ETV Bharat / international

'అందుకు ఐరాస భద్రతా మండలి సరైన వేదిక కాదు'

author img

By

Published : Aug 11, 2021, 9:08 PM IST

UN Security Council
యూఎన్​ఎస్​సీ

ఐరాస భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) సమావేశంలో దక్షిణ చైనా సముద్రం అంశాన్ని అమెరికా లేవనెత్తటంపై చైనా తొలిసారి స్పందించింది. ఈ అంశాన్ని చర్చించడానికి యూఎన్​ఎస్​సీ సరైన వేదిక కాదని వ్యాఖ్యానించింది.

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాలను భారత్ అధ్యక్షత వహించిన భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) సమావేశంలో అమెరికా వ్యతిరేకించిన నేపథ్యంలో చైనా బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని చర్చించడానికి యూఎన్​ఎస్​సీ సమావేశం సరైన వేదిక కాదని వ్యాఖ్యానించింది.

సముద్ర భద్రతను అమలు చేసేందుకు అంతర్జాతీయ, ప్రాంతీయ సహకారాన్ని అమలు చేయాలని అధ్యక్ష హోదాలో భారత్​ సోమవారం ప్రతిపాదించింది. యూఎన్​ఎస్​సీ​లో శాశ్వత సభ్యదేశమైన చైనా.. ఇందుకు సంబంధించిన తీర్మానంపై ఆమోదం తెలిపింది. అయితే.. ఈ సమావేశంలో దక్షిణ చైనా సముద్ర అంశంపై అమెరికా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. బుధవారం యూఎన్​ఎస్​సీ సమావేశంపై తొలిసారి స్పందించింది.

"భద్రతా మండలి సభ్య దేశాలు సముద్ర భద్రతా సమస్యలు విస్మరించరాదని చెప్పాయి. సముద్ర సంబంధిత నేరాలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నాయి. సముద్ర భద్రతకు చైనా అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. దక్షిణ చైనా సముద్రంపై అమెరికా చేసిన వ్యాఖ్యలను చైనా ప్రతినిధి అప్పుడే ఖండించారు. ఈ అంశాన్ని చర్చించేందుకు యూఎన్​ఎస్​సీ సమావేశం సరైన వేదిక కాదు."

-చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ

'సముద్ర భద్రత పెంపు - అంతర్జాతీయ సహకార ఆవశ్యకత' అనే అంశంపై ఐరాస భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చకు భారత ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. మహాసముద్రాలను యావత్‌ ప్రపంచ వారసత్వ సంపదగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాగర భద్రత విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఇందుకోసం ఐదు సూత్రాలను ప్రతిపాదించారు.

ఇదీ చూడండి: భారత విమానాలపై నిషేధం మరోసారి పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.