ETV Bharat / jagte-raho

దారుణం.. యువతిని హత్య చేసి తగలబెట్టిన కిరాతకుడు

author img

By

Published : Dec 23, 2020, 11:01 PM IST

కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఇష్టమైన హాకీ ఆటను వదులుకుంది. తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు ఉద్యోగంలో చేరింది. తొలి వేతనం అందుకోగానే అమ్మానాన్నకు ఇష్టమైనవి బహుమతిగా ఇవ్వాలనుకుంది. ఇంతలోనే ఆమె దారుణ హత్యకు గురైంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఏపీలో సంచలనం సృష్టించింది. గొంతునులిమి చంపేసినట్లు పోలీసులు నిర్ధరించారు.

http://10.10.young-woman-brutally-murdered50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/23-December-2020/9978384_720_9978384_1608736482749.png
young-woman-brutally-murdered

దారుణం.. యువతిని హత్య చేసి తగలబెట్టిన కిరాతకుడు

అనంతపురంలోని అశోక్‌నగర్‌కు చెందిన స్నేహలత.. ధర్మవరం స్టేట్‌బ్యాంకులో పొరుగుసేవల ఉద్యోగినిగా పని చేస్తోంది. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చే ఆమె... మంగళవారం రాత్రి పది గంటలు దాటినా రాలేదు. కంగారుపడిన తల్లిదండ్రులు... వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుమార్తె ఆచూకీ కోసం రాత్రంతా నిద్రపోలేదు. తమ కుమార్తె క్షేమంగా ఉండాలని దేవున్ని ప్రార్థించారు. బుధవారం ఉదయం తెలిసిన వాళ్లందరికీ ఫోన్‌ చేసి కుమార్తె గురించి ఆరా తీశారు. ఇంతలోనే బడన్నపల్లి వద్ద ఓ యువతి మృతదేహం పాక్షికంగా దహనమైందంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీసులు... ఆ మృతదేహం స్నేహలతదేనని నిర్ధరించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అనంతపురానికి చెందిన రాజేశ్‌... స్నేహితుడు కార్తిక్‌తో కలసి తన కుమార్తెను హత్య చేశాడని తల్లి ఆరోపిస్తున్నారు.

గతంలోనూ రాజేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్నేహలత తల్లి తెలిపారు. చదువుకుంటున్నప్పటి నుంచీ రాజేశ్‌ వేధించేవాడని వివరించారు. వేధింపులు భరించలేకే స్నేహలత తనకు ఇష్టమైన హాకీ ఆటను వదులుకుందని... కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఉద్యోగంలో చేరిందని కన్నీటిపర్యంతమయ్యారు.

గొంతు నులిమి హత్య

రాజేశ్‌ అనే వ్యక్తే గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. మృతురాలు అదృశ్యమైన రోజు... ఆమెను రాజేశ్‌ బైక్‌పై ఎక్కించుకెళ్లినట్లుగా సీసీ టీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధరించారు. ధర్మవరం గాంధీ సర్కిల్ మీదుగా వెళ్లారని.. బండ్లపల్లి వద్ద... స్నేహలత గొంతు పిసికి రాజేశ్ హత్య చేసి... దహనం చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఐ తెలిపారు. ఈ కేసులో.. స్నేహలత పనిచేస్తున్న ఎస్​బీఐ బ్రాంచి మేనేజర్‌నూ పోలీసులు ప్రశ్నించారు.

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ... ఎస్సీ సంఘం నాయకులు ఆందోళన చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే స్నేహలత బతికుండేదన్నారు. సీఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై వివరణ ఇచ్చిన ప్రతాప్‌రెడ్డి... తాను సీఐ బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నరలో.. రాజేశ్‌ వేధింపులపై మృతురాలి తల్లిదండ్రులు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఏకంగా పెళ్లికూతురు నగలే ఎత్తుకెళ్లారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.