ETV Bharat / international

కరోనా విజృంభణ- ఐరోపా దేశాల్లో మళ్లీ 'లాక్​డౌన్​'

author img

By

Published : Nov 2, 2020, 9:05 PM IST

Germany launches 4-week partial shutdown to curb virus
కరోనాను అరికట్టేందుకు ఐరోపా దేశాల్లో మళ్లీ 'లాక్​డౌన్​'

కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచదేశాలు అతలాకుతలమవుతున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4.70 కోట్ల మంది కొవిడ్​ బారినపడ్డారు. వారిలో 12.07 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ను అరికట్టేందుకు ఐరోపా దేశాలు.. మరోసారి లాక్​డౌన్​ అస్త్రాన్ని ఎంచుకున్నాయి.

ప్రపంచంపై కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఇప్పటివరకు 4కోట్ల 70లక్షల మందికి వైరస్​ సోకింది. 12లక్షల 7వేల మందికిపైగా మహమ్మారి బలితీసుకుంది. కొవిడ్​ బారినపడిన వారిలో 3కోట్ల 38లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1.19 కోట్ల యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

జర్మనీలో మళ్లీ లాక్​డౌన్​..

కరోనాను అరికట్టేందుకు.. ఐరోపా దేశాలు లాక్​డౌన్​ విధించనున్నాయి. జర్మనీలో నాలుగు వారాల పాటు పాక్షిక లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. ఫలితంగా ఈ నెలాఖరు వరకు రెస్టారెంట్​లు, బార్​లు, సినిమా థియేటర్లు వంటివి మూతపడనున్నాయి. అయితే.. పాఠశాలలు, నిత్యవసర వస్తువుల దుకాణాలు, క్షౌరశాలలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ దేశంలోలో ఇప్పటివరకు 5.48 లక్షల మందికి వైరస్​ సోకింది. వారిలో 10,638 మంది చనిపోయారు.

స్పెయిన్​లో కర్ఫ్యూ..

స్పెయిన్​లో కరోనా మరోసారి పంజా విసురుతున్న తరుణంలో పాక్షిక లాక్​డౌన్​ అమలు చేయనుంది ఆ దేశం. రోజూ రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా కేసుల పరంగా ఆరో స్థానంలో ఉన్న స్పెయిన్​లో ఇప్పటివరకు 12.64 లక్షల వైరస్​ కేసులు వెలుగుచూశాయి. 35వేల 878 మంది కొవిడ్​తో మృతిచెందారు.

ఆయా దేశాల్లో కరోనా తీరు ఇలా..

  • రష్యాలో మరో 18,257 మంది మహమ్మారి బారినపడ్డారు. కేసుల సంఖ్య 16లక్షల 55వేలు దాటింది. మరో 238 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 28,473కు చేరింది.
  • ఇరాన్​​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మరో 8,289 మందికి కరోనా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య 4.78లక్షలకు పెరిగింది. వైరస్​ కారణంగా మరో 440 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 35,738కు చేరింది.
  • పాక్​లో ఒక్కరోజులోనే 1,123 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3.35లక్షలకు పెరిగింది. దాయాది దేశంలో ఇప్పటివరకు 6,835 మంది కరోనా కాటుకు బలయ్యారు.
  • నేపాల్​లో సోమవారం ఒక్కరోజే 2,933 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. బాధితుల సంఖ్య 1,76,500కు ఎగబాకింది. ఇప్పటివరకు అక్కడ 984 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: అధ్యక్ష పోరు: అమెరికా ఎన్నికల ఫలితాలు ఆలస్యం- ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.