ETV Bharat / jagte-raho

రెచ్చిపోతున్న డీజిల్​ చోరీ ముఠా.. బిక్కుబిక్కుమంటున్న లారీ డ్రైవర్లు

author img

By

Published : Jan 13, 2021, 11:41 AM IST

రెచ్చిపోతున్న డీజిల్​ చోరీ ముఠా.. బిక్కుబిక్కు మంటూ గడుపుతున్న లారీ డ్రైవర్లు
రెచ్చిపోతున్న డీజిల్​ చోరీ ముఠా.. బిక్కుబిక్కు మంటూ గడుపుతున్న లారీ డ్రైవర్లు

అంతర్రాష్ట్ర డీజిల్​ దొంగల ముఠా రెచ్చిపోతోంది. జాతీయ రహదారి 167 అడ్డాగా.. లారీ డ్రైవర్లను బెదిరించి.. దాడిచేసి డీజిల్​ను దోచుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్న వైనంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం...

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో జడ్చర్ల నుంచి దేవరకద్ర, మరికల్, మక్తల్ మీదుగా కర్ణాటకలోని శక్తినగర్ వరకు విస్తరించి 167వ జాతీయ రహదారిని అడ్డాగా మార్చుకున్నారు. అక్కడ నిలిపి ఉన్న లారీల నుంచి డీజిల్​ను దోచుకుంటున్నారు. డ్రైవర్​, క్లీనర్​లను బెదిరించి.. దాడిచేసి.. ఒక్కో వాహనం నుంచి రెండు వందల నుంచి నాలుగు వందల లీటర్ల వరకు డీజిల్​ను కాజేస్తున్నారు. బృందాలుగా వచ్చి.. గుట్టుచప్పుడు కాకుండా నిమిషాల వ్యవధిలోనే పనికానిచ్చేస్తున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వల్ల వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది.

ఏం చేస్తారు..

రోడ్డు పక్కన నిలిపిన లారీలు, మరమ్మతులకు గురైనా వాహనాలను ఎంపిక చేసుకుంటారు. ఒంటరిగా ఉన్న డ్రైవర్​, క్లీనర్​లను బెదిరిస్తారు. కార్లలో బృందంగా వచ్చి.. వారి వెంట తెచ్చుకున్న కట్టర్​లతో డీజిల్​ ట్యాంకులను ఖాళీచేస్తారు. నిమిషాల వ్యవధిలోనే అక్కడ నుంచి పరారవుతారు. దోచుకున్న ఇంధనాన్ని పెట్రోల్​ బంకుల కంటే తక్కువ ధరకే విక్రయించి.. నిత్యం వేల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.

దారి దోపిడీలు..

ఇదే బృందాలు రాత్రి వేళలో దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒంటరిగా వెళ్తున్న ద్విచక్రవాహదారులను అడ్డగించి.. వారి నుంచి డబ్బు తీసుకుంటున్నారు. ఈ మధ్యన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో.. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గుడెబల్లూర్​ దగ్గర ఓ పెట్రోల్​ బంకు నుంచి సుమారు 1,375 లీటర్ల డీజిల్​ను కాజేశారు. జనవరి 6 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీనిపై బంకు యజమానులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పెట్రోల్​ బంక్​ భూగర్భంలో నిలువచేసే ఇంధన ట్యాంకుల గొట్టాలను ఊడ గొట్టి.. ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న ప్లాస్టిక్ చేతిపంపులు ద్వారా కాజేశారు.

ఈ ముఠా ఎక్కడిది..

డీజిల్ దొంగతనాలకు పాల్పడే ముఠా నారాయణపేట జిల్లాకు చెందినదా.. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఫిర్యాదులు చేయక..

ఒక్క లారీలోని డీజిల్​ను దొంగలిస్తే యజమానికి సూమారు రూ.20 వేల నుంచి 35 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోంది. అయినా వారు ఫిర్యాదుచేసేందుకు ముందుకురాకపోవడం వల్ల.. ఈ ముఠా ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇకనైనా పోలీసులు దృష్టిసారించి.. జాతీయ రహదారులపై పెట్రోలింగ్​ను పెంచాలని డ్రైవర్లు కోరుతున్నారు.

రెచ్చిపోతున్న డీజిల్​ చోరీ ముఠా.. బిక్కుబిక్కు మంటూ గడుపుతున్న లారీ డ్రైవర్లు

ఇవీచూడండి : రాష్ట్రంలో కోట్లు కొల్లగొడుతున్న నకిలీ దందా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.