అత్యవసర వైద్య సామగ్రిపై, ముడిసరకులపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని చైనాను భారత్ కోరింది. భారత్కు కార్గో విమాన సర్వీసుల్ని తక్షణమే నడపాలని సూచించింది.
"ఆక్సిజన్ ఉన్న సిలిండర్లపై పెంచిన ధరలను తగ్గించాలి. భారత్కు నిలిపేసిన కార్గో విమానాల్ని తక్షణమే నడపాలి. ఈ అత్యవసర సమయంలో మేము ఆశించేది ఇదే."
-ప్రియాంక చౌహాన్, హాంకాంగ్లోని భారత రాయబారి
భారత్కు కరోనా సమయంలో 50 దేశాలు సహాయం చేశాయని ఈ సందర్భంగా ప్రియాంక గుర్తు చేశారు. కారణం లేకుండా కార్గోవిమాన సర్వీసుల్ని నిలిపేయడం సరికాదని అన్నారు.
కరోనా వ్యాపిస్తోందని ఏప్రిల్ 26 నుంచి చైనాలోని షిచువాన్ ఎయిర్లైన్స్ 11 కార్గో విమానాల్ని 15 రోజులపాటు భారత్కు రాకుండా నిషేధం విధించింది. అయితే కార్గో విమాన సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. కానీ ఇంతవరకు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కాలేదు.
'డిమాండ్ వల్లే ధరలు పెరిగాయి'
"అనతి కాలంలోనే వైద్య సంబంధమైన ముడిసరకుల కోసం భారత్ నుంచి భారీ డిమాండ్ రావడం వల్ల కొరత ఏర్పడింది. దాంతో ముడిసరకుల ధరలు పెరిగాయి" అని చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి హూవా చూయింగ్ అన్నారు.
ఏప్రిల్లో భారత్కు 26,000 వెంటిలేటర్లను, ఆక్సిజన్ సిలిండర్లను పంపించామని తెలిపారు. వాటితో పాటు 15,000 మానిటర్స్, 3,800 టన్నుల వైద్యసామగ్రిని, మందుల్ని పంపించామని గుర్తుచేశారు. మే, జూన్ నాటికి మరో 20టన్నుల వైద్యసంబంధిత ముడిసరకుల్ని పంపిస్తామని అన్నారు.
భారత్కు కార్గోవిమాన సర్వీసుల్ని తిరిగి ప్రారంభించాలని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని ఫోన్లో కోరారు. అయినా ఈ విషయంలో ఇంతవరకు ఏ కదలికరాలేదు.
ఇదీ చదవండి: భారత్-ఆస్ట్రేలియా విమాన సేవల పునరుద్ధరణ