ETV Bharat / international

'బతుకు' భారం.. అన్ని దేశాల్లోనూ సామాన్యుల 'హాహాకారాలు'.. అమెరికా, బ్రిటన్​లోనే అదే పరిస్థితి..

author img

By

Published : Jan 12, 2023, 6:54 AM IST

worldwide inflation
ద్రవ్యోల్బణం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానంతరం అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి దేశాన్నీ ద్రవ్యోల్బణం అల్లాడిస్తోంది. పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోలు, ఇంధన ధరలు, ఉద్యోగాల్లో కోతలు.. ప్రజల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాలు పెరిగాయి.

  • "బ్రెడ్‌ కొనుక్కోవాలా? ఫోన్‌లో డాటా రీఛార్జ్‌ చేయించుకోవాలా? సౌకర్యాల కోసం చూసుకుంటే పొట్ట చేతిలో పట్టుకోవాల్సిందే!"- దక్షిణాఫ్రికాలో ఓ కార్మికురాలు
  • "ఆహార పదార్థాల ధరలు మేం ఇటుకలు మోసి కట్టిన అపార్ట్‌మెంట్లలా ఆకాశానికంటాయి. మా సంగతి అటుంచి పిల్లలకూ కడుపునింప లేకపోతున్నాం. కానీ ఏం చేసేది.. కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేదు."- హాంకాంగ్‌లో ఓ భవన నిర్మాణ కార్మికుడు
  • పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్‌ స్టేషన్లో పెట్రోలు కొట్టించాక రెండు చుక్కలు కిందపడితే.. గుండె గుభేలు మంది. అది నా రక్తం, చెమట, కన్నీరు అనిపించి గుండె బరువెక్కింది."- సియోల్‌లో ఓ డెలివరీ డ్రైవర్‌
  • "ధరలెంతగా పెరిగిపోయాయంటే తక్కువ వండుకొని తినేంతగా! ఒక్కరోజు పని మానేస్తే తిండి బరువైపోతోంది. ఆకలిని తట్టుకోవటం నేర్చుకుంటున్నాం. గతంలో రోజూ ఇంటికి వచ్చేప్పుడు ఓ తీపి పదార్థం కొనుక్కొని వచ్చేవాడిని. ఇప్పుడు దుకాణం అద్దాంలోంచి చూసి కడుపునింపుకొంటున్నా."- కొలంబోలో ఓ వ్యాపారి
  • "ఇంటి అద్దెలు ఏమాత్రం భరించేలా లేవు. అందుకే ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని చేతిలో పట్టుకొని.. రోడ్డుపక్కన గుడారాల్లోకి మారిపోతున్నాం." -అమెరికాలో ఓ చిరుద్యోగి
  • "ఇంతింత అద్దెలు కట్టలేం. 30శాతం తగ్గించాల్సిందే. లేదంటే సమ్మె తప్పదు."- మాంచెస్టర్‌ యూనివర్సిటీ విద్యార్థులు

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ధరాఘాతపు ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానంతరం అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి దేశాన్నీ ద్రవ్యోల్బణం అల్లాడిస్తోంది. సామాన్యుల జీవనం అల్లకల్లోలమవుతోంది. పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోలు, ఇంధన ధరలు, ఉద్యోగాల్లో కోతలు.. ప్రజల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. అమెరికాలాంటి అగ్రదేశాలు సైతం పెరిగిన జీవన వ్యయాలతో అతలాకుతలమవుతున్నాయి. ఇక ఐరోపా దేశాల పరిస్థితైతే చెప్పనే అక్కర్లేదు. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణ కాస్తా.. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల మెడకు చుట్టుకుంది.

  • అమెరికాలో ద్రవ్యోల్బణం గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగింది.
  • గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమెరికాలో ధరలన్నీ దాదాపు 10 శాతం పెరిగాయి.
  • యూకేలో ద్రవ్యోల్బణం 10.7 శాతం. ఇటలీ 12.6%, పోలండ్‌ 16%, హంగేరీ 20%లతో పోలిస్తే తమది తక్కువేనని ఏడ్వలేక నవ్వాల్సిన పరిస్థితి.
  • 2024 దాకా కూడా ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అంచనా.
  • భారీగా పెరిగిన ఇంధన ధరలను తట్టుకునేలా, ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా ఉండేలా.. 75 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించింది.
  • పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు బ్రిటన్‌ సర్కారు.. కుటుంబానికి 301 పౌండ్లు ఇవ్వబోతోంది.
  • కెనడాలోనైతే చాలామంది.. ప్రయాణాలతో పాటు పెళ్లిళ్లనూ, పిల్లల్ని కనడాలనూ, డేటింగ్‌లనూ వాయిదా వేసుకుంటున్నారు.
  • ఇంగ్లాండ్‌లో 2.7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఐరోపా అంతటితో పోలిస్తే ఇంగ్లాండ్‌లోనే ఆకలి కేకలు ఎక్కువగా వినిపిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. నిరుటితో పోలిస్తే ఈఏడాది (2022 చివర్లో) దాతృత్వ సంస్థలు పెట్టే ఆహారబ్యాంకులపై ఆధారపడే వారి సంఖ్య 40శాతం పెరిగింది.

