ETV Bharat / international

'ప్రిన్స్​ హ్యారీ ఫోన్ ట్యాపింగ్ నిజమే'- మిర్రర్​కు రూ.కోటికిపైగా జరిమానా

author img

By PTI

Published : Dec 15, 2023, 8:23 PM IST

Prince Harry Wins Phone Hacking Lawsuit : ఓ పత్రికపై పెట్టిన ఫోన్​ ట్యాపింగ్ కేసులో బ్రిటన్ కింగ్ ఛార్లెస్ రెండో తనయుడు ప్రిన్స్​ హ్యారీ గెలిచారు. ఆయన ఫోన్‌ను హ్యాక్‌ చేయడం నిజమేనని కోర్టు నిర్ధరించింది. దీంతో ఆ వార్తాసంస్థకు కోర్టు జరిమానా విధించింది.

Prince Harry wins phone Hacking Lawsuit
Prince Harry wins phone Hacking Lawsuit

Prince Harry Wins Phone Hacking Lawsuit : బ్రిటన్ వార్తాసంస్థ డెయిలీ మిర్రర్​కు వ్యతిరేకంగా కింగ్ ఛార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ వేసిన ఓ దావా కేసులో లండన్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రిన్స్ హ్యారీ చేసిన ఆరోపణలు రుజువు కావడం వల్ల మిర్రర్​ వార్తసంస్థకు 1,40,000 పౌండ్ల జరిమానా విధించింది.

'వ్యక్తుల రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు'
'కొన్ని ఏళ్లుగా మిర్రర్‌ గ్రూప్‌ ఈ ఫోన్‌ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్లుగా లండన్​ హైకోర్టు గుర్తించింది. ఇది వారికి ఓ అలవాటుగా మారింది. వ్యక్తుల రహస్య సమాచారాన్ని చట్టవిరుద్ధంగా సేకరించేందుకు ఈ సంస్థ కోసం కొందరు ప్రైవేటు ఇన్వెస్టిగేటర్లు పనిచేస్తున్నారు. ఈ విధానం గురించి సంస్థ ఎగ్జిక్యూటివ్‌లకు తెలిసినప్పటికీ దాన్ని వారు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు' అని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. బ్రిటన్ రాకుమారుడు హ్యారీపై దాదాపు 15 ఆర్టికల్స్​ను ఇలా చట్టవిరుద్ధంగా సేకరించిన సమాచారంతోనే ప్రచురించినట్లుగా నిరూపణ జరిగిందని కోర్టు వెల్లడించింది.

కోర్టులో సాక్ష్యం చెప్పిన ప్రిన్స్​ హ్యారీ
ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని మిర్రర్​ గ్రూప్​పైన ఆరోపణలున్నాయి. ఫోన్​ హ్యాకింగ్​ ఆరోపణలకు సంబంధించి బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్​ హ్యారీతో పాటు వంద మందికిపైగా ప్రముఖులు న్యాయస్థానంలో దావా వేశారు. దీనిపై ఈ ఏడాది జూన్​లో హ్యారీ లండన్​ కోర్టులో సాక్ష్యం కూడా చెప్పారు. బ్రిటన్​ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఇలా న్యాయస్థానానికి హాజరవ్వడమనేది 130 ఏళ్లలో ఇదే ప్రథమం.

ఫోన్ ​ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండు రోజుల పాటు న్యాయస్థానానికి హాజరయ్యారు. తన వ్యక్తిగత వివరాలు సేకరించడానికి మిర్రర్​ గ్రూప్ ఉపయోగించిన మోసపూరిత పద్ధతులను ఆయన కోర్టుకు వివరించారు. వారి వల్ల ఏవిధంగా తన జీవితం ప్రభావితమైందో కూడా న్యాయస్థానానికి తెలిపారు.

'ఫోన్​ హ్యాకింగ్​కు పాల్పడ్డారు'
ఫోన్​ హ్యాకింగ్​కు పాల్పడ్డమే గాక 1996-2010 మధ్య ప్రైవేటు ఇన్వెస్టిగేటర్లను ఉపయోగించి మిర్రర్​ గ్రూప్ తన వ్యక్తిగత సమాచారం సేకరించిందని కోర్టుకు వివరించారు. ఈ విధంగా చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో ఆ సంస్థ 140 ఆర్టికల్స్​ను ప్రచురించిదని హ్యారీ కోర్టుకు తెలిపారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం మిర్రర్​ గ్రూప్​కు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

'మానసికంగా కుంగిపోయా, మద్యానికి బానిసయ్యా'

'మా అన్న నాపై దాడి చేశారు'.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రిన్స్ హ్యారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.