారు చెప్పినట్లు చేస్తుంటారు. ప్రాసెసింగ్‌ ఫీజుతో మొదలు పెట్టి...ఆ తరువాత ఇంటర్వ్యూ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్​లని రకరకాల ఫీజులు వసూలు చేస్తారు. తీరా ఉద్యోగం ఎక్కడని ప్రశ్నించే సరికి... మీరు మోసపోయారని అర్థమవుతుంది.

ఎక్కువ మోసపోయేది వారే

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అధ్యయనం ప్రకారం దేశంలో 2021కి నిరుద్యోగ రేటు 9.1 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో 8.9 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 9.2 శాతం ఉంది. ఈ విషయంలో ఎక్కువగా మోసపోతుంది విదేశాల్లో ఉద్యోగాల కోసం తపించేవారనని సైబర్ సెల్ చెబుతోంది. విదేశీ మోజులోపడి లక్షలు చెల్లించడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. కనీసం కార్యాలయాలకు కూడా వెళ్లకుండా కేవలం ఆన్​లైన్​లోనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వారినే ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు.

కేంద్ర సైబర్ సెల్ సూచనలు

ఉద్యోగాల విషయంలో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర సైబర్ సెక్యూరిటీ సెల్ ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు సూచించింది. సెర్చ్ ఇంజన్ ప్రకటనల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవద్దని, అధికారిక వెబ్ సైట్లలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. థర్డ్ పార్టీ సైట్లలో ఉన్న ఉద్యోగ అవకాశాలను అధికారిక సైట్లలో సరిచూసుకోవాలని వెల్లడించింది. దరఖాస్తు చేసిన ఉద్యోగ పోర్టల్ వివరాలను నమోదు చేసుకొని ఉంచుకోవాలని చెప్పింది.

అప్రమత్తతే ఆయుధం

సైబర్ వలలో చిక్కుకున్న వారు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. లేదంటే ఆన్​లైన్​లో సైబర్ క్రైమ్ డాట్. జీవోవీ.ఇన్​లో లాగిన్ అయి కంప్లైంట్ ఇవ్వొచ్చని తెలిపారు. డబ్బు చెల్లించి ఉద్యోగాలకోసం పక్కదారుల్లో ప్రయత్నాలు చేయొద్దని చెప్పారు. చాలా సంస్థలు ఆన్​లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, క్రెడిబులిటీ చూసుకొని ప్రయత్నించాలన్నారు. సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయాలంటే అప్రమత్తతే దారని పోలీసులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.