ETV Bharat / international

Wuhan lab: ల్యాబ్‌లో గబ్బిలాల పెంపకం..!

author img

By

Published : Jun 14, 2021, 2:41 PM IST

కొవిడ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. వుహాన్‌ ల్యాబ్‌ ప్రారంభ సమయంలోని ఓ వీడియోను స్కైన్యూస్‌ ఛానల్‌ ప్రసారం చేసింది. అందులో ఏముందంటే..

proves of bates in wuhan lab
హుహాన్​ ల్యాబ్​లో కరోనా

వుహాన్‌ ల్యాబ్‌పై అనుమానపు మేఘాలు మరింతగా అలముకొంటున్నాయి. కొవిడ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ల్యాబ్‌ ప్రారంభ సమయంలోని ఒక వీడియోను స్కైన్యూస్‌ ఛానల్‌ ప్రసారం చేసింది. దీంతో ఇక్కడ నుంచే కరోనా వైరస్‌ లీకయ్యిందన్న వాదనకు మరింత బలం చేకూరింది. తాజాగా స్కైన్యూస్‌ ఛానల్‌ 2017లో వుహాన్‌ ల్యాబ్‌ ప్రారంభం సందర్భంగా చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ చిత్రీకరించిన వీడియోను సంపాదించింది. దీనిలో శాస్త్రవేత్తలు బోన్లలో గబ్బిలాలను పెంచుతున్న దృశ్యాలు ఉన్నాయి. అంతేకాదు వారు గబ్బిలాలను పట్టుకొని వాటికి పురుగులను ఆహారంగా ఇస్తున్నట్లు కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. పదినిమిషాల నిడివిగల ఈ వీడియోకు 'వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పీ4 ల్యాబ్‌ నిర్మాణం, పరిశోధనలు' అని పేరుపెట్టారు. దీనిలో ఒక అధికారి మాట్లాడుతూ పీ4ల్యాబ్‌లో పరిశోధనలు జరిగే సమయంలో ప్రమాదాలు జరిగితే స్పందించే భద్రతా వ్యవస్థలు కూడా ఉన్నాయన్నారు. ల్యాబ్‌లో జరిగే పరిశోధనలను చిత్రీకరించేందుకు కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో ఏముంది..

ఈ ల్యాబ్‌ను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మొక్కుబడిగా నివేదిక ఇచ్చింది. 'పీ4 ల్యాబ్‌లోని యానిమల్‌ రూమ్‌లో వివిధ జంతువులు చక్కగా ఉండొచ్చు. సార్స్‌కోవ్‌-2 వంటి వాటిపై కూడా పనిచేయవచ్చు' అని తెలిపింది. అంతేకానీ, అక్కడ గబ్బిలాలను పెంచుతున్న విషయం పేర్కొనలేదు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంలోని పీటర్‌ డెస్జాక్‌ తీరు అనుమానాస్పదంగా ఉంది. ఆయన డిసెంబర్‌లో ఒక ట్వీట్‌ చేశారు. "వుహాన్‌ ల్యాబ్‌కు గబ్బిలాలను తీసుకురాలేదు. గబ్బిలాల శరీరం నుంచి వైరస్‌ నమూనాలు సేకరించాక.. ప్రకృతిలోకి వదిలేశాం. కేవలం వైరస్‌ నమూనాలు మాత్రమే ల్యాబ్‌కు చేర్చాం" అని పేర్కొన్నారు. కానీ, వీడియోలో మాత్రం బోన్లలో పెట్టిన గబ్బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మరో ట్వీట్‌ చేసి.. ల్యాబ్‌ల్లో గబ్బిలాలను పెంచరని.. కుట్రకోణాన్ని ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు.

డిజిటల్‌ ఆర్కైవిస్ట్‌ జెస్సీ ఈ వీడియో క్లిప్‌ను సంపాదించారు. 'వాట్‌ రియల్లీ హ్యాపెన్డ్‌ ఇన్‌ వుహాన్‌' అనే పుస్తకం రాసేందుకు ఈ వీడియో ఉపయోగించుకున్నారు. ఈ వీడియో చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందినది. ఈ వీడియోపై ఇప్పటి వరకు పీటర్‌ డెస్జాక్‌ స్పందించలేదు.

సార్స్‌కోవ్‌-2 వైరస్‌ వుహాన్‌లో వ్యాపించడానికి ముందే పీ4 ల్యాబ్‌లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారు. వీరిందరిలో కొవిడ్‌19 లేదా సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్‌ వద్దకు ఈ సమాచారం ఒక నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామి నుంచి వచ్చింది. దీనిపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రచురించింది.

డేటా ఇచ్చేందుకు నిరాకరణ..

ఎన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనావైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడంలేదు. ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నప్పుడు కెమెరాలో చిత్రీకరిస్తారు. ఆ క్లిప్‌లు కూడా ఇవ్వలేదు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన నిపుణుల బృందం చైనాలో 76,000 కొవిడ్‌ కేసుల్లో 92 మంది అక్టోబర్‌-డిసెంబర్‌ మొదటి వారం మధ్యలో అస్వస్థకు గురైనట్లు గుర్తించింది. వారి డేటాను ఇవ్వాలని కోరగా చైనా తిరస్కరించింది. ఇక వుహాన్‌లోని బ్లడ్‌బ్యాంక్‌లో 2019 డిసెంబర్‌ కంటే ముందు నమూనాలను పరిశీలిస్తామని పేర్కొంది. దీనికి కూడా చైనా నో చెప్పింది.

న్యూయార్క్‌లోని ది ఎకోహెల్త్‌ అలయన్స్‌ సంస్థ అధ్యక్షుడు, వైరాలజిస్టు పీటర్‌ డెస్జాక్‌ ఈ ల్యాబ్‌కు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ కరోనా వైరస్‌ తొలిసారి మనుషులకు సోకిందనే వాదనలను ఆయన మొదటి నుంచి ఖండిస్తున్నారు. లాన్స్‌ట్‌లో లేఖ ప్రచురణకు సంబంధించిన ఆర్గనైజింగ్‌, డ్రాఫ్టింగ్‌ బాధ్యతలు పీటర్‌ చూశాడు. ఆయన సమకూర్చిన నిధులతో వుహాన్‌ ల్యాబ్‌లో 'గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌' పరిశోధనలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రయోగాల్లో వైరస్‌లు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: కరోనా పాపం చైనాదేనా?

గబ్బిలాల నుంచి మరో కొత్త కరోనా వైరస్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.