ETV Bharat / international

తాలిబన్లకు షాకిచ్చిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ

author img

By

Published : Aug 19, 2021, 5:19 AM IST

Updated : Aug 19, 2021, 6:34 AM IST

తాలిబన్లు తమ నిధులు తీసుకునేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తెలిపింది. అఫ్గాన్‌ ప్రభుత్వ గుర్తింపుపై స్పష్టత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

International Monetary Fund
తాలిబన్లు

అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) భారీ షాక్​ ఇచ్చింది. ఐఎంఎఫ్‌ వనరులు తీసుకునే హక్కును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కేటాయించిన నిధులను తీసుకునేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. అఫ్గాన్‌ ప్రభుత్వ గుర్తింపుపై స్పష్టత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

అంతకుముందు.. అఫ్గాన్ కోసం కేటాయించిన సుమారు 950 కోట్ల డాలర్ల నిధులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ స్తంభింపజేశారు. తాలిబన్ల చేతికి నిధులు అందకుండా చేసేందుకే ఈ ఆంక్షలు విధించారు.

ఈ విషయాన్ని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జానెట్ యెల్లెన్ ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిందని.. పాక్​కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. 'అమెరికాలో అఫ్గాన్ ప్రభుత్వానికి ఉన్న కేంద్రీయ బ్యాంకుల ఆస్తుల్ని తాలిబన్లకు అందకుండా చూస్తాం'అని ఓ అధికారి స్పష్టం చేశారని పేర్కొంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు అమెరికా విదేశాంగ శాఖతో పాటు శ్వేతసౌధాన్ని సంప్రదించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే కాకుండా, తాలిబన్లపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర చర్యలనూ బైడెన్ యంత్రాంగం పరిశీలిస్తోందని తెలిపారు.

అఫ్గాన్​కు వచ్చేందుకు..

మరోవైపు.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత దేశాన్ని వీడి పరారైన అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ.. తిరిగి అఫ్గాన్​కు వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని ఏఎఫ్​పీ వార్తాసంస్థ తెలిపింది. ఆయన దేశ ప్రజలతో మాట్లాడుతారని చెప్పింది. ​

Last Updated : Aug 19, 2021, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.