మేరియుపొల్​ థియేటర్‌పై బాంబుల వర్షం.. భారీగా మృతుల సంఖ్య!

author img

By

Published : Mar 17, 2022, 4:51 AM IST

Updated : Mar 17, 2022, 10:51 AM IST

Russia Ukraine War

Russia Ukraine War: ఉక్రెయిన్​పై రష్యన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. నివాస ప్రాంతాలని కూడా లెక్కచేయకుండా దాడులు కొనసాగిస్తున్న రష్యన్​ సేనలకు భయపడి వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నా.. ప్రాణాలు దక్కటం లేదు. మేరియుపొల్​ నగరంలో ఇదే పరిస్థితి నెలకొంది. వెయ్యి మందికిపైగా తలదాచుకుంటున్న ఓ థియేటర్​పై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధంలో బుధవారం భారీ ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. తీరప్రాంత నగరమైన మేరియుపొల్‌లోని ఒక థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఆ సమయంలో అక్కడ వెయ్యి నుంచి 1200 మంది వరకు పౌరులు తలదాచుకున్నారని సమాచారం. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారన్నది వెంటనే తెలియనప్పటికీ అధిక సంఖ్యలోనే మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. థియేటర్‌ భారీగా ధ్వంసమైనట్లు అందుబాటులోకి వచ్చిన చిత్రాలను బట్టి తెలుస్తోంది. రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగానే పౌరులపై మారణహోమానికి పాల్పడ్డాయని మేరియుపొల్‌ నగర పాలక సభ్యులు ఆరోపించారు. బాంబు దాడిలో ధ్వంసమైన థియేటర్‌ చిత్రాలను వారు టెలిగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. రష్యా క్రూరత్వాన్ని మాటల్లో వర్ణించలేమని పేర్కొన్నారు. నిరాయుధులైన మహిళలు, వృద్ధులు, చిన్నారులు సహా ఎవరినీ శత్రువు వదలిపెట్టడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత మేరియుపొల్‌ నగరంలో 3 లక్షల మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. నీరు, విద్యుత్‌, గ్యాస్‌ కొరత వారిని వేధిస్తోంది. ఆహారం, ఔషధాల నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ నగరాన్ని రష్యా సేనలు చుట్టుముట్టడం వల్ల మానవతా సాయం కూడా అందజేయడం కష్టమవుతోంది.

నిర్బంధంలో వైద్యులు, రోగులు

కీవ్‌, మేరియుపొల్‌ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్‌లో మరో ఇద్దరు పాత్రికేయులు బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వార్తల సేకరణ నిమిత్తం వెళ్లిన ఫాక్స్‌న్యూస్‌ పాత్రికేయుల వాహనంపై బాంబు దాడి జరిగింది. ఆ నగరంలో 12 అంతస్తుల అపార్ట్‌మెంటుపై దాడి జరగడం వల్ల ఆ భవంతి అగ్నికీలల్లో చిక్కుకుంది. రష్యా దళాలు మేరియుపొల్‌లో ఓ ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 400 మంది పౌరులను ఇళ్ల నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లాయి. 100 మంది వైద్యులు, రోగులను కూడా నిర్బంధంలో ఉంచాయి. నిర్బంధించిన వారిని మానవ కవచాలుగా రష్యా దళాలు ఉపయోగించుకుంటున్నాయని, ఎవరినీ బయటకు రానివ్వడం లేదని సమాచారం.

రష్యా దళాలపై ఉక్రెయిన్ దాడులు..

యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే రష్యా సేనలు స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో వాహనాలు, హెలికాప్టర్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. సైనిక నిఘా పరికాకరాలను తొలగించేందుకు రష్యన్లు ప్రయతిస్తున్నారని ఉక్రెయిన్​ సైన్యాధికారి వెల్లడించారు.

రంగంలోకి నౌకాదళం

దాదాపు 20,000 మంది పౌరులు మేరియుపొల్‌ నుంచి మానవతా కారిడార్‌ ద్వారా తరలివెళ్లారు. 12 పట్టణాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. రష్యా నౌకాదళం కూడా పెద్దఎత్తున దాడులు చేస్తోంది. ఖర్కివ్‌లో ప్రవేశించాలన్న రష్యా దళాల ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. శరీర భాగాలు ఛిద్రమై తీవ్ర గాయాలతో ఆసుపత్రులకు వస్తున్నవారిని చూసి వైద్యులు చలించిపోతున్నారు. చెర్నిహైవ్‌లో రొట్టె కోసం వరసలో నిల్చొన్నవారిలో 10 మందిని రష్యా దళాలు పొట్టనపెట్టుకున్నాయి. సైనికాధికారులు సహా మరో 15 మంది రష్యా అధికారులపై ఆంక్షలు విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. కెనడా ప్రధానితో పాటు300 మంది అధికారులపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు రష్యా కూడా ప్రకటించింది.

మేమే విజయం సాధిస్తాం: పుతిన్‌

ఒక ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్‌పై ప్రత్యేక ఆపరేషన్‌ కొనసాగిస్తున్నామని, దానిలో విజయం సాధిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. బుధవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. "ముందుగా ఆమోదం పొందిన ప్రణాళిక ప్రకారమే అంతా కచ్చితంగా జరుగుతోంది. పశ్చిమ దేశాలు మాపై విధిస్తున్న ఆంక్షలు మాపై దురాక్రమణ కిందికి వస్తాయి. ఇవి మమ్మల్ని ఏమీ చేయలేవు. ఇవి ఆర్థిక, రాజకీయ, సమాచార మార్గాల్లో మాపై చేస్తున్న యుద్ధమే. మాకు వ్యతిరేకంగా ఆర్థిక మెరుపు యుద్ధం చేయడంలో పశ్చిమ దేశాలు విఫలమయ్యాయి. మొత్తంమీద లక్షల మంది ప్రజల జీవితాలను మరింత దుర్భరం చేయడమే ఈ చర్యల ఉద్దేశంగా కనిపిస్తోంది. మాపై ఏదోవిధంగా ఆంక్షలు విధించాలని అనుకున్నారు. దీనికి మా మిలిటరీ ఆపరేషన్‌ను ఒక నెపంగా చూపిస్తున్నారు. దీనిని ప్రతిఒక్కరూ స్పష్టంగా గ్రహించాలి" అని పుతిన్‌ చెప్పారు.

రాజీకి ఆస్కారం ఉందన్న ఉక్రెయిన్‌

యుద్ధంపై ఉక్రెయిన్‌ తాజాగా స్పందిస్తూ- చర్చల ద్వారా రాజీకి కొంతమేర అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. యుద్ధం మొదలై మూడు వారాలు పూర్తి కావస్తుండడం, ఇప్పటికే 30 లక్షల మంది శరణార్థులుగా వలస వెళ్లిపోయిన నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఈ మేరకు ఆశాభావం వ్యక్తం చేసింది. ఓపికతో మరికొంత ప్రయత్నం జరగాల్సి ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో సందేశంలో తెలిపారు. రష్యా డిమాండ్లు మరింత వాస్తవికంగా ఉంటున్నాయన్నారు.

ఇవీ చూడండి :

Last Updated :Mar 17, 2022, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.