యుగవ్‌ అనే అంతర్జాతీయ పరిశోధన, డేటా విశ్లేషణ సంస్థ సర్వే ప్రకారం..

  • ప్రపంచవ్యాప్తంగా 61శాతం మంది తలకిందులవుతున్న ఇంటి బడ్జెట్ల గురించి ఆందోళన చెందుతున్నారు.
  • ప్రతి ముగ్గురిలో ఇద్దరు ద్రవ్యోల్బణం పెరిగి తమ దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందేమోనని భయపడుతున్నారు.
  • చాలామంది పెళ్లిళ్లు, సంతానాన్ని వాయిదా వేసుకోవటం గురించి ఆలోచిస్తున్నారు.
  • 35 శాతం మంది తమ ప్రణాళికలను రద్దు చేసుకుంటుండగా, 21శాతం మంది ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నారు.
  • ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 43% మంది తమ కాలక్షేపాలను తగ్గించుకుంటున్నారు.

ఐకియా గ్రూపు తరఫున యుగవ్‌ ఈ సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా నుంచి అమెరికా దాకా 37 దేశాల్లో 18 ఏళ్ల పైబడిన వారిని ఎంచుకొని సుమారు 40వేల మందిని ఇంటర్వ్యూ చేశారు.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నివేదిక ప్రకారం..

  • జనవరి 2022లో అత్యంత సంపన్న దేశాలు ఇంధనంపై పెట్టే ఖర్చు జీడీపీలో 8.9 శాతం కాగా.. 2022 డిసెంబరు నాటికి అది 17.7శాతానికి పెరిగింది. ఆ భారమంతా ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతోంది.
  • రష్యా, ఉక్రెయిన్‌ల నుంచే 30శాతం గోధుమలు ప్రపంచానికి ఎగుమతి అవుతాయి. అధికశాతం ఎరువులు కూడా ఈ దేశాల నుంచే వస్తాయి. కానీ యుద్ధం కారణంగా ఆ ఎగుమతుల్లో కోతలు పడటం అన్ని దేశాల ప్రజలనూ ఇబ్బంది పెడుతోంది. 82 దేశాల్లోని 34 కోట్ల మంది ప్రజలు తీవ్రస్థాయిలో ఆహారసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
.

పారిస్‌ కేంద్రంగా ప్రపంచ ఆర్థిక వ్యవహారాలను మదింపు వేసే పరిశోధన సంస్థ ఐపీఎస్‌ఓఎస్‌ వివిధ దేశాల్లో సర్వే చేసింది. వారి ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా..

  • భారత్‌, సౌదీ అరేబియా, ఇండోనేసియాలు తప్పించి.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని ప్రజల్లో 67శాతం మంది తమ దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదనే ఆందోళన వ్యక్తంజేశారు.
  • ప్రతి ముగ్గురిలో ఒకరు బతుకు భారమైందని వాపోతున్నారు.

"ప్రపంచంపై ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఎక్కువ ప్రభావం చూపేలా ఉంది. భౌగోళిక ఘర్షణలకు మళ్లీ తలెత్తుతున్న కొవిడ్‌ కూడా తోడై ప్రపంచ ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తోంది. వచ్చే రెండేళ్లు గడ్డుకాలాన్నే ఎదుర్కోవాల్సి రావొచ్చు. సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దారుణంగా ఉండబోతున్నాయి. పదేళ్లలోపే రెండో ఆర్థిక మాంద్యం రావటం అనివార్యంలా ఉంది."

--ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

రిజల్యూషన్‌ ఫౌండేషన్‌ తాజా నివేదిక ప్రకారం..

  • గత నెలలో యూకేలో 60 లక్షల మంది ఆకలితో అలమటించారు.
  • ఇంగ్లాండ్‌లో సగటున ప్రతి కుటుంబం.. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి 2100 పౌండ్ల మేర కోల్పోతుంది.
  • వచ్చే రెండేళ్లలో ప్రతి కుటుంబం 7శాతం ఆదాయాన్ని కోల్పోతుంది.
  • పేదవారు నిరుపేదలై.. నిత్యావసరాలు కూడా కొనలేనంత దారుణ పరిస్థితులను ఎదుర్కోవచ్చు.
  • ఆర్థిక అసమానతలు ఎన్నడూ లేనంతగా పెరగబోతున్నాయి.

ఇవీ చదవండి:

అమెరికాలో విమాన రాకపోకలకు బ్రేక్.. అనేక గంటల తర్వాత పునరుద్ధరణ

రైల్వే స్టేషన్​లో కత్తితో బీభత్సం.. ఆరుగురిపై దాడి.. నిమిషంలోనే పోలీసుల ఆపరేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.