ETV Bharat / international

భారత్​ అభ్యంతరాలు బేఖాతరు, శ్రీలంకకు చైనా నిఘా నౌక

author img

By

Published : Aug 16, 2022, 12:41 PM IST

china ship sri lanka
china ship sri lanka

భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా చైనా నిఘా నౌక యూవాన్​ వాంగ్​ శ్రీలంక చేరుకుంది. దక్షిణ ప్రాంతంలోని హంబన్‌టొట పోర్టులో నౌకను మోహరించారు. ఈ విషయాన్ని ఓడరేవులోని హార్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డిసెల్వ ధ్రువీకరించారు.

China spy ship sri lanka: భారత్ అభ్యంతరాల మధ్యే చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక చేరుకుంది. శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని హంబన్‌టొట పోర్టులో ఈ నిఘా నౌకను మోహరించారు. ఈ విషయాన్ని ఓడరేవులోని హార్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డిసెల్వ ధ్రువీకరించారు. ఈనెల 22 వరకు ఈ నిఘా నౌకను అక్కడే ఉంచనున్నారు. బాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహాలను సైతం ట్రాక్ చేసే సామర్థ్యం ఉన్న ఈ నౌక శ్రీలంక తీరంలో ఉంటే తమ భద్రతకు ముప్పు అని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లోని కీలక రక్షణ వ్యవస్థలపై యువాన్ వాంగ్ నిఘా పెట్టే ప్రమాదం ఉందని పేర్కొంది. యువాన్‌ వాంగ్‌-5 క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్‌ చేయడం సహా 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. భారత్‌లోని కల్పకం, కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే యువాన్ వాంగ్-5 పరిశోధన, అధ్యయనం జరిపే నౌక మాత్రమేనని చైనా వాదిస్తోంది.

వాస్తవానికి ఈనెల 11నే యువాన్ వాంగ్ -5 నౌక శ్రీలంక చేరుకోవాల్సి ఉండగా.. భారత్ అభ్యంతరాలతో కొన్ని రోజులు ఆగాలని.. శ్రీలంక ప్రభుత్వం చైనాను కోరింది. శ్రీలంక సూచన మేరకు ఈ ప్రయాణం వాయిదా పడినట్లు ప్రచారం జరిగినా గత వారం యువాన్‌ వాంగ్‌ హంబన్‌టొట దిశగా.. వెయ్యి కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు గుర్తించారు. ఈ నౌక ప్రయాణాన్ని ఎందుకు వాయిదా వేయాలంటూ చైనా అధికారులు.. లంక అధికారులను ప్రశ్నించగా వారు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఫలితంగా నిఘానౌకకు శనివారం.. శ్రీలంక అనుమతి మంజూరు చేసింది.

ఈ నిఘా నౌక శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను ఆఫ్‌ చేయాలనే నిబంధనపై అనుమతి ఇచ్చినట్లు.. కొలంబో అధికారులు చెబుతున్నారు. శ్రీలంక జలాల్లో ఎలాంటి సర్వేలు నిర్వహించడానికి అనుమతించబోమని పేర్కొన్నారు. ఆగస్టు 16-22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని వివరించారు. హంబన్‌టొట అభివృద్ధికి.. చైనా 1.2 బిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చింది. శ్రీలంక చెల్లించలేకపోవడం వల్ల.. ఈ పోర్టును చైనా 99 ఏళ్లపాటు లీజుకు తీసుకుంది.

ఇవీ చదవండి: బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని 20 మంది సజీవ దహనం

ఆ దేశాల సంగతి చూద్దాం అంటూ పుతిన్, కిమ్​ ప్రేమ లేఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.