ETV Bharat / international

ఆర్థిక మాంద్యంలోకి ఇండోనేషియా

author img

By

Published : Nov 5, 2020, 4:41 PM IST

recession
ఆర్థిక మాంద్యంలోకి ఇండోనేషియా

కొవిడ్​-19 మహమ్మారి కొనసాగుతున్న వేళ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండోనేషియా మాంద్యంలోకి వెళ్లింది. ఆసియా ఆర్థిక సంక్షోభం వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారి మాంద్యంలోకి జారుకుంది.

కరోనా మహమ్మారిని కట్టడి చేయటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇండోనేషియా.. ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. రెండు దశాబ్దాల క్రితంనాటి ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత తొలిసారి ఇండోనేషియా మాంద్యంలోకి జారుకుంది. తాజాగా ఆ దేశ కేంద్ర గణాంకాల విభాగం విడుదల చేసిన లెక్కలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి.

దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండోనేషియా జీడీపీ జులై-సెప్టెంబర్​ త్రైమాసికంలో 3.49 శాతం క్షీణించినట్లు వెల్లడించింది కేంద్ర గణాంకాల సంస్థ. ఇది వరుసగా రెండో త్రైమాసిక క్షీణతగా పేర్కొంది. అంతకుముందు త్రైమాసికంలో జీడీపీ 5.32 శాతం మేర తగ్గింది. జనవరి​-మార్చి కాలంలో 2.9 శాతం వృద్ధి చెందినప్పటికీ అది రెండు దశాబ్దాల్లో అత్యల్పమైనది.

కరోనా వైరస్​ విజృంభణను అడ్డుకునేందుకు అత్యవసరేతర సేవలను రద్దు చేశారు. చాలా కార్యాలయాలను మూసివేశారు. విమాన, రైలు ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రజలు ఇళ్లకే పరిమితమైన క్రమంలో రవాణా​, ఆతిథ్య విభాగాలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు వరుస త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ క్షీణించటాన్ని సాంకేతికంగా మాంద్యంగా పేర్కొంటారు. ఆంక్షలతో విమాన ప్రయాణాలు దెబ్బతినటం వల్ల చాలా ప్రాంతం మాంద్యంలోకి వెళ్లింది.

- సుహారియంటో, గణాంకాల విభాగం అధిపతి.

ఇండోనేషియా చివరిసారిగా 1997లో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. అప్పటి నియంత సుహార్టోను గద్దె దింపేందుకు ప్రధాన కారణమైంది.

ఫలించని ప్రభుత్వ ప్రయత్నాలు..

ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడొడొ నేతృత్వంలోని ప్రభుత్వం.. పన్నుల సడలింపు, సామాజిక మద్దతు, ప్రజారోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు చేయటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి యత్నించింది. వైరస్​తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు జూన్​లో సుమారు రూ.677.2 ట్రిలియన్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కానీ, కరోనా వ్యాప్తి, ప్యాకేజీ ఫలితమివ్వకపోటవం వల్ల ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆటంకం కలిగింది.

భారత్​ తర్వాతి స్థానంలో..

ఇండోనేషియాలో ఇప్పటి వరకు 4,22,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణాసియాలోనే తొలిస్థానం, ఆసియాలో భారత్​ తర్వాత రెండో స్థానంలో ఉంది. 14వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్​ నుంచి రోజుకు 4వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఇదీ చూడండి: 2021 నాటికి కడు పేదరికంలో 15 కోట్ల మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.