ముంబయి దాడుల సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారన్న ఆరోపణలతో లఖ్వీని అదుపులోకి తీసుకున్నారు.
2015 నుంచి లఖ్వీ బెయిల్పై ఉన్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం పంజాబ్ రాష్ట్రానికి చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ) లఖ్వీని అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. అయితే ఏ ప్రదేశంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం వెల్లడించలేదు.
"ఉగ్రవాద నిధులను ఉపయోగించి లఖ్వీ డిస్పెన్సరీ(చికిత్స కేంద్రం)ని నడిపేవారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు ఆ డిస్పెన్సరీ ద్వారా నిధులు సమీకరించేవారు. వ్యక్తిగత ఖర్చులకు కూడా ఈ నిధులను ఉపయోగించుకునేవారు."
-సీటీడీ ప్రకటన
లఖ్వీ కేసును లాహోర్లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం విచారించనుందని సీటీడీ స్పష్టం చేసింది. లష్కరేతో సంబంధాలే కాకుండా.. ఐరాస ఉగ్రవాదుల జాబితాలో లఖ్వీ పేరు ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: రిపబ్లిక్ డే రోజున 'కిసాన్ పరేడ్